పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ

265


12 వేల కేసులింకను నిలువయుండెను. భారతీయ కమిషనర్లు 342184 కేసులు పరిష్కరింపగా 149827 కేసులు నిలువ యుండెను.

కారన్ వాలిసు చేసిన సివిలు క్రిమినలు సంస్కరణముల వలన రివిన్యూ కలెక్టర్లజులుము కొంత తగ్గినమాట వాస్తవము. దౌర్జన్యములుకూడ కొంత తగ్గినవి. కాని షాహుకారులును న్యాయవాదులును కోర్టులద్వారా జనసామాన్యమును పీడించుట ప్రారంభమైనది.

కారన్ వాలిసు పోవునాటి కీ విశాలమైన 'బ్రిటిషు ఇండియా'యొక్క జనసంఖ్య 10 కోట్లు. ఇట్టిస్థితిలో కంపెనీ ప్రభుత్వము చేసిన ఏర్పాట్లు ఏమూలకును సరిపోలేదు. దేశములోని ప్రజలతో కలసిమెలసియుండు భారతీయుల సహాయము పొందకుండ ఆంగ్లేయులే న్యాయవిచారణ జరుపదలచిరి. ఇది కష్టసాధ్యమైనపని. అందుకొరకు నియమింపబడిన ఆంగ్లేయ జడ్జీలకు దేశభాషలురావు. దేశీయుల ఆచారవ్యవహారములు తెలియవు. వారిక్రింద తక్కినపనులన్నియుచేయు కోర్టుగుమాస్తాలు చాల చిన్నజీతగాండ్రు. అందువలన వారిలో లంచగొండితనము ప్రబలమైనది. వీరు తమకు లంచమిచ్చినవారికి మాత్రమే న్యాయవిచారణ సౌకర్యములను కలుగజేయు చుండిరి. దొరలు పనిచేయలేక దావాలు పెరిగిపోయినందున విచారణలో కాలహరణము జరుగుచుండెను. లెక్కలేనంతమంది సాక్షులు ఇళ్లువాకిళ్లు పనులు వదలుకొని దూరప్రదేశముల నున్న కోర్టులకుపోయి చాలరోజులు పడియుండ