పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పుస్తకం ఆయా సంఘటనల కన్నా నిజంగా మారిషస్‌లో మనవారి జీవిత విశేషాలు, ఉద్యమాన్ని సజీవంగావించి చేస్తున్న వారి జీవిత గాథలు, తెలుగు నిలబెట్టుకోవడానికి సాగించిన, సాధించిన సాధనోపాయాలు కళ్ళకు కట్టినట్టుగా వివరించారు.

కూలీలుగా వెళ్ళి అష్టకష్టాలకు లోనై తమ స్వేదంతో సంపద చేకూర్చి సహనాన్ని కోల్పోకుండా తమ మాతృభాష యడల, తమ మాతృ భూమి యడల గల ఆపేక్షతో తాము వలస వచ్చిన ప్రాంతాన్ని కూడా మాతృ భూమిగా తలచి ఆదేశ దేశప్రజల సంస్కృతులతో, సహజీవనంలో వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడంలో చేసిన కృషి హృదయరంజకంగా విపులీకరించటం జరిగింది.

ఈ గ్రంథం చదువుతూపోతే, ఒకచోట విహార యాత్ర, మరొకచోట సాంస్కృతిక సమాజపరిణామ వివరణగా, మరొకచోట లోతులకు వెళ్ళిన చరిత్ర పరిశీలనగా, మరికొన్ని చోట్ల వివిధ ప్రాంతాలలో, దేశ దేశాలలో వున్న తెలుగువారి జీవన సరళి ఒక్క మారిషస్‌కు మాత్రమే కాక, దక్షిణ ఆఫ్రికా, ఫిజీ మరి యితర దేశాల్లో వున్న తెలుగు వంశ పరంపరలు కూడా చాటి చెప్పుతూ వచ్చినవి.

నాల్గవ ప్రపంచ మహాసభను దక్షిణ ఆఫ్రికావారు ఆహ్వానించడం హర్షదాయకం. నల్ల తెల్ల వివక్షతలతో మగ్గిపోయి, దానిని తుదముట్టించుటకు ఆనాడు మహాత్మాగాంధీ, ఈనాడు నెల్సన్ మండేలాలు సాగించుతున్న పోరాటం విజయం సాధించితే మనం వెళ్ళగలం. ఈలోగా వారు సాధించితే సరే, లేనిచో అమెరికాలోని తెలుగువారు ఆహ్వానించటానికి ముందుకు రావడం సంతోషించదగిన విషయం.

తెలుగువారు ఎక్కడ వున్నా తమ మాతృభాషను, మాతృభూమిని మరవకుండా ఆయా దేశ ప్రజలతో సహజీవనం సాగించి, తెలుగు గౌరవాన్ని యినుమడించుటకు ఈ గ్రంథం స్పూర్తినిస్తుందని విశ్వశిస్తాను. ఈ రచన సాగించిన శ్రీ బుద్ధ ప్రసాద్‌కు అభినందనలు.

వావిలాల గోపాలకృష్ణయ్య

అరండర్ పేట

గుంటూరు-2