పీఠిక
15
మీఁది చర్చవలన సోమనాథుని బ్రాహ్మణత్వము నిర్వికల్పముగా నిలువఁగలదని నేను నమ్ముచున్నాఁడను.
సోమనాథుని గురువులు
శ్రియాదేవియు, విష్ణురామిదేవుఁడును నీతనికిఁ దల్లిదండ్రులని యిదివఱకే వ్రాసితిని. ఈతనికి గవితావిద్య నేర్పిన విద్యాగురుఁడు కరస్థలి విశ్వనాథుఁడు.
“సకృపాత్ముఁడగు కరస్థలి విశ్వనాథు
ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడ.
-బసవపురాణము
గీ. “విమలచిత్ప్రపూర్తి విశ్వేశవరమూర్తి
వినయవర్తి భువనవినుతకీర్తి
విభుకరస్థలంబు విశ్వేశుకారుణ్య
జనితవిమలకావ్యశక్తియుతుఁడ.”
-అనుభవసారము
ఈతనికి శివదీక్ష నొసఁగిన గురుఁడు గురులింగార్యుఁడు -
'గురులింగవరకరోదర జనితుండ', 'గురులింగ తనూజుండ', 'పేరెన్నఁ బడిన శ్రీ బెలిదేవివేమ-నారాధ్యుఁడను పరమారాధ్యదేవ, మనుమని శిష్యుండ మద్గురులింగ - ఘనకరుణాహస్త గర్భసంభవుఁడ.'
పయివాక్యములవలన బెలిదేవి వేమనారాధ్యుల మనుమఁడయిన గురులింగార్యుఁ డీతని దీక్షాగురుఁడని తెలియనగును. సంస్కృతపండితారాధ్యచరిత్రమునఁగూడ నిట్లే కలదు.
“బెల్దేవి వేమనారాధ్య ప్రశిష్యస్య కృపానిధేః
గురులింగార్యస్య దయాహస్త గర్భ సముద్భవః.
'మనుమ'డనఁగా నాచార్యవంశమున మనుమఁడని సంస్కృతగ్రంథకర్త గ్రహించెను. కావుననే 'ప్రశిష్యస్య' అనెను.