పుట:2015.372412.Taataa-Charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. ఇతర తాతాసంస్థలు.

జంషెడ్జి యారంభించిన పునాదులపైననే, ఆయన నియమించిన రీతినే, ఆయనకుమాళ్లు విజ్ఞానాలయమును, లోహ యంత్రాలయమును, జలవిద్యుచ్ఛక్తి, కర్మాగారములను, నిర్మింపజేసిరి; వారు బంధుమిత్రుల సహాయముతో వానిని క్రమముగ వృద్ధిజేసిరి.

జంషెడ్జికి రెండవకుమారుడగు రత్న తాతా 1871 లో జనించి, బొంబాయిలో విద్యాభ్యాసముచేసి, 1892 లో వివాహమాడి, తన తండ్రియొక్క పరిశ్రమలలో పాల్గొనెను; కాని ఆయన ముఖ్యముగ జంషెడ్జి బొంబాయినగరాభివృద్ధికై చేయు వివిధప్రయత్నములందు చాల సాయము చేయుచుండెను. బొంబాయినగరపు చుట్టుపట్ల స్థలములను బాగుచేసి, వాసయోగ్యముగజేసి, వానిలో పేటలు నిర్మింపజేయుటలో చాల కృషిచేసెను. బొంబాయిలో తన తండ్రికున్న వివిధభవనాదులను వృద్ధిచేసి, తండ్రిచేసిన దానములకు చాల సాయముచేసెను. ఆయనకు సాంఘికశాస్త్రమం దభిమాన మధికముగ నుండెను. బెంగుళూరు విజ్ఞానాలయమందు సాంఘికశాస్త్రము బోధించుటకును, అందు ప్రత్యేకపరిశోధనల జేయుటకును, తనతండ్రి యనంతరము తనవాటాఆస్తిలోనుండి పెద్దధర్మము చేయుటకు యత్నించెను; కాని ప్రభుత్వమువారు ఆర్ధికబాధాది కారణములచేత దాని నంగీకరింపరైరి.