పుట:కాశీమజిలీకథలు-05.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

కాశీమజిలీకథలు - ఐదవభాగము

డైన స్మరించినదా! యని యడిగిన నబ్బోటి దేవా! దేవర వచ్చిన తరువాత నందు జరిగిన విశేషములం జెప్పెద దత్తావధానులై వినుండని యిట్లనియె.

మీరల్లనాఁ డుదయంబునఁగదా! యఱిగితిరి. మీరు వెళ్ళిన గొంత సేపటికి కాదంబరి పరిజనులను విడిచి నన్ను బాహ్యోద్యానవనమునకుఁ దీసికొనిపోయి అందు మరకతసోపానములచే దీపించు ప్రమదవనవేదికయందు మణిస్థంభ మూతగాఁ గూర్చుండి ముహూర్తకాల మూరకొని యెద్దియో పలుక నిశ్చయించి రెప్పవేయక పెద్దతడవు నా మొగము చూచినది.

అప్పుడు నే నామె యభిప్రాయము గ్రహించి, అయ్యో! తొయ్యలీ! భయపడియెదవేల? యెద్దియేని జెప్పవలసియున్న జెప్పుము. నన్నన్యఁగా దలంపకుమని పలికిన విని యక్కలికి పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు మాటిమాటికి నలుమూలలు సూచుచు జెప్పఁదలఁచు కొనియు సిగ్గుపెంపున గంఠము గద్గదికబూన నెలుంగురాక యూరకొని తలవంచి కన్నులనుండి ప్రవాహంబుగా నీరు గార్చినది.

మఱియు నేను పలుమారు, మగువా! నీకిది తగునా? కారణ మెద్దియో చెప్పుము. ఊరక కన్నీరు నించెదవేలనని యడుగగా నతి ప్రయత్నముతోఁ గన్నీరు దుడిచికొనుచు వక్తవ్యాంశమును నఖశిఖరములచేఁ గేతకీదళముల వ్రాసి యంతలో జించివైచి తెగువలై సిగు దిగద్రోచి తలయెత్తి యత్త్వ సారెసారెకుఁ గన్ను లప్పళించుచు నాకిట్లనియె.

సఖీ! పత్రలేఖా! నిన్నుఁ జూచినది మొదలు నా హృదయము వయస్య లందరికన్న నీయందు విశ్వాసము గలిగియున్నది. కారణమేమియో తెలియదు. బోఁటీ! నాపరిభవ మెవ్వరితోఁ జెప్పుకొందును? నా దుఃఖము పంచుకొని యనుభవించువారెవ్వరు? ఇప్పుడు నా ప్రాణసంకట మెఱింగింప నీకన్న నా కాప్తులు గనఁబడలేదు. కాంతా! నా సంతాపమంతయు నీ కెఱింగించి జీవితము విడుచుచున్నదాన, నిష్కళంకమైన కులము కళంకపరచి కులక్రమాగతమగు సిబ్బితిమబ్బుచేసి సామాన్యకన్యవలె నాబోటి బోఁటి చిత్తచాంచల్యమందఁ దగినదా! అన్నన్నా! అనాథవలె నీచవలెఁ బలాత్కారముగాఁ జంద్రాపీడుని కారణంబున నిందాపాత్రురాల నయితినే! అయ్యో! గొప్పవారికిట్లు చేయుట దగునేమో చెప్పుము. పరిచయమున కిదియా ఫలము అభినవబిససుకుమారమగు నామనం బతండిట్లు పరిభవింపవచ్చునా? కటకటా! యూనులకు గుమారికాజనము పరిభవింపఁదగినదే? సఖీ! నా హృదయము దహించుచున్నది. ఇంక నేను బ్రతుకజాలను. జన్మాంతరమందైన నీ సాంగత్యమే కోరుచున్నదాన. నీవంటి వయస్య నాకులేదు. నా కళంకమును ప్రాణపరిత్యాగప్రాయశ్చిత్తంబునఁ గడిగికొనియెదనని పలికి యూరకుండెను.

అప్పుడు నేనవ్విధమేమియు నెఱుఁగమింజేసి మిక్కిలి భయపడుచు విషాదముగా నిట్లంటి.