పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

215


మొత్తంబులగు నుత్తమమత్తకాశినీసహస్రంబులును, కందర్ప
సౌందర్యంబులు డిందుపఱిచి సుందరీజనసందర్శనానందమంది
రంబులై పెంపొంది డెందంబు లిందిరామందిరుండగు గోవిందు
పదారవిందమకరందరసాస్వాదనపరవశంబులై యుండ నిత్య
యౌవనంబునం గ్రీడించు దివ్యపురుషులును, సకలపదార్థశోభిత
విపణివీథికావిలసితంబును, నిరంతరపఠ్యమానశ్రుతిస్మృతిపురా
ణేతిహాసవేదాంతసిద్ధాంతంబులు గల దివ్యమునిసహస్రంబులుం
గలిగి రాజహంససంచారరహితం బయ్యును రాజహంసవిహార
స్థలంబై, పురుషోత్తమనివాసం బయ్యును బుణ్యజనవర్జితంబై,
క్రతుకర్మఫలానుభవస్థలంబు గాకుండియుఁ గ్రతుకర్మవిరాజ
మానంబై, అమృతార్ణవంబు గాకుండియు నమృతస్థలంబై, సకల
మంగళావాసంబై సౌఖ్యాస్పదంబై యొప్పారు నప్పురంబు చతు
ర్ద్వారవిలసితం బగు. అందుఁ బూర్వద్వారంబునఁ జండప్రచండు
లును దక్షిణపువాకిట భద్రసుభద్రులును పడమటిగవనియందు
జయవిజయులును నుత్తరంబున ధాతృవిధాతృలును జక్రముసల
ముద్గరభిండివాలశూలాద్యనేకశితాయుధపాణులగు భటసహ
స్రంబులతోఁ గాచుకొనియుండుదురు. కుముదకుముదాక్షపుండ
రీకవామన[1]శంకుకర్ణసర్పనేత్రసుముఖసుప్రతిష్ఠితప్రముఖు
లైన యారెకు లనేకు లనేకాయుధంబులతోఁ బురరక్షకులై యుండ
నభేద్యంబగు నన్నగరమధ్య ప్రదేశంబునందు.

150


శా.

ప్రాసాదంబులు సాలభంజికలు వప్రంబు ల్కనత్కుట్టిమ
వ్యాసక్తిం గలకుడ్యము ల్వివిధరమ్యస్తంభము ల్భద్రముల్
శ్రీసంపన్నమహామణిప్రభలతోఁ జెన్నొంద నేత్రోత్సవో
ల్లాసంబై హరిమందిరంబు వొలుచున్ లక్ష్మీసమారూఢమై.

151


వ.

అయ్యంతఃపురమధ్యంబునందు.

152
  1. శంఖ (ము)