పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

భవసంతాపహరు శ్రీ
ధవు నిన్ను భజించి పరమధామములో గౌ
రవ మంది నిత్యసూరి
ప్రపరులతోఁ గూడియుండ్రు పావనమూర్తుల్.

463


మ.

శరతూలం బనలంబు సోఁకినయెడన్ సందగ్ధమై పోవున
ట్లురుదుర్వారతరౌఘజాలములు మాయున్ నిన్ను నీక్షింప నో
పరమోత్తంస రమాధినాథ కరుణాపాత్ర ప్రసన్నాత్మ దృ
క్పరిపూర్తిన్ మముఁ జూడు మీపదము సంభావ్యంబు మా కెప్పుడున్.

464


క.

అని వినుతించు మునీంద్రులఁ
గని పురుషోత్తముఁడు వారిఁ గరుణించి సుశో
భనమధురవచోవిస్తర
మునఁ బల్కెఁ దదీయహృదయములు గరఁగంగన్.

465


సీ.

స్వాగతంబే మీకు సంయమివరులార
                       సుఖము మీకే మిమ్ముఁ జూచినపుడె
యానందమందితి నరయ మద్భక్తులే
                       మత్ప్రాణములు జగన్మహితయోగి
వరజనశ్రేష్ఠులు వాత్సల్యగుణనిధుల్
                       పరమలాభంబ తత్ప్రాప్తి మీకు
యుష్మదాగమనమహోద్యమంబునకుఁ గా
                       ర్యం బెఱింగించుఁ డత్యంతభక్తి


తే. గీ.

సంశ్రితత్రాణమునకునై సకలరూప
ములు వహింపుదు నని కృపఁ బలుక వారు
ఘనుఁ బరాశరసూనునిఁ గాంచి సన్న
చేసి నియమింప నమ్మౌనిసింహుఁ డనియె.

466


వ.

స్వామీ! నీయష్టాక్షరాత్మకంబైన మంత్రంబు పరమమంత్రంబు తన్మం
త్రోపదేష్టవు నీవు గాన నేము నీశిష్యులము. దేవదేవుండవు నీవె.
గురుండవు నీవె. తల్లివి నీవె. తండ్రివి నీవె. శ్రీమన్నారాయణా! నీకంటెఁ
బరమబంధుండు గలఁడే. ఎఱుఁగని యది యెఱింగించుటయుఁ బ్రవ
ర్తింపఁజేయుటయు నీకే తగును. నీవే సమర్థుండవు. సర్వంబు నీచేతనే
తెలియవలయు. పరమధామంబులలో దోషనిర్ముక్తంబైన స్థానం బెయ్యది
యని విన్నవించిన భగవంతుఁ డిట్లనియె.

467