పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

స్సుతోఁగదా యీభూమి చేయఁబడినది! ఇప్పుడు భూమండలమంత కాదుగదా శిరస్సులో మాద్వీపమంత మెదడున్నవాని నొక్కని జూపుము. జనులంతకంత కల్పాకాయులగుచున్నందున కీయొక్క నిదర్శనము చాలదా? అల్పకాయులు నల్పశక్తులు నగుటచేతనే మావారంతకంత కల్పాయుష్కులు కూడ నగుచున్నారు.
సత్య ---- త్రేతాయుగమునుండి నేఁటివఱ కొక్క పురుషుఁడే మీ లంకను రాజ్యము చేయుచుండగా మీవా రల్పాయుష్కులనెదరేమి?
మహా---- చిరకాలజీవి గనుక విభీషణుఁ డొక్కఁడు మాత్రమింతకాలము రాజ్యము చేసినాఁడు. అప్పుడే రెండు యుగములలో నాతని రాజ్యకాలములోనే పండ్రేండు తరములు చెల్లిపోయినవి. అతని కిప్పుడు పండ్రేండువతరమువారు మంత్రులయినారు. తానొక్కఁడు బ్రతికియున్నను భార్యాపుత్రాదులు మృతులగుటచేతనే కదా విరక్తుఁడయి విభీషణుఁ డిప్పుడు రాజ్యము మంత్రుల కప్పగించి నువేలాద్రియందు తపస్సు చేయుచున్నాఁడు ! ఇట్టిదుష్కాలమును జూచి నేనెట్లు చింతిల్లకుందును?
సత్య---- ఓ మహాకాయా! మాదేశస్థితిని దలఁచుకొనఁగా మీకు కలుగుచున్న విచారమే నాకును కలుగుచున్నది. మావారంతకంత కల్పాయుష్కులగుచున్నారు. పూర్వము దశరధుఁ డఱువది వేల యేండ్లు రాజ్యముచేసినాఁడు.ఇప్పుడాఱు నూఱేండ్లు బ్రతికినవాడయి ననులేఁడు. అగస్త్యుడు సముద్రోదకమునంతను పానముచేసెను. ఇప్పుడొక్క చెఱువెడు నీళ్ళు త్రాగువాఁడయినను లేఁడు.
మహా---- పూర్వము మీవా రంతటి స్థూలకాయులుగా నుండినందుననే మా పెద్దలు మనుష్యాశనులయి కడుపునండ తృప్తిగా భోజనము చేయుచుండెడివారు. నిన్నుఁ బట్టి చూడఁగా మీమనుష్యులిప్పుడు