పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

335


స్థితుఁ జేసి మిత్రకృత్యో
చితసత్కారము లొనర్చి సేమం బడిగెన్.

54


శా.

ధర్మం బెల్లెడఁ జెల్లునా ద్విజులవిద్యాగోష్ఠి రాజిల్లునా
దుర్మార్గంబు లడంగునా ప్రజలు సంతోషింతురా సత్క్రియా
మర్మం బేర్పడ జన్నముల్ జరుగునా మర్యాద వర్తిల్లునా
నిర్మూలంబుగ శత్రులం గెడపుదా నీలక్ష్మి సొంపెక్కఁగాన్.

55


శా.

హర్షం బొంది పురందరుండు ధరపై నందందుఁ గాలంబుల
న్వర్షంబు ల్గురియించునా తగిలి విద్వాంసుల్ ప్రశంసింతురా
ఘర్షింపంగల రీతి నీతి దెలియంగా విందురా కీర్తియు
త్కర్షం బందునె దీనులం గడపుదే దానం బనూనంబుగన్.

56


వ.

అనినం గృతాంజలియై మానవేంద్రుండు దానవేంద్ర నే నెంతవాఁడ న న్నింతకుశలం బడిగితివి నీవు మహానుభావుండవు.

57


సీ.

కశ్యపసుతుఁడు రక్కసులమేటి హి
        రణ్యకశిపుండు నీవంశకర్త యనఁగఁ
బరమవైష్ణవుఁడైన ప్రహ్లాదుఁ డద్భుత
        ఖ్యాతచరిత్రుండు తాత యనఁగ
వీరమాహేశ్వరుండై రూఢి కెక్కిన
        బాణాసురుఁడు కూర్మి పట్టి యనఁగ
దానవరక్షణజ్ఞానవిజ్ఞానాది
        గురుఁ డైనశుక్రుండు గురు వనంగ


ఆ.

నమరలోక మేలుట పరాక్రమ మనంగ
భువనమంతయు వితరణాభోగ మనఁగ
దేవదేవుండు హరి యిష్టదైవ మనఁగ
నీమహత్త్వంబు నాకు వర్ణింపఁదరమె.

58