పుట:2015.373190.Athma-Charitramu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. సంఘసంస్కరణసభ 295

జరిగెను. నాఁడు సభలోఁ జదువఁబడినపద్యము లింట నాఁడువాండ్రకు నేను జదివి వినిపించితిని.

23 వ తేదీని నేను సెలవుగైకొనుటకు వీరేశలింగముగారి యింటి కేగితిని. వారిచరిత్రమును నా "జనానాపత్రిక"లో బ్రచురింపఁగోరి, వారి జీవితమునుండి కొన్ని ముఖ్యాంశము లాసమయమున నేను వ్రాసికొంటిని. ఆకాలమున వీరేశలింగమహాశయునినామము స్మరించినంతనే నామనస్సున ధైర్యోత్సాహములు ముప్పిరిగొనుచుండెను. వారివలెనే సంస్కరణపక్ష మవలంబించి, నా జీవితమును సార్థకపఱుచుకొన నా మహదాశయము.

24 వ తేదీని జరిగిన రాజమంద్రిప్రార్థనసమాజ ప్రత్యేక సభలో, సత్యసంవర్థనీపత్రికను పునరుద్ధరింపవలె ననియు, ఆపత్రికకు నేనును కనకరాజును సంపాదకులముగను, సాంబశివరావు వ్యవహార కర్తగను నుండునటుల తీర్మానమయ్యెను. నే నంతగ నిచ్చగింప కున్నను, మరల "సత్యసంవర్థని" నా మెడ కంటఁగట్టఁబడెను !

తలిదండ్రులయొద్ద వీడ్కోలొంది నేను బెజవాడ పయనమయితిని. అంతకుముం దొకటిరెండు దినములక్రిందట, ఒకరాత్రి భోజన సమయమున నాకును మాతండ్రికిని కుటుంబవ్యయముల విషయమై కొంత వాగ్వాదము జరిగెను. ఇంటికర్చులకు నెల కెంత కావలయు నను నాప్రశ్నమునకు మానాయన కమితకోపము వచ్చెను. తమకుఁ గావలసినసొమ్ము నేను క్రమముగ బంపకుండుటవలననే, కుటుంబ ఋణము పెరుఁగుచుండె నని మాతండ్రి మొఱ. అంత మాయిరువురకును జరిగిన సంఘర్షణమునకుఁ బిమ్మట నేను మిగుల వగచితిని. వయసు చెల్లిన యాతండ్రిని, మూర్ఛలచేఁ గృశించిన యాతల్లిని విడిచిపోవుటకుఁ గాళ్లాడక, నే నెంతో దైన్యమందితిని.