పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శేష - "బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము తెల్లవాఱ లేచి యింటి ప్రాచి యంతయు జేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన నీళ్లన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచు వఱకు పనులన్నియు జేయుదును. అప్పుడు నాలుగు గడియల ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపుకొనుచు వచ్చి గరిటెనంటు వదలలేదని, వాకిటలో బెంట యట్టే యున్నదని తిట్ట మొదలుపెట్టును. తరువాత పేడ చేసి గోడ మీద పిడకలు చఱిచి ఱెక్కలు విఱుచుకొని జాము పొద్దెక్కి చలిదిభోజనమునకు వచ్చు వఱకు, 'ఒక మూల తెల్లవాఱక మునుపే తిండికి సిద్ధపడుదువు. పని మాత్రము ముట్టుకో'వని వంట చేసికొనుచు సాధించుచుండును. పగలు మగనితో మాటాడితే దప్పు కదా? రాత్రి యందఱి భోజనములు అయిన తరువాత, అత్తగారికి కాళ్లు పిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్లి పడుకోబోవు నప్పటికి రాత్రి రెండు యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పుడు తెల్లవాఱిపోవునో, వేళకు బని గాకున్న అత్తగారెక్కడ కోపపడునో యని నిద్రలో సహితములికి పడుచుందును; ఎట్లు చేసినను నాకు తిట్లును దెబ్బలును తప్పవు గదా?" అని మొగమునకు కొంగడ్డము పెట్టుకొని నేత్రముల నీరు కార్పజొచ్చెను.

రుక్మి - "అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే చేయరాదా?"

శేష - "అయ్యో! రుక్మిణమ్మా! నీకత్తగారు లేదు గనుక నీకీ సంగతులేమియు తెలియవు. ఎంత పని జేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి చల్లునప్పుడు చిక్కగా జల్లిన, 'ఇల్లంతయు సముద్రము చేసినావు జాఱిపడి చచ్చిపోనా?'యని