Jump to content

పుట:విక్రమార్కచరిత్రము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41


నవరసోజ్జ్వలకావ్యనాటకాలంకార
        సమితి నామూలచూడముగఁ జూచె
ధర్మార్థకామశాస్త్రప్రపంచంబులు
        [1]పల్లవిపాటగాఁ బరిచయించె
వారణస్యందనవాహనారోహణ
        క్రమమున మర్మగర్మములు దెలిసె


తే.

నృత్యగీతవిద్యాప్రౌఢి నిర్వహించె
సకలదివ్యాస్త్రశస్త్రప్రశస్తి మించెఁ
దేజమున నొప్పి భట్టిద్వితీయుఁ డగుచు
విక్రమాదిత్యుం డసమానవిక్రముండు.

190


క.

మరువము మొలవఁగఁ దోడనే
పరిమళ ముదయించినట్లు, పరమజ్ఞాన
స్ఫురణము బాల్యమునప్పుడె
పరిణతమై భర్తృహరికిఁ బ్రభవించుటయున్.

191


ఉ.

ఎంతయువేడ్కతోఁ బరిచయించినవిద్యలయట్ల, వేదవే
దాంతరహస్యమర్మములు నమ్మహితాత్ముని కాత్మఁ దోఁచె, న
త్యంతము చోద్యమై మెఱయు నంజనమబ్బినవానికిన్ ధరా
క్రాంతము లైనపెన్నిధులు కన్నులకుం బొడచూపుకైవడిన్.

192


ఉ.

అందఱు నన్నివిద్యల మహామహులై విలసిల్లుచుండగా,
నందనులం గనుంగొని మనంబునఁ బొంగుచుఁ జంద్రగుప్తుఁ డా
నందమహాంబుధిన్ దినదినంబును దెప్పలఁదేలుచుండె, సం
క్రందనుకంటె వైభవపరంపర మించి యనేకకాలమున్.

193


శా.

తారుణ్యంబున నమ్మహీసురుఁ డొగిన్ ధర్మార్థకామక్రియా
చారంబుల్ సరిగాఁ జరించి, తుద మోక్షశ్రీ నపేక్షించి, సం
సారాంభోనిధియానపాత్రమగు శ్రీశైలంబుమీఁదం దపం
బారంభింపఁ దలంచి, నందనుల డాయం బిల్చి తా నిట్లనున్.

194
  1. పల్లెపాఠంబుగాఁ బరిచయించె, అని పాఠాంతరము