పుట:2015.373190.Athma-Charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 116

సంపద, దైవభక్తియు నే నెపు డైన ననుభవింతునా ? ఈయనవలె నీశ్వరసంసేవనార్థమై ప్రచారము సలుపుటకు నోఁచుకొందునా యని నన్ను నే సంప్రశ్నించుకొంటిని.

27. పరీక్షలు

23 వ తేదీని వెంకటరావు వ్యాధిగ్రస్తుఁ డయ్యె నని విని యాతనిఁ జూచుటకుఁ బోయితిని. ఆతఁ డిపుడు పడకనుండి లేవనే లేఁడు ? తీవ్ర ధాతుదౌర్బల్యమునఁ బడిపోయియుండెను. ఒక గొప్ప మహమ్మదీయవైద్యుఁడు మం దిచ్చుచుండెను. వ్యాధి నెమ్మదిపడు ననెడి యాశ లేకున్నను శక్తివంచన లేక తాను మం దిచ్చెద ననియు, రోగి దైవముమీఁదనే భారము వేయవలె ననియు, వైద్యుని యభిప్రాయ మని, నామిత్రుఁడు హీనస్వరమునఁ బలికెను. దైవమును నమ్ముకొనినయెడల, అతనికి రోగనివారణ మగు నని దైర్యము చెప్పితిని. కాని, తా నిపుడు సేవించు మందువలెనే నా మాటలును, నెగటు కాఁగా, వెంకటరావు : - "మిత్రుఁడా, న న్నీ సంగతిలో బాధింపకండి. దేవుఁడు గీవుఁడు అనెడి అసత్యానగత్య విషయములన్ని బైటనే పెట్టి, మరీ గదిలోకి రం డని వేడుకుంటున్నాను. నిజమైన యే యిహలోకవిషయమును గురించి యైన నాతో మాటాడ రాదా ? దైవమునుగురించి అప్రస్తుతప్రశంస చేసి, నా మనశ్శాంతికి భంగము కలిగింప వద్దని, నీకు, నీ దైవమునకు నమస్కారాలు చేస్తాను !" అని చెప్పివేసెను.

ఇంతకంటె విషాదకర మైనసంగతి యేది ? ఐనను, మన మేమియుఁ జేయలేని యిట్టివిషయములోనుపేక్షయే యుత్తమముగదా.