పుట:భాస్కరరామాయణము.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మంతుండు కరం బవలంబించి చని దుర్దరంబు ప్రవేశించి యొక్కవిపులశిలాత
లంబున జాంబవత్పనసగజగవయగవాక్షులనడుమ నఖిలవనచరపరివృతుం డ
గుచు నాసీనుం డై యుండ నంగదుండు హనుమంతున కి ట్లనియె.

525


ఉ.

క్షోణిఁ బయోధి దాఁటి యిటు చూడఁగ నెవ్వఁడు వచ్చు నీకు గీ
ర్వాణులు సాటి గారు రఘురాముఁడు రాగిల సీతఁ గంటి మా
ప్రాణము లెల్లఁ గాచితి నృపాలశిఖామణిపాలికి జగ
త్ప్రాణతనూజ నీదుతగుప్రాపునఁ బోయెద మిప్డు నెమ్మదిన్.

526


వ.

అని పల్కె నంత జాంబవంతుండు హనుమంతున కి ట్లనియె.

527


ఉ.

శరనిధి నెట్లు దాఁటితి నిశశాచరుపట్టణ మెట్లు చొచ్చి తే
వెరవున సీతఁ గంటి పృథివీసుత యే మనెఁ గ్రూరరాక్షసో
త్కరముల నేగతిన్ మొఱఁగి క్రమ్మఱి వచ్చితి పోలఁ జెప్పుమా
తరుచరవీర నావుడు ముదంబున వారల కాతఁ డింపుగన్.

528


సీ.

జడనిధి దాఁటుచో నడుమ మైనాకంబుఁ, గనుటయు సురస వచ్చినవిధంబు
సింహికాహింసయు సింధునిస్తరణంబు, లంకాభిముఖతయు లంక సాచ్చి
సీతఁ గాంచుటయును సీతతో భాషించు, టయు వనక్షతి సేయుటయు నిశాట
భటులఁ ద్రుంచుటయును బంధక్రమంబును, బంక్తికంధరుదూఱఁ బల్కుటయును
లీల బంధవిముక్తుఁడై వాలవహ్ని, లంకఁ గాల్చుటయును నకలంకచరిత
సీతఁ గ్రమ్మఱఁ గాంచి భాషించుటయును, జెప్ప నందఱు ముద మంది చెలఁగి రపుడు.

529


క.

అంగద నిజసేనాజయ, సంగదుఁ డుద్దండసమరచండాహితవీ
రాంగదుఁ డురుమణిమయకన, కాంగదుఁ డంగదుఁడు గపుల నందఱఁ బల్కెన్.

530


క.

జానకిఁ గొనపోవక రఘు, భూనాయకుకడకు రిత్త పోవుట మెచ్చే
పూనిక మన మాసతిఁ గొని, రా నేఁగుద మబ్ధి దాఁటి రావణుపురికిన్.

531


క.

మీ రేటికి మీపనుపున, వారిధి లంఘించి లంక వడిఁ జొచ్చెద నా
కారులఁ బొరిపుచ్చెద ధా, త్రీరమణునిదేవి నేన తెచ్చెదఁ గడిమిన్.

532


చ.

ప్రకటబలోద్ధతిం గడఁగి రావణి నాపయిఁ గిన్క బావకాం
బకమును మారుతాస్త్రమును బాశుపతప్రదరంబు బ్రహ్మసా
యకమును నైంద్రబాణమును యామ్యకరంబును నేయ లెక్క సే
యర్ర దశకంఠముఖ్యదివిజారుల నెల్ల వధించి వచ్చెదన్.

533


చ.

పవనతనూజుఁ డొక్కరుఁడ బాహుబలంబున సర్వరాక్షస
ప్రవరుల ద్రుంప నోపు ఋషభద్వివిదుల్ గజుఁడున్ గవాక్షుఁడున్
గవయుఁడు మైందుఁడున్ నలుఁడు గాఢబలుల్ పనసుండు మేటి యా
హవమున జాంబవంతుఁ జెనయం గలవీరులు లేరు గావునన్.

534


వ.

మన మిందఱముఁ బోయి జనకనందనం గొనివత్తమొ కాక యేన పోయి తెత్తు