పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/782

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

భారతదేశమున


మూడవ ఆనుబంధము

మింటోమార్లే రాజ్యాంగసంస్కరణలు

శాసనసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకొను హక్కును కోరుచు కాంగ్రెసుమహాసభచాల తీర్మానములను చేసియుండెను. మఱియు కార్యనిర్వాహక సభలందు భారతీయులుండవలెనని కూడా కోరియుండెను. ఈరెండుసంస్కరణములును రాజ్యాంగ ప్రణాళికలలోచేర్చినచో మితవాదులు తృప్తిజెందుదురని నాటి రాజ్యాంగ కార్యదర్శియగు మార్లే వైస్రాయియగు మింటో ప్రభువు 1909 లో ఆప్రకారముగావించిరి. ప్రభుత్వమువారి పాచిక పారినది. ఈరాజ్యాంగ సంస్కరణలను వీని ప్రకారము ఏర్పడిన శాసనసభలను ఈ మితవాదిప్రముఖులు మహాప్రసాద మని కన్నుల కద్దుకొనిరి. ఆ శాసనసభలలో ప్రవేశించి ప్రభుత్వమునకు కృతజ్ఞులై ప్రభుత్వము వారికి ప్రత్యుపకారముగా ముద్రణాలయముల చట్టమనబడు స్వాతంత్ర్యనిరోధక శాసనము నొకదానిని వెంటనే 1910 లోనే శాసించుటకు తోడ్పడిరి. దీనివలననే విడదీసి పాలించు ప్రభుత్వరాజ్యతంత్రమెట్లు సఫలతగాంచినదీ బోధపడగలదు. ఈ చట్టమువలన రాజద్రోహ నేరములను గావించునట్లు ప్రభుత్వము నిర్ణయించు పత్రికల ధరావతులను ముద్రణాలయములనుగూడ ప్రభుత్వము వశము జేసికొనుషరతులుగూడ చేర్చబడెను. ఇట్లు భారతదేశ ప్రజలకు పూర్తిగా వాగ్బంధముగూడ చేయబడెను. ఈసభల సహాయముతో 1911 లో రాజద్రోహకర సభాసమావేశము గూడ చేయబడెను.