22
కాశీమజిలీకథలు - ఐదవభాగము
బొడసూపి, ఆర్యా! నీవేమిటికిట్లు కాయమును గ్లేశపరచుచుంటివి. నీ యభీష్టమేమి యని యడిగిన శివగురుండు పుత్రునిమిత్తమని యాకలలోనే యుత్తరముఁజెప్పెను.
అప్పుడు శివుండు శివగురునితో నీకు నల్పాయువు సుగుణ సంపన్నుండు లోకైకవిఖ్యాతుండైన సుతుండొక్కండు కావలయునా? యల్పబుద్ధులు, దుర్గుణులు, దీర్ఘాయువులు నగు సుతులు పెక్కండ్రు కావలయునా? యని యడిగిన నా విప్ర పుంగవుండు ధ్యానించి యల్పాయువయ్యు లోకైక విఖ్యాతుండైన వాని నొక్కనినే దయసేయుండని కోరికొనియెను.
అప్పు డప్పరమేశ్వరుఁడట్టి వరమిచ్చి యంతర్హి తుండైనతోడనే శివగురుండు మేల్కొని యల్పాయువనుమాట తప్ప తక్కిన స్వప్న వృత్తాంతమంతయు సతీదేవి కెఱిగించిన నమ్మించుబోణియు మంచి కుమారుం డుదయించునని మిగుల సంతసించెను. ఆ దంపతులంతటితో నియమములు చాలించి బాహ్మణసంతర్పణంబు గావించి తదాశీర్వాదములనంది యానందింపుచు విప్రభుక్తావశిష్టమగు నన్నమును భుజించిరి.
సతీదేవి గర్భవర్ణనము
ఆ దినమందే శైవతేజ మాయన్నమునఁ బ్రవేశించి శివగురుని శరీరమున వ్యాపించి పిమ్మట నతని పత్నియందుఁ బ్రవేశించినది.
క. వనితారత్నముగర్భం
బునవాసరమధ్యమందుఁ బొలుపొందువిక
ర్తను గాంతివోలె నత్తఱి
ఘనతేజంబొకటి మెఱసెఁ గడుచిత్రముగన్.
గీ. అఖిలవిష్టపభరవహుఁ డష్టమూర్తి
గర్భగతుఁడై ప్రకాశింపఁగా నొకింప
యలసగతియయ్యె నయ్యంబుజాక్షియనుచు
బలుకుటిదియొక యబ్బురంబా? తలంప.
క. గురుకుచ గురుకుచయుగమిష
నరవిందభవుండు సూతనామృతపూర్ణాం
తరకనక కలశయుగ్మము
విరచించెన్ దుగ్ధపాన విధియోగ్యముగాన్.
ఉ. ఆ తరళాక్షి గర్భగతుఁడైన కుమారుఁ డనంతరంబునన్
ద్వైతమత ప్రశూన్యమత వాదములన్ని రసించియంచితా