కాశీమజిలీకథలు/ఏడవ భాగము/127వ మజిలీ

వికీసోర్స్ నుండి

పద్మిని కించుకయు వేడి సోకినదికాదు. బూడిదరాచిన రత్నమువలె మెఱయు చుఁ జెక్కుజెదరక లేచి నలుమూలలు జూచి అయ్యో? నన్ను దైవము జంపకున్నాడు గదా? ఇంక నెన్నియిడుములు గుడువఁ జేయుటకో యని తలంచుచుఁ బోయి పోయి కొన్ని దినంబుల కందొక గొల్లపల్లి చేరినది.

అప్పటికి మరల బుద్దిస్వాస్థ్యము తప్పుటచే అందొక గొల్లవాని యింటిలో వాఁడు చెప్పిన పనులుచేయుచుఁ గొన్నిదినములు కాలయాపనము చేసినది.

అని యెఱింగించి,

127 వ మజిలీ

ఉదయార్కునికథ

ఆహా? ఆమె యెవ్వతెయో కానీ చాలమంచిది ఆమెచెప్పిన మాటలు నాడెంద మున బాగుగ నాటినవి. నేనీ బోగముదానియింటికి వచ్చుట తప్పుగా ఎఱుఁగక మోస పోయితినిగదా? మిక్కిలి వెలగలతినాసి‌ గోలుపోయినను మంచిమాటలువినంబడినవి. అదియొకమేలే? మఱియు నేనుత్తమకులసంజాతుఁడనట. ఈజాబు రామదుర్గనగరంబు నకుఁదీసికొనిపొమ్మని చెప్పినదిగదా? దీనివలనఁగొంతలాభము గలుగఁ గలదు అయ్యా ! నాకుఁ జదువురాకపోవుటచే నిందేమివ్రాయబడినదో తెలియఁబడదు. ఒరు లకుఁ జూపవలదనిజెప్పినది. కానిమ్ము ముందుగాఁ జదువు నేర్చికొని యీయుత్తరము జదివికొనిన తరువాత బోయెద నిఁక నీకోయల సహవాసము విడిచెదనని తలంచుచు మృగదత్తుఁడు వేశ్యాగృహము వెడలి కనుచీఁకటి యుండఁగనే యూరిబయటనున్న గుడిసెలయొద్దకుఁబోయెను.

అందున్న కోయలు వానింజూచి యోరీ చిరతపులీ? నీవురాత్రి యెందుబోయి తివి? నీకొఱకుఁ బురమంతయు వెదకితిమి. తివాసినమ్మితివా? మనతివాసులు చూచి రాజుగారు మెచ్చికొని నిన్నుఁదీసికొని రమ్మనిరఁట. పెద్దతివాసి తామే కొనియెద రఁట. రాజభటులు పలుమారువచ్చి పోవుచున్నారు నీ అదృష్టము మంచిదాని వాండ్రు పలికిన విని అతండు నన్నుఁ బులియని పిలువవలదు నాపేరు మృగదత్తుఁడని పిలువుఁడు పెద్దతివాసి నమ్మితిని. రాత్రియెందో పోయితినని పలుకుచుండఁగనే రాజభటులు కొందఱువచ్చి తివాసులల్లిన పిల్లవాఁడు వచ్చెనా? అని కేకలు పెట్టిరి.

వచ్చెనని చెంచులు కొందరుత్తరము చెప్పిరి నేనే అల్లినవాఁడను అని మృగ దత్తుఁడు ముందరకువచ్చి నిలువంబడుటయు రాజభటులువానింజూచి నీనిమిత్తము రాతిరినుండి తిరుగుచుంటిమి. ఎందుబోయితివిబాబూ ! పెద్దతివాసియున్నదా! అమ్మి తివా? పదపద. రాజుగారు నిన్నుఁదీసుకొని రమ్మనిరని చెప్పి అప్పుడే వాని రాజ సభకుఁ దోడ్కొనిపోయిరి.

మృగదత్తుని దేహచ్ఛాయ నలుపైనను నింద్రనీలమువలె మెఱయుచుండును. కన్నులు ఆకర్ణాంత విశాలములై యున్నవి. వెడదయురము ఎగుబుజంబులు దీర్ఘ బాహులుం గలిగి యొప్పుటంజేసి వానిరూపు చూచినవారి కచ్చెరువు గొలుపక మానదు. మఱియు గోయకులంబునం బుట్టినవాఁడగుట వింతగా వానింజూడక మానరు. ఉదయార్కుఁడు నిండుకొల్వుండఁగా వాని రాజభటు లతనియొద్దకుఁ దీసి కొనిపోయి యెఱింగించిరి.

రాజువానింజూచి వెరగుపడుచు వీఁడు కోయవాఁడా? ఔరా? యెంతవిచిత్రము. అనిపలికి వానింజాచి.

రాజు - ఓరీ! నీపేరేమి?

మృగ -- మృగదత్తుఁడండ్రుసామీ!

రాజు - వింత తివాసులనల్లినవాఁడవు నీవేనా?

మృగ - నేనే సామి

రాజు - ఈపని నెక్కడ నేర్చుకొంటివి?

మృగ -- నాకెవ్వరును నేరుపలేదు. నాబుద్దిబలముచేతనూహించి. అల్లితిని సామి.

రాజు - నీవు చదివికొంటివా?

మృగ - లేదు. సామి లేదు.

రాజు - ఏమిటికి నేర్చుకొనవై తివి.

మృగ -- చెప్పువారులేక సామి!

రాజు - నీవు తరుచు ఎందువసింతువు?

మృగ - కొండలనడుమ సామి

రాజు - నీతలిదండ్రు లిక్కడకువచ్చిరా?

మృగ - లేదు సామి‌ లేదు.

రాజు - నిన్న నద్భుతమైన తివాసి తెచ్చితిఁవట యేమిచేసితివి?

మృగ - రత్నాంగియను బోగముది తీసికొన్నదిసామి.

రాజు -- ఏమి వెలయిచ్చినది?

మృగ - ఏమియు నీయలేదుస్వామి! యూరకయే హరించినది.

రాజు - ఏమికతన? మృగ -- (సిగ్గుచే తలవాల్చుకొని) ఏమో తెలియదు.

రాజు - తెలిసినది విటుండవై యరిగితివికాబోలు ప్రతిఫలము ముట్టఁజెప్పక పోవదే.

మృగ - లేదు సామి లేదు.

రాజు - లేకున్న నిజము చెప్పము తప్పున్న దానిందడించితిరిగి తెప్పెందె దను.

అనిరాజు వానితో సంభాషించుచున్న సమయంబున రత్నాంగి అచ్చటికి వచ్చి నమస్కరింపుచు నపరాధనిరూపణ పత్రిక యొకటి రాజునకర్పించినది. వాచ కుఁజు దాని నిట్లు చదువుచున్నాడు.

మహారాజా ! నిన్నరాత్రి చిరుతపులిఅను కోయవాఁడు మాయింటికి విటధర్మ మున నరగుదెంచి తానల్లిన తివాసి నొకటి యిచ్చి నాకూఁతురను భోగినిగా నభిల షించి రాత్రి మాయింటఁ బండుకొని తెల్లవారకమున్ను సకాలాలంకార భూషితయగు నాయోషామణిం దీసికొనిపోయెను. ఎందుదాచెనో తెలియదు ప్రొద్దుటనుండి వెదకించు చుంటి దేవరవారు కటాక్షించి వాని దండిచి నాపుత్రిక నిప్పింపఁ బ్రార్దించుచున్న దాన. అని చదివెను.

ఆపత్రికా వృత్తాంతము విని రాజు మిక్కిలి వెరగుపడుచునోహో! చిరుత పులి నీకూతునెత్తికొనిపోయెనా అందులకు మేమేమి చేయుదుము భక్షించియుండు నేమో యని పరిహాసమాడుచు నోరీమృగదత్తా! యిట్టి తివాసులల్లువాండ్రు మీలోఁ బెక్కురుగలరాయేమి యని యడిగిన వాఁడు స్వామీ! నాకుఁగాక యీపని మఱి యొకరికిఁ దెలియదని చెప్పెను.

మహాప్రభూ ! వీఁడే రాత్రిమాయింటికివచ్చి నన్ను మోసముజేసి నాకూఁతు నెత్తికొనిపోయిన మ్రుచ్చు అని‌ రత్నాంగి పలికినది. వీనిపేరు చిరుతపులియా? మృగదత్తుడా ! అని రాజడుగఁ జిరుతపులియని నాతోఁజెప్పెనని రత్నాంగి చెప్పినది.

రాజు వాని మొగముజూచి మృగదత్తా! నీకు రెండుపేరులు గలవాయేమి? నిజమైన పేరేది యనుఁడు నాకు మొదటిపేరులు చిరుతపులియేకాని తరువాత మృగ దత్తుఁడని చెప్పుకొనుచున్నాను. దానికి వేరొకకారణఁమున్నదని చెప్పెను.

అప్పుడురాజు మిగుల వింతగాఁజూచుచు నీవీరత్నాంగిమాటలు వింటివా? దానికూతు నెత్తుకొనివచ్చితివఁట యేమిటికి? నిజము చెప్పుమని అడిగిన వాఁడు రామ రామ నేనేమియు నెరుఁగను అది బొంకుచున్నదని చెప్పెను. అడవివాండ్రు అసత్య ములాడరు నీవేబొంకుచుంటివి. వీని తివాసి న్యాయముగా హరించితివఁట. తీసికొని రమ్ము లేకున్న నిన్నుశిక్షింతునని రాజుకోపముగాఁబలికినజడియుచు రత్నాంగి వాని నిట్లడిగినది.

రత్నాంగి - ఓరీఃనీవు నిన్నసాయంకాలమున

మృగ - నిలు, నిలు నేను గోయవాఁడనుకాను. ఉత్తమకులస్థుడ ఓరీ అని నన్ను నీవు పిలువఁదగవు అందరు నవ్వుచున్నారు.

రత్నాంగి - ఓయీ తివాసి తీసికొని మాయింటికి వచ్చితివా?

మృగ -- వచ్చితిని. వచ్చితిని.

రత్నాంగి - నీపేరు చిరుతపులియని చెప్పితివా

మృగ -- చెప్పితిని. నాపేరు అప్పటికిఁ జిరుతపులియే.

రత్నాంగి - రాత్రి మాయింటికిఁ బడకకు వత్తునని జెప్పితివా?

మృగ -- నేనుఁ జెప్పలేదు. నీవు రాత్రి రమ్మని పిలిచితివి.

రత్నాంగి - ఎట్లయిన నేమి నీవు రాత్రి మాయింటికి వచ్చితివా? లేదా.

మృగ - వచ్చితిని.

రత్నాంగి -- సరే. నాకూతుఁరును నీయొద్దకు బంపితినా లేదా?

మృగ - కూఁతురో యెవ్వరో తెలియదు. ఒకతె నాగదిలోనికి వచ్చి కూర్చు న్నది.

రత్నాంగి - అది నీయిష్టము చొప్పున మెలఁగినదియా?

మృగ ‌- లేదు. లేదు

రాజు - మఱియేమి జేసినది.

మృగ - దేవా! వినుండు. ఆమెకడుయిల్లాలు. సామీ! ఆమెనన్నుఁ జూచినా వృత్తాంతమడిగి తెలిసికొని యూరక కన్నీరుగార్చుచుగొంత సేపటికిఁ బిల్లవాఁడా. నీవుయుత్తమకుల సంజాతుఁడవు కోయవాఁడవు కావు ఈబోగముదాని యింటి కేమిటికి వచ్చితివి? దీనివలనధనముపోవును. రోగములువచ్చును. కీర్తిచెడును. తేలికకలుగునని యెన్ని యోచదివి ఈపని తప్పని చెప్పినది. అంతదనుక నాకామాట తెలియదు. చదివికొని బుద్దికలిగి న్యాయముగ వర్తింపుమని యెంతయో బోధించినది. నాపుట్టు పూర్వోత్తరమువిని నీపేరుమృగదత్తుఁడని చెప్పుకొనుమన్నది. అప్పటినుండియుఁ బేరు మార్చుకొంటిని ఆమెచెప్పిన మాటలన్నియు నాకునచ్చినవి. ఆప్రకారమే నడుచు కొనుచు నియమించుకొంటిని. తెల్లవారక పూర్వమే నన్నుఁ బొమ్మన్నది. లేచివచ్చి తిని ఇంతకన్న నాకేమియుం దెలియదు. సామీ! అని వాఁడు చెప్పెను.

రాజు - రత్నాంగీ? వానిమాటలువింటివా? అచిన్నదినీకూఁతురేనా సత్యము చెప్పుము. రత్నాంగి -- కడుపునఁ బుట్టినదికాదు. పెంచుకొంటిని

రాజు -- ఎన్ని ఏండ్లు ప్రాయమప్పుడు పెంచుకొంటివి?

రత్నాంగి -- వివరము జ్ఞాపకములేదు. ఏడెనిమిదేండ్లయినది.

రాజు - దాని తలిదండ్రు లెవరు?

రత్నాంగి - (ఇంచుకయాలోచించి) ఎవ్వరోనాకుఁదెలియదు.

రాజు - మఱియెక్కడనుండి తీసికొని వచ్చితివి?

రత్నాంగి -- వీధిఁబడి పోవుచుండఁ బిలిచి అన్న వస్త్రము లిచ్చి పోషించు చంటిని.

రాజు - దానికి వివాహమైనదేమొ యెఱుగుదువా?

రత్నాంగి -- ఎరుఁగను.

రాజు -- ఎప్పుడును అడుగలేదా?

రత్నా - వట్టి వెర్రిదిబాబూ! ఏమాటయుం దెలియదు. చెప్పినపని మాత్రము చేయుచుండునది.

రాజ - అంతకుమున్నెన్నఁడైన లంజరికమునకు నియమించితివా?

రత్నా - లేదు. లేదు. దానియవసరము లేకపోయినది. నిన్న నాయొడలిలో స్థిమితములేమింజేసి దానిం బంపవలసి వచ్చినది.

రాజు - అలంకరించియే పంపితివా?

రత్నా - అయ్యో? పదివేలు విలువఁగలనగలచేనలంకరించితిని.

మృగదత్తుఁడు -- లేదు సామి లేదు. ఒక్క నగయైన లేదు. మాసినగుడ్డ కట్టు కొన్నది. మూలఁ గూర్చున్నది. వెర్రిదిగాదు. ఏలాటి పురాణములు సెప్పినదను కొంటిరి?

రాజు - వీనిమాట యసత్యమా? అది సింగారించుకొనఁగా నీవు జూచితివా! నిదానించి చెప్పము.

రత్నాంగి - నాకు జ్వరముగా నుండుటచేఁ బరిశీలింపలేదు. అలంకరించుకొని పొమ్మని తెప్పితిని.

రాజు - నీవీపత్రికలోఁ బదివేల వెలగల నగలతోఁ దీసికొని పోయెనని వ్రాయించితివిగదా? చూడక యెట్లు వ్రాయించితివి.

రత్నాంగి -- (భయపడుచు) నగలు ధరించినదని తలంచి యట్లువ్రాసితిని.

రాజు - నీమాటలలోఁ బరస్పరవిరుద్దములు చాలగలవు. నీవు చెప్పుచున్నవి అంతయు నసత్యము. ఉత్తమాంగనను జెడుకార్యమునకు నియోగించితివి. లేనియప రాధము నిరూపించితివి ఈయపరాధద్వయమునకు నీవు దండ్యురాలవు. వేయు నిష్కము లిచ్చుకొనునట్లు నీకుశిక్ష విధించితిమి. ఈయనిచో రెండేఁడులు కారాగార ములో నుండవలయు నీతివాసి తీసికొనివచ్చి వీనికిచ్చివేయవలయును. అనిమంత్రులతో నాలోచించి యారాజురత్నాంగికి శిక్షవిధించుటయుఁ దచ్ఛాసనానుసారముగా రాజ భటులు పదపదయని గెంటుచు దానివెంట దాని యింటికింబోయి శిక్షాధనముతోఁ గూడ దివాసిని తీసికొనివచ్చి రాజునకు సమర్పించిరి.

ఓహో! ఈరాజు పక్షపాతముజేసి నాకపరాధము విధించెను. తివాసి తాను దీసి కొనుటకై యింత పన్నెను. కానిమ్ము వీరితోనే యయ్యెనా యేమి? పైయధికారులు లేరా? భూమియంతయు నీతఁడొక్కఁడే పాలించుచుండెనా? పైవారియొద్దకుఁ బోయి న్యాయము బొందివచ్చెదనని నిశ్చయించి రత్నాంగి ద్రవ్యనష్టమునకు మిక్కిలి విచా రించచు నుదయార్కునిపై నధికారముగల గజేంద్రవాహనుఁడను రాజునొద్ద కఱిగి నది.

న్యాయవాదుల సహాయముమూలమున రత్నాంగి యుదయార్కుఁడు తనకుఁ గావించిన యక్రమమును గజేంద్రవాహనునకుఁ దెలియఁ జేసినది. అమ్మహారాజు అయ్యభియోగమునను విమర్శించుటకు దనకు సామంతరాజుగానున్న సుమేధునొద్దక్కి, బంపెను.

అని యెఱింగించునప్పటికి ....

128 వ మజిలీ.

సుమేధుని కథ

గజేంద్రవాహనుఁడు సామంతచక్రవర్తి. ఆపృధివీపతి యధికారముక్రింద. నేబదియార్గురు సామంతరాజులుగలరు. సామంతరాజులు చేసిన న్యాయాన్యాయముల విమర్శింప గజేంద్రవాహనునికి నధికారముగలదు. తానుచేసిన శిక్షావిధులు సమంజస ములు కావని తోచినచోఁ ద్రిప్పివేయుచుండును. ఆయభియోగమునెల్ల విమర్శించి యందలి యదార్థము లెఱింగింప మిక్కిలి బుద్ధిమంతుఁడగు సుమేధుఁడనుసామంత రాజును నియమించెను. సుమేధుఁడును గజేంద్రవావానునిచే నీయఁబడిన నూఱు గ్రామ ములు గలవాఁడగుట రాజని పిలువఁబడుచుండును. సుమేధుఁడు తెలివిగలవాఁడు. ధర్మాసక్తుండని యెఱింగియుండుటదే గజేంద్రవాహనుఁ డతఁడుచేసిన తీరుపుల విమ ర్శింపకయే స్థిరపరచుచుండును.

రత్నాంగి తన యభియోగమాసుమేధునొద్దకుఁ బంపబడినదని విని యతనిచేఁ బాలింపఁబడుచున్న విద్యానగరమునకుఁ బోయినది. రత్నాంగి మధ్యయౌవనమందు