336
కాశీమజిలీకథలు - ఐదవభాగము
క. నీవా చంద్రాపీడుఁడ
వావైశంపాయనుండె యౌ నీశుకమో
భూవర! మీ కిత్తరి శా
పావిలదోషావసానమై యొప్పుటచే.
మీ యిరువురును శాపావసానంబున సమముగా సుఖియింపఁ గలరని వీని నీచెంతకుఁ దీసికొనివచ్చితిని. లోకసంపర్కపరిహారమునకై చండాలజాతిం బ్రకటించితిని.
ఇప్పుడు మీ యిరువురును జన్మజరామరణాదిదుఃఖబహుళములగు శరీరముల విడిచి యథేష్టజనసమాగమసుఖంబుల ననుభవింపఁగలరని పలుకుచు నమ్మాతంగకన్యక మంజీరరవంబు ఘల్లురని మ్రోయఁ బాదంబులం నేలందట్టి యంతరిక్షమున కెగిరి యదృశ్యయై దివమునకుం బోయెను.
పిమ్మట నమ్మనుజపతి యయ్యువతి వచనములు వినినంత జాతిస్మరణ గలుగుటయుఁ గాదంబరిం దలంచుకొనుచుఁ గ్రమంబునఁ గాదంబరీవియోగసంతాపంబునం గృశించి కందర్పశరాసారఘాతంబునం దుదకుఁ గాలధర్మము నొందెను. ఆ చిలుకయు శాపావసానమైనది కావున నయ్యొడయనితో గూడ నయ్యొడలు విడిచినది.
అంత నక్కడఁ గాదంబరియు నొకవసంతకాలంబునఁ గామోత్సవంబు గావించి వాడుకప్రకారము ప్రాతఃకాలంబునఁ జంద్రాపీడుని దేహము నర్చించి యుత్సుకముతోఁ గంఠము గౌఁగలించుకొనినది.
అప్పు డమృతసేకంబునం బోలె నయ్యాలింగనసుఖంబునఁ జంద్రాపీడుఁడు మేనం బ్రాణములు జేరుటయు నాతపసంతాపంబున ముకుళించిన కలువ శరత్కాలకౌముదిచే వికసించినట్లు మెల్లన హృదయ ముచ్ఛ్వాసభాసురంబయ్యె. ప్రాతఃపరామృష్టెందీవరముకుళము మాట్కి కర్ణంతాయతమగు నయనయుగము విడినది. మోము పద్మవికాస వహించినది.
అట్లు నిద్రమేల్కాంచినట్లు లేచి చంద్రాపీడుఁడు మెడఁ గౌఁగలించి యున్న కాదంబరిని జిరవిరహదుర్లభములగు లోచనములచే గ్రోలువాడుంబోలెఁ జూచుచు గంఠంబు గౌఁగలించుకొని వాతాహతబాలకదళియుంబోలె వణంకుచుఁ గన్నులు మూసికొని తొట్రుపడుచున్న యాచిన్నదానికి మనోహరస్వరముచే నానందము గలుగఁజేయుచు నిట్లనియె.
బోటీ! నీవు వెరవకుము. నీకరస్పర్శంబుదగిలి నేను జీవించితిని. అమృతసంభవంబగు నప్సరఃకులంబున నీవు జనియించితివికదా. శాపదోషంబున నిన్నిదిన