పుట:2015.373190.Athma-Charitramu.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 598

కళాశాల విడిచిన కొన్ని నెలలకు నాకచటినుండి సుమారు 1300 రూపాయిల యుపకారవేతన మీయఁబడెను. రెండుసంవత్సరముల క్రిందటనే "రక్షకనిధి" యాకళాశాలలో నేర్పడుట నాకింత చిన్నమొత్తము లభించుటకు గారణ మయ్యెను.

కొంతకాలమునుండి నాకనులు జబ్బుగ నుండెను. ఎన్ని సారులు సులోచనములు మార్చుకొనినను, నాకు లాభము గలుగ కుండెను. 1929 వ సం. డిశెంబరు తుది దినములలో నేను చెన్నపురి పోయి, వైద్యాధికారి ముత్తయ్యగారికిఁ గనులు చూపించితిని. కనులలో పొరలు పెరుగుచుండె నని యాయన చెప్పి, క్రొత్త సులోచనుము లిచ్చెను.

2. నూతనపరిస్థితులు

మా పెద్దమేనత్త భద్రమ్మగారి మనుమఁడును, మాతమ్ముఁడు వెంకటరామయ్య బావమఱఁదియు, మాకాబాల్యస్నేహితుఁ డును నగు మంత్రిరావు వెంకటరత్నమున కారోగ్యము చెడె నని తెలిసి, నేను 1929 వ సంవత్సరప్రారంభమున భీమవరము వెళ్లి, అచటినుండి తణుకు పోయితిని. మాతమ్ముఁడచటనే కొన్నిదినముల నుండి రోగిని గనిపెట్టుకొని యుండెను. ఆఫిబ్రవరినెలలోనె వెంకటరత్నము చనిపోయెను. పాప మతఁడు తనతోడియల్లుని కుమారుని దత్తత చేసికొని యొక సంవత్సరమైనఁ గాలేదు. మంచిభూవసతియు, ధన గృహాదులును గలవాఁ డయ్యును, వీని ననుభవింపక, నడివయస్సుననె యాతఁడు మృత్యువు వాతఁబడెను !