పుట:కాశీమజిలీకథలు-05.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ప్ర :- ఆ మాట నిశ్చయమే యిక మనము చేయవలసిన పని యెద్ది.

ద్వి :- మన కెట్లైన నేమి? యీ కాయంబున నమ్మహాత్ముండు స్థిరముగా నుండిన మనదేశము ప్రజలు మిక్కిలి ధన్యులగుదురు. అదియే యాలోచింపవలయును.

ప్ర :- అతని శరీర మెక్కడనో నిగూఢప్రదేశమున విడువబడియుండును. కావున మనమెట్టిస్థలములెల్ల వెదకించి కనబడిన శవము నెల్ల విచారింపకయే దహింపుడని కింకరుల రహస్యముగా నియోగింపవలయు. వెదకించి యతని శరీరము దగ్ధము గావించితిమేని యతం డెల్లకాలము నిందేయుండును.

ద్వి :- నీ యాలోచన సమంజసముగా నున్నది. కాని రా జెరుంగకుండ మనము కింకరుల కె ట్లాజ్ఞాపింతుము?

ప్ర :- అయ్యో ప్రొద్దుటి రాజశాసనము నీవు వినలేదు కాబోలు.

ద్వి :- లేదు లేదు. ఎట్టిదో చెప్పుము.

ప్ర :- తాను జేడియలతో గూడ గ్రీడాశైలంబున కరిగియందు గొన్ని దినములు వసియించునట. రాజకార్యములన్నియు మనలనే చక్క బెట్టుకొనుడని మనకు స్వతంత్రాధికారమిచ్చి రాజముద్రికల నంపినాడు. ఇక మనమేమి చేసినను రాజుగారికి దెలియజేయవలసిన యవసరము లేదు.

ద్వి :- అలాగునా? ఆజ్ఞాపత్రిక నేను జూడలేదు. అట్లయిన మనమనుకొనినట్లు నిరాటంకముగా జరిగింపవచ్చును.

ప్ర :- ఎప్పుడో యననేల యీ దినముననే యట్టివారల నియమింపుము. వల్లెయని పలికినంత నందరు నిష్క్రమించిరి.

అయ్యమరకనృపాలుండు రాజ్యంబు మంత్రుల యధీనంబు గావించి పట్టణంబున కనతిదూరములో నున్న క్రీడాశైలమునకు నూర్గురు భార్యలతో నరగి యందు ఫలదకుళకుసుమవిసరమనోహరతరునికరపరివృతమగు నుద్యానవనములో స్పటికశిలాసంఘటితసోపానమండితంబైన సౌధాతరంబున యమునాతీరంబున గోపికలతో శ్రీకృష్ణుండువోలె నయ్యంగనలతో ననంగతంత్రపాండిత్యంబు దేటపడ నిట్లు క్రీడించెను.

మదుపానమదంబున గలధ్వనులు గలిగి యీషత్స్వేదయుక్తంబులై మనోహరభాషణములతో నొప్పి పులక లుదయింప సీత్కారములతో గూడి పద్మసౌరభములు గలిగి సిగ్గుచే మూయబడిన కన్నులతో నొప్పి వ్యాపించిన మన్మథోదేక్రముతో నలుకలు చెలింప దీపించు నించుబోణుల మోముల జుంబించి చుంబించి యబ్భూపతి కృతకృత్యుండయె.