Jump to content

పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇందు యజ్ఞార్హంబులు వ్రీహియవమాషగోధూమాణుతిలప్రియంగుకుళు
ద్ధంబులన గ్రామ్యౌషధు లెనిమిదియు, శ్యామాక, నీవార, జర్తిల, గవేధుక,
వేణుయవ, మర్కటకంబులను నారణ్యౌషధు లాఱునంగాఁ బదునాలుగోషధు
లేర్పఱించి దీనిచేఁ బరాపరవిదులైన మునులు యజ్ఞంబు లొనరింతురు. ఎవ్వరి
చిత్తంబునఁ బాపంబు వృద్ధింబొందు వారు యజ్ఞంబులను వేదవేద్యుండగు
శ్రీహరిని దేవతలను నిందింతురు. అట్లు వేదాదినిందకులై దురాత్ములు దురా
చారులు కుటిలాశయులునై నిరయంబునం బడి దుఃఖభాగులై యాతా
యాతంబులం బొందుదురని చెప్పి శ్రీపరాశరుం డిట్లనియె.

142


గీ.

ఇట్లు జీవననిర్వాహ మేర్పడంగ, కమలగర్భుండు వర్ణాశ్రమముల కఖిల
ధర్మవర్తులలోకముల్ ధర్మములను, నేర్పు విఖ్యాతి నొందగా నేర్పరించె.

143


సీ.

సత్కర్మనిరతులై జరగుబ్రాహ్మణులకు, నొదవు ప్రాజాపత్యపదనివాస
మాహవశూరతాఖ్యాతు లౌరాజుల, కేంద్రసంస్థానసౌఖ్యంబు గలుగు
పరిపాటినిజకర్మపరులైన వైశ్యుల, కనువొందు వాయులోకాధివసతి
ద్విజపరిచర్యల వెలయుశూద్రుల కబ్బు, నవ్య వైభవము గాంధర్వపదము


ధర్మమర్యాద యింతైనఁ దప్పకుండ, జగము లెల్లను బాలించుసారసాక్షు
నక్షయాంశంబు తానగునబ్జగర్భు, నాజ్ఞ చొప్పది సుమ్ము సంయమివరేణ్య.

144


క.

అష్టాశీతిసహస్రవి, శిష్టమునీంద్రవ్రజంబు చెందెడిలోకో
త్కృష్టపద మధివసింతురు, స్పష్టత గురుకులనివాసపరులు మునీంద్రా!

145


క.

మౌనివర! సప్తఋషులు న, నూనత వసియించునట్టి యున్నతపదవిన్
బూనికతో వసియింతురు, వానప్రస్థులు సమగ్రవైభవ మొప్పన్.

146


చ.

అనిశము నిత్యకర్మపరులై విజితేంద్రియులై వినిష్టవ
ర్తన ఋతుకాలదారనిరతత్వము నొంది దయార్ద్రులై మనం
బున పరహింస మాని జనపూజ్యత నొందుగృహస్థు లొందువా
రనుపమ మైనబ్రహ్మనిలయంబు వినిర్మలధర్మవిత్తమా.

147


గీ.

చంద్రసూర్యాదులైనను జనుచుఁజనుచు, మగిడివత్తురు గాని సన్మౌనిచంద్ర!
ఎప్పుడును పునరావృత్తి యెఱుగ రవని, ద్వాదశాక్షరచింతనాధన్యమతులు.

148


సీ.

తామిస్రమును నంధతమిస్రమును రౌరవంబు మహారౌరవంబు వీచి
కాలసూత్రంబు సంఘాతంబు నివియాదిగాఁ బెక్కునరకముల్ గలవు వాని
యందు మునుంగుదు రధ్వరవ్యాసేధకారులు వేదంబు గర్హ చేయు
వారును నిజకర్మవర్గపరిత్యాగు లైనమానవులు నిట్లగుటఁ జేసి