పుట:కాశీమజిలీకథలు-05.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

285

గీ. కలికి తత్కాలజనిత శోకప్రవృత్తి
    బ్రియవయస్యనుఁ జూచుచుండియుఁ గడంక
    నాపలేదయ్యఁ దనచూపు లతనిమీఁదఁ
    బడక యుండఁగ నెన్ని యుపాయములను॥

అశ్రుజలపూరితనయనయై యజ్జలజనయన ముహూర్తకాల మూరకొని యంతలోఁ దనకుఁ దాంబూల మీయఁబోవుఁడు వారించుచు మహాశ్వేత యిట్లనియె. సఖీ! మనమందరము క్రొత్తచుట్టమైన యీ రాజకుమారు నారాధింపవలయును. కావున ముందుగా నతనికిఁ దాంబూల మిమ్మని పలికిన విని యక్కలికి యించుక యడ్డముగా మొగము వంచి సన్నని యెలుంగున ప్రియసఖీ! పరిచయము లేకపోవుటచే నిచ్చుటకు నాకు సిగ్గగుచున్నది దీనింగైకొని నీవేవారికిమ్ము. అనవుఁడు మహాశ్వేత ముఖరసనాచలనసంజ్ఞచే వారించుచు నట్లనకుము. నీవే యీయవలయునని పలుమారు బోధింప నెట్టకే యంగీకరించినది.

మహాశ్వేత మొగమునుండి దృష్టుల నాకర్షింపకయే మేను గంపము నొందఁ గన్నులుమూసికొని నిట్టూర్పులు నిగుడించుచు నొడలంతయుఁ జెమ్మటలు గ్రమ్మ సాధ్వసపరవశయై యతిప్రయత్నముతో నప్పల్లవపాణి తాంబూలగర్భహస్తపల్లవము చాచినది.

అప్పుడు చంద్రాపీడుఁడును దనుర్గుణాకర్షణకృతకిరణశ్యామలమయ్యు స్వభావపాటలమై యరుణనఖకిరణ లలితములగు నంగుళులచేఁ బొలుపొందు కరతలంబు తాంబూల మందికొనుటకై చాచెను.

అప్పుడు తద్విలాసములం జూచుటకు వేడుకకలవియుం బోలె నెక్కడి నుండియోవచ్చి రసములన్నియు నామెయందుఁ బ్రవేశించినవి.

శ్వేదజలపాతపూర్వకముగా మన్మథునిచేత నీదాసజనము నీకీయఁబడినది. స్వీకరింపుమని తన్నర్పించుకొనునట్లు ఇది మొదలు మదీయ జీవితము నీ హస్తమందుండఁగలదని స్థాపించుచున్నట్లు కాదంబరి యతనిచేతఁ దాంబూలమిడినది. పిమ్మట భుజలతానుసారముగాఁ గరకిసలయమును లాగికొనుచు ననంగశరభిన్నమధ్యమగు హృదయమువోలెఁ జేతనుండి జారిపడిన రత్నవలయమునుఁ దెలిసికొనజాలదయ్యెను.

మరియొక తాంబూలము మహాశ్వేత కిచ్చి యచ్చేడియ పచ్చవిల్తుని రాయిడిం బడియున్న సమయంబున నొకశారిక వారికడ కరుదెంచి తన్నుఁ దరిమికొనివచ్చిన చిలుకం జూపుచుఁ గాదంబరి కిట్లనియె.

భర్తృదారికా? కాదంబరీ! నన్ను బాధింపుచున్న యతి దుర్వినీతుఁడగు నీపతంగాధము నేమిటికి వారింపవు? వీనిచేఁ బరిభవింపఁబడుచున్న నన్నిఁక నుపేక్షించితివేని నీ పాదములాని తప్పక ప్రాణముల విడిచెదను జుమీ! అని పలికినంతఁ గాదంబరి యించుక నవ్వినది.