పుట:భాస్కరరామాయణము.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అగు నింక మావిభీషణు, తగవును నివ్విధమ యంచుఁ దఱిమినఁ బై పై
మగుడఁ దలపాటు వ్రేటును, నగపాటును బోటు నాటు నై యని సెల్లన్.

484


వ.

మున్ను గలంగి తొలంగి యున్నయాతుధాను లందఱుఁ గూడుకొని.

485


శా.

వీఁ డావానరసేనకుం బతి మహావీరుండు సుగ్రీవుఁ డ
న్వాఁ డీయొక్కఁడు పట్టువడ్డ మనపై వా రెవ్వ రేతేర రె
వ్వాఁడుం దక్కక తాఁక రం డనుచు నార్వన్ నవ్వి కార్యంబుమై
వాఁ డై యక్కపిరాజు దాఁటె దివి మోవంగా సువేలాద్రికిన్.

486


మ.

మగుడఁగ దాఁటి నిల్చి తను మర్కటు లచ్చెరువంది చూడఁ గే
ల్మొగిచిన భూవిభుండు ధృతి మున్ను గదల్చినసందియంబు పో
నెగిచి ముదంబుతో నతని నిమ్ములఁ గౌఁగిటఁ జిక్కఁ జేర్చె మె
చ్చుగ రణధూళిసమ్మిళితశోణితపంకము వక్ష మంటఁగన్.

487


ఉ.

ఇట్టులు గారవించి మది నెవ్వరు నీయసహాయసాహసం
బిట్టులు సేయఁగాఁ దలఁతురే యవిచారితకర్మ మందు నీ
కెట్టులు సెల్లెనో యనుచు నేము దలంకఁగ నీవు నాకు నై
యట్టులు సిక్కినం బిదప నయ్యెడుమే లది యేల చెప్పుమా.

488


ఉ.

అక్కడ నీకుఁ గీ డొదవినట్టిద యైన సబాంధవంబుగా
రక్కసుఁ జంపి రాత్రిచరరాజ్యవిభూతి విభీషణుండు పెం
పెక్క నయోధ్య మాభరతుఁ డేలఁగ నే నియమించి దేహముం
దక్కెడువాఁడ నైతి నుచితస్థితి వేగిరపాటు లొప్పునే.

489


క.

నావుడు ని ట్లను నాసు, గ్రీవుఁడు నరనాథ మీరు గినిసిన నా కా
దేవద్రోహిం గని రో, షావేశము రాక యున్నె యె ట్లయినఁ దుదిన్.

490


వ.

అనిన విని సంతోషించి యారఘుపుంగవుం డంత లక్ష్మణుం గనుంగొని యింక
లంకమీఁదఁ దడయక విడియవలయు వివిధప్రకారంబుల సురమునుల కప
కారం బాచరించునక్తంచరులనాశంబునకై మహోత్పాతంబులు వొడముచున్న
యవి కృష్ణరక్తపరివేషభీషణంబును బరిస్ఫురితతారకంబును నగుమార్తాండ
మండలంబువలన మంటలు దెగిపడియెడు ననేకరాక్షసరూపంబులు గయికొని
మేఘంబులు నెత్తురు సిలికెడుఁ బ్రపాతవేగంబున నగశృంగంబులు విఱిగికూలెడు
దీనకరాభిముఖంబు లగుచు సృగాలంబులు వాపోయెడు నిట్టిదుర్నిమిత్తంబులు
గానంబడుటయ కాక నాకు నాంగికంబులు నాస్త్రిక్యంబులు నగుశుభసూచకం
బు లెన్ని గల వన్నియుం గలిగియున్నయని మనకు జయం బవశ్యంబు నగు నను
చు నయ్యచలంబు డిగ్గి సన్నద్ధకవచుండును గాంచనసూత్రనిబద్ధతూణీరుండును న
ధిజ్యధనుర్ధరుండును బాణపాణియు నై తాను ముంగలను సుగ్రీవవిభీషణులు గె
లంకులను సైన్యంబునడుమను సుమిత్రానందనుండు పిఱుందను జాంబవత్ప్రము