పుట:భాస్కరరామాయణము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చరులం జూచి రోషావేశంబున.

442


క.

శరశల్యాతతజిహ్వుం, డురుకార్ముకభోగయుతుఁడు నుద్ధురతేజ
స్స్ఫురితవిషుండును నై భీ, కరపంచాస్యాహికరణిఁ గ్రాలుచు నుండన్.

443


క.

ధీరుఁడు లక్ష్మణుఁడు గృహ, ద్వారంబునయందుఁ గనియెఁ దారాసుతుఁ డౌ
తారాసుతునిన్ లక్ష్మణుఁ, డీరస మెసఁగంగఁ జూచి యి ట్లని పలికెన్.

444


క.

రామునియనుజన్ముఁడ నే, సౌమిత్రిని రామునాజ్ఞఁ జనుదెంచితి సౌ
త్రామిజ వే చెప్పుము రు, గ్ధామజుతో ననిన నతఁడుఁ దరణిజుతోడన్.

445


ఉ.

అచ్చుగ రామభూవిభునిభయానతి లక్ష్మణుఁ డుగ్రతేజుఁ డై
వచ్చినవాఁడు వాకిటి కతవారితరోషముతోడ నావుడుం
జెచ్చెర భానునందనుఁడు చిత్తములోనఁ గలంగి చింతిలం
జొచ్చెఁ దదాజ్ఞ నంగదుఁడు శూరకపిప్రకరంబుఁ బంపినన్.

446


వ.

అప్పు డతిసత్త్వసంపన్ను లైనయాకపియూథపులు బరవసంబునఁ బఱతెంచి
కోటచుట్టును గవంకులం గలయ నలమి వజ్రసంకాశఘోరఘోషంబులు చెలంగ
లక్ష్మణుసమీపంబున సింహనాదంబులు సేయఁ దద్భూరిఘోషంబులం దారవా
క్యంబులం బ్రబోధితుం డైనసుగ్రీవుండు తనమంత్రులు వినతనలనీలసుషేణహను
మదంగదప్రముఖబలీముఖులు తన్నుఁ బరివేష్టింప సురగణపరివృతుం డైనసురేం
ద్రుండునుంబోలెఁ గ్రాలుచుండి మంత్రాలోచనంబు సేయం దొడంగిన మంత్ర
సిద్ధికొఱకు నమ్మంత్రు లుపన్యసించు ప్రభుమంత్రోత్సాహధర్మార్థప్రపంచప్రకా
రంబు లుపలక్షించి మంత్రులయనుమతంబున లక్ష్మణాగ్రహాభివ్యగ్రుం డగు
సుగ్రీవుం గనుంగొని సర్వామాత్యులును ధర్మార్థయుక్తనీతివాక్యంబుల నాతనిఁ
బ్రశాంతుం జేసిరి ధీమంతుం డగుహనుమంతుండు మఱియు ని ట్లనియె.

447


ఉ.

ఆతతరాజ్యదాయకులు నత్యుపకారులు సత్యసంధులున్
భ్రాతలు రామలక్ష్మణులు రామునిపంపున దారితాహిత
వ్రాతుఁడు లక్ష్మణుం డిటకు వచ్చినవాఁడు మహోగ్రకోపుఁ డై
యాతనిఁ జూచి భీతిఁ గపు లార్చెద రెంతయుఁ గంపితాత్ము లై.

448


చ.

ముదమునఁ బుత్రమిత్రభటముఖ్యులు మంత్రులుఁ దోడఁ గూడి రా
నెదురుగ నేఁగి మస్తకసమేతకరాబ్జము లొప్ప మ్రొక్కి స
మ్మర మొనరించి లక్ష్మణుని మానుగఁ దోడ్కొని వచ్చి కామిత
ప్రద మగుచున్న నీసకలరాజ్యము వర్ధిలఁజేయు నేర్పునన్.

449


మ.

తగ నారాసుతుఁ దెచ్చి సంతసము నొందం జేయు రా కుండినన్
మగుడం బుచ్చుము మిన్నకుండు టిది ధర్మం బైన చందంబె నీ
మొగసాలన్ నిలువంగఁ బాత్రమె మహాత్ముం డవ్విభుం డల్గినన్
జగముల్ నీఱుగఁ జేయ నోపు నతిభీష్మక్రోధదుర్వారుఁ డై.

450