కవికోకిల గ్రంథావళి
నీకేలయిట్టి ఘోరమరణము ప్రాప్తించినది? [దు:ఖించును]
విజ : [నిట్టూర్చుచు] అయ్యో ఎంతకష్టము! నేనెంత దురదృష్టవంతుఁడను! మీయింట నే నతిథినై యుండునప్పుడే యిట్టియిక్కట్టులు వాటిల్ల వలయునా?
శాంత : ఇందుకు ఎవరేమి సేయుదురు? దైవము మాయెడ క్రూరము. ముసలి ముప్పున నిట్టి పుత్రశోక మనుభవించుటకు మేమెవరికేమి యెగ్గుచేసితిమి?
మాధ : ఇదియంతయు స్వప్నమువలెనున్నది. నేను నమ్మఁజాలను. రాజశేఖరుఁడు మరణించి యుండఁడు.
శాంత : నీమాటలే సత్యమగుఁగాక!
పరిచారకుఁడు : అక్కడ ముగ్గురు నలుగురు మనుష్యులు పెనగులాడిన లాగా అడుగు గుర్తు లగుపడు తున్నాయి.
మాధ : అచ్చట చచ్చిపడియున్న అడవిపంది కళేబరమును చూచితిరా?
పరి : లేదండి దొరగారు.
మాధ : [ఆలోచించుచుండును.]
శాంత : [ఆతురతతో] మాధవా, నీకేదో కొంత తెలిసినట్లున్నది, దాఁచిపెట్టకుము. అడవిపంది యేమిటి - చెప్పుము? రాజశేఖరు నెవరు చంపిరి? ఆక్రూరకర్ముఁడెవ్వఁడైనఁ గాని వానిని కండలు కండలుగ చెక్కించి గ్రద్దలకు వేయించెదను. ఆ హంతకుఁడు నేన యైనను నన్ను మన్నించుకొనను.
విజ : మీరు ఘోరప్రతిజ్ఞచేయుచున్నారు. ఆడినమాట తప్పరని నాకు తెలియును. తొందర పడకుఁడు.