పుట:భాస్కరరామాయణము.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు మహౌషధంబులు దెచ్చి మూర్ఛల మునింగియున్న యన్నరేంద్రనందను
లకు సుగ్రీవాదులకు నాంజనేయుండు నమస్కరించె నాసమయంబున.

1117


చ.

మెలఁగెడు నౌషధానిలము మెల్లనిచోఁకున మర్మసంధులన్
బలువిడిఁ గొన్నశస్త్రములఁ బాసి శరీరము లొప్పఁ బ్రాణము
ల్నెలకొని కాలు సేయి గదలించుచు నూర్పులు వుచ్చి లోచనో
త్పలములు విచ్చి చూచి రొగిఁ బర్వినమూర్ఛలు దేఱి రాఘవుల్.

1118


తే.

తరుచరావలియు విశల్యకరణివలన, నెఱఁకులాడిన యలుఁగులు పెఱికిపోయి
తుడిచినట్టుల గండ్లును నడఁగి మేని, గనియ లన్నియు సంధానకరణి నదికి.

1119


క.

సావర్ణ్యకరణి నయ్యై, పావనతనుకాంతు లెసఁగఁ బ్రాణంబులు సం
జీవనిచే నెలకొన ని, ద్రావస్థలఁ బాసినట్టు లమరెం జూడన్.

1120


సీ.

అప్పుడు సుగ్రీవుఁ డాదిగా నగచరు, లినసుధాంశులభంగి నెసఁగి వెలుఁగు
పార్థివసుతులకుఁ బ్రణమిల్లి హనుమంతుఁ, గొనియాడి రా రాజకులవిభుండు
పవననందనుఁ జూచి పాకశాసనునాజ్ఞ, నెమ్మితో మనకు మన్నింపవలయు
నీకొండఁ దొంటిచో నిడిరమ్ము నావుడు, వెస నాతఁ డట్ల కావించి వచ్చె
నంత నుదయాద్రిమీఁదికి నరుగుదెంచె, దాశరథులముఖారవిందంబు లలరఁ
గపులు మగుడఁ బ్రాణంబులు గలిగి వెలుఁగు, కడఁకఁజూడ నేతెంచినకరణిఁ దరణి.

1121


చ.

నగచరనాథుఁ డంత రఘునాథుఁ గనుంగొని కుంభకర్ణుఁ డా
దిగఁ గలవీరు లెల్లఁ గడతేఱి రనేకులు శూరశూన్య మీ
నగరము లంక నింకఁ గదనం బనుమాటలు సిక్కె నేగతిన్
మొగియఁడు పంక్తికంఠుఁడు సముద్ధతి పెం పఱి యుద్ధకేళికిన్.

1122


ఆ.

కాన నేఁటిరాత్రి గాకుత్స్థకులవీర, కపుల నెల్ల లంక గాల్పఁ బనుపు
మనిన నాన రేంద్రుఁ డట్ల నియోగించె, సకలవృక్షచరుల సమ్మదమున.

1123


ఉ.

అంత నిశాచరేంద్రుపుర మంతయుఁ గాల్పఁ బ్లవంగవీరు ల
త్యంతకుతూహలంబున దినాంతము గోరఁగ నంతరిక్షగో
శాంతరవీథి శోభిలుచు నంబుజబంధుఁడు వారుణాంబుధిన్
ప్రాంతము సేరె జక్కవలు పశ్చిమభాగము సూడ నోడఁగన్.

1124


ఆ.

అట్లు సేరి యంత కంతకు నరుణిమం, బెసఁగ నస్తశిఖరి కెరఁగి క్రుంకె
నింక మంట లడరు లంక ని ట్లనుభంగిఁ, బరఁగె సంజకెంపు పశ్చిమమున.

1125


క.

ఘనముగ సంధ్యారాగము, నినుపార నిషిద్ధవేళ నిద్దుర వోవం
గని కమలంబుల నగువిధ, మునఁ గుముదము లొయ్యనొయ్య మూతులు విచ్చెన్.

1126


క.

దిక్కాంతలు గాటుకఁ గడుఁ, బిక్కటిలం గరవటమునఁ బెట్టినగతి నీ
ది క్కాది క్కనకుండఁగ, నక్కజ మగునంధకార మఖిలముఁ గప్పెన్.

1127


వ.

ఇత్తెఱంగున రోదోంతరంబు నిరంతరధ్వాంతం బగుటయుఁ గనుంగొని.

1128