విశ్వనాథనాయకుఁడు
29
వంతు కప్పముక్రింద రాజ్యాంగమునకుఁ జెల్లించుచుండిరి. యుద్ధకాలములందుఁ దమ ప్రభువాజ్ఞయైనయెడల మఱియొక మూఁడవ వంతు రాఁబడి సైన్యముల క్రిందను వినియోగించి వారికిఁ దోడ్పడుచుండిరి. తక్కిన రాఁబడిని వారు స్వేచ్ఛగా ననుభవింపుచుండిరి. రాజ్యాంగమునం దిట్టిపద్ధతు లవలంబించుటవలన పాళెగాం డ్రందఱును విశ్వనాథనాయనివారిపట్ల భక్తివిశ్వాసములతోఁ బ్రవర్తింపఁ గలిగిరి. ఒక్కొక్కప్పుడు రాజ్యాంగమునకు నెక్కువ సేవచేయఁగలిగిన పాళెగాండ్రకు విశ్వనాథనాయనివారు వారి కప్పములను గొనకయె వారలకు బహుమానములుగా విడిచిపెట్టుచుండెను. ఇతఁడు తనపాళయగాండ్రతోసహా విజయనగరసామ్రాజ్యమునకుఁ దోడ్పడుచు భక్తివిశ్వాసములతో సేవించుటచే నచ్యుతదేవరాయలవారి కాలమునఁగాని సదాశివదేవరాయలవారి కాలమునఁగాని వారి యాగ్రహమునకుఁ బాత్రుఁడు గాక యర్హ మర్యాదలకు భంగము లేకుండఁ దన పదవిని జక్కఁగాఁ గాపాడుకొనఁ గలిగియుండెను.
ఇత డత్యంత బాహుబలాఢ్యుఁ డని తెలుపుటకుఁ గాఁబోలు స్థానిక చరిత్రములయం దతిచిత్రము లగు కథలు కొన్ని వక్కాణింపఁబడి యున్నవి. అట్టివానిలో నొక్కిఅకథను మాత్రము చదువరుల వినోదార్థ మిందుఁ దెలుపుచున్నారము.
పాండ్యరాజ్యమునకుఁ దామే హక్కు దారులమని తొలుదొల్త విశ్వనాథనాయనివారి నెదుర్కొని పోరాడినవారు