పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 167

విరహిమృగంబుల వేఁటాడుమదనుండు
తివిరి పెట్టించిన దివియ యనఁగ
నమరంగ నింద్రాణి యాఖండలుని నివా
ళించెడు పసిఁడిపళ్ళెర మనంగ
తే. దోడుతోడన తనకెంపు వీడుచుండఁ
దిమిరపటలంబు కొంత మీఁదికిఁ జలింపఁ
దెలివిపడ లేతవెన్నెల మొలకలెత్తి
నిండుకొనియుండె నమృతాంశుమండలంబు. 107

ఉ. కోకములు న్సరోజములుఁ గుందుచుఁ గందుచునుండఁ గైరవా
నీకములుం జకోరములు నిక్కుచు సొక్కఁగ మానినీసము
త్సేకము నంధకారమును దిగ్గఁగ దిగ్గన లోకము న్నిజా
లోకము నుల్లసిల్లఁ గవిలోకము మెచ్చులు పిచ్చలింపఁగన్. 108

క. నడుమం గృష్ణుఁడు గలపా
ల్కడలిన జనియించి తండ్రికైవడి మూర్తిన్
బెడఁ గడరెడువాఁ డనఁగా
నుడుపతి తెలుపై కళంకయుతుఁడై మెఱసెన్. 109

క. తిమిరసముదాయమున న
ర్ధము నలుపై పూర్ణతుహినధామద్యుతి న
ర్ధము తెలుపై యాకాశము
యమునాగంగాంబుసంగమాకృతిఁ దాల్చెన్. 110

తే. మిత్రుఁ డేగిన యెడరున మేర దప్పి
వాలి చేకొన్న యిరులమన్నీలు పఱవ
యశముగతిఁ గ్రొత్తవెన్నెల దిశలఁ బర్వ
రాజు చనుదెంచె గగనదుర్గమున కంత.** 111