శ్రీ శంకారాచార్య చరిత్రము
73
శ్రీరస్తు
కాశీమజిలీకథలు
50 వ మజిలీ
తృతీయోల్లాసము
ఒకనాడు నారదుండు దేవలోకమునుండి పుడమికి వచ్చుచుండఁ దుంబరుం డెదురుపడుటయు వారిరువురకును నిట్లు సంవాదము జరిగినది.
తుంబురుఁడు - దేవమునీంద్రా ! తొందరగాఁ బోవుచుంటిరి నెక్కటికేమి? ఎందుండి వచ్చుచుంటివి?
నారదుఁడు - తుంబురుడా యేమి! నేను కైలాసమునుండి వచ్చుచున్నవాఁడ. భూలోకమునకుం బోవుచుంటి. తొందరపనియే యున్నది.
తుంబు — అది యేదియో చెప్పవచ్చునా! రహస్యమా?
నార - రహస్యము వంటిదే. అయినను నీవు నాకుఁ బరమాప్తుండవు గావున వక్కాణించెద నెక్కడను వెల్లడి చేయవు గదా!
తుంబు - నీవు వలదని నుడవినప్పుడు ప్రకటింతునా?
నార — [మెల్లగా] మహేశ్వరుండు పుడమియందు శంకరావతారమెత్తిన కథ నీ వెరుంగుదువా?
తుంబు - ఎరుఁగ నెరుఁగ నది చెప్పవలయు.
నార — విష్ణుండు బుద్ధవతారమెత్తి తద్ధర్మముల నెల్ల బుడమి వ్యాపింప జేసిన వార్తయేని విని యుంటివా?
తుంబు — ఆ కథ యెరుంగుదును. త్రిపురదానవకాంతల వంచించుటకై వైకుంఠుండు బుద్ధుఁడై యవతరించినదియేనా?
నార - అగునదియే తచ్ఛాస్త్రంబులం జదివి బుద్ధమతస్తులు వర్ణాశ్రమాచారంబులు వమ్ము సేయుచు శ్రుతిదూషకులగుటయుఁ గ్రతుభోక్తలు క్షితిహవిర్భాగంబు లిచ్చువారలు లేమింజేసి చింతించి యా వృత్తాంతముఁ గంతువైరి కెఱింగించిరి.
తుంబు — అన్నప్రదాతలు లేనిచో విచారముకాదా! తరువాత తరువాత.