పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహర్షులచేత వ్యస్తంబయ్యె. ఈ వైవస్వతమన్వంతరంబున ద్వాపరయుగం
బుల నిరువైయెనమండ్రు వ్యాసులు చనిరి. ప్రథమంబు ద్వాపరంబున స్వాయం
భువుండు తాన వేదంబు వ్యస్తంబు చేసె. ద్వితీయద్వాపరంబునఁ బ్రజాపతి
వ్యాసుండయ్యె. తృతీయద్వాపరంబున శుక్రుండు, చతుర్థద్వాపరంబున బృహ
స్పతి, పంచమద్వాపరంబున సవిత, షష్ఠద్వాపరంబునఁ బ్రభువైన మృత్యువు,
సప్తమద్వాపరంబున నింద్రుండు, అష్టమద్వాపరంబున వసిష్ఠుండు, నవమ
ద్వాపరంబున సారస్వతుండు, దశమద్వాపరంబున శ్రీధాముండు, ఏకాదశం
బునఁ ద్రికృష, ద్వాదశంబున భరద్వాజుండు, త్రయోదశంబున నంతకుండు,
చతుర్దశంబున ధర్ముండు, పంచదశంబునఁ ద్రయ్యరుణుండు, షోడశంబున ధనం
జయుండు, సప్తదశంబునఁ గృతంజయుండు, అష్టాదశంబున ఋణంజయుండు,
తదనంతరంబు భరద్వాజుండు, తదనంతరంబ గౌతముండు, తదనంతరంబ
హర్యాత్మ, తదనంతరంబ వేనుఁడు, తదనంతిరంబ వాజశ్రవుండు, తదనంతరం
బ సోముండు, తదనంతరంబ శుష్మాయణుండు, తదనంతరంబ తృణబిందుండు,
తదనంతరంబ ఋక్షుండు, తదనంతరంబ వాల్మీకి, అవ్వల నస్మజ్జనకుండైన శక్తి,
తదనంతరంబ నేను, నాతరువాత జతికర్ణుండు, అవ్వల కృష్ణద్వైపాయనుండు.
ఈయిరువదియెనమండ్రును నతీతవ్యాసులు. వీరిచేత వేదంబు నాలుగువిధం
బుల ద్వాపరాదులయందు విభజింపంబడియె వినుము.

47


క.

భావిద్వాపరమున సం, భావితుఁడగు ద్రోణసుతుఁడు భాసిలు వ్యాసుం
డై వేదచయము విస్మృత, మై వెలయింపఁగను భూసురాన్వయతిలకా.

48


సీ.

ప్రణవాఖ్య మేకాక్షరము బృహత్వము బృంహ, ణత్వమ్ము గలకతన న్మునీంద్ర
బ్రహ్మంబుసు మ్మందు బరఁగు భూర్భువరాది, సప్తలోకంబులు సకలవేద
తతియు సర్వంబును దాదృక్ప్రభావసం, భావిత మది వాసుదేవరూప
మక్షయ్య మధికగుహ్యము జగదుత్పత్తి, రక్షణనాశకారణము యోగ


గీ.

సాంఖ్యనిష్ఠాపరులకు శాశ్వతపుసుగతి, యమృత మాద్యంతరహిత మనంత మజర
మట్టిహరిరూపకప్రణవాభిధాన, మానితబ్రహ్మమునకు నమస్కరింతు.

49


వ.

ఆప్రణవంబునందు నున్న ఋగ్యజుస్సామాథర్వణవేదంబులు సర్వాత్మకుం
డగు పుఁడరీకాక్షుండు తాన వేదంబులు శాఖలునై విభజింపంబడియె.

50


క.

ఆదిని వేదంబు చతు, ష్పాదంబై శతసహస్రపరిమితమై లో
కాదృతమై వెలుగొందు శు, భోదయతన్ సకలసన్నుతోన్నతచరితా.

51


వ.

తదనంతరంబ సర్వకామధుక్కైన యజ్ఞం బయ్యె. అంత మత్పుత్రుండైనవ్యాసుం
డిరువైయెనిమిదవద్వాపరంబునఁ జతుష్పాదంబగు వేదంబు ఋగ్యజుస్సామా