కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

శ్రీ

వివేకచంద్రిక

అను

రాజశేఖరచరిత్రము


మొదటి ప్రకరణము.

ధవళగిరి - దేవాలయవర్ణనము - గోదావరి యొడ్డున నున్న ధర్మశాల

మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు వచ్చి కూర్చుండుట -

అప్పు డచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు -

అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.

శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికాకంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వరపురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆపిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళనువిడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములోనడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి నిదర్భాదిదేశములగుండబ్రయాణములుచేసి త్రోవపొడుగునను వచ్చి పుచ్చుకొననివారికేబ్రాకారము స్నానపానంబులకు వలయునంత నిర్మలజలం బో స్తంభమొకటి యున్నది.మందిఱి నానం ద మొందింఱుగంటలు గాలికి గదులుచు సదా శ్రావ్యలకును ఫలవృక్షములకుదనుపు చుండును.ఆస్తంభమునకును మొదట 2 రాజశేఖర చరిత్రము

చుచు తన చల్లదనము వ్యాపించినంతవఱకు నిరుపార్శ్వములందు భూమినం తను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూరమునుండి బయలుదేఱి యడవిపండ్లును నెమలికన్నులు వహించి పొంగి నానాముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్నగంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దనగంభీరత గానుపింప నాథుని వెదకికొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్దనస్వామి దర్శనము చేసికొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపములయిన రెండుచేతులనుజాచి సరసతమీఱ నాథునింగలియు భాగ్యము గాంచెనో యాధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్రవరపుర సమీపమున మిక్కిలి వన్నె కెక్కి యుండెను.


ఆపర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లనిపిండిరాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్రముండును; ఆరాళ్ళనుబట్టియే దానికి ధవళగిరియను నామము కలిగియుండును.దక్షినవైపున ఁ గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆసోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవస్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయుచుండును. ఆసోపానముల వెంబడి బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టబడిన సుందరమైన చిన్నదేవాలయమొక్కటి కానఁబడును. దానిచుట్టును.............. .............................వెత్తెడు ప్రాకారము మూఁడుప్రక్కలను బలిసి.................. ................................................బదులుగా పర్వతశృం............... ...............................................శయింప వానిని మించి

(ఈఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్నగుహ కలదు. అందులోఁ గూర్చుండి పాండవులు పూర్వమరణ్యవాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపునస్కారములులేక బూజుపట్టియున్న యాదేవర నుత్సవదినములలొ నర్చకుండొకడు పైకిఁ పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం తలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్దనస్వామి కళ్యాణ దినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథము యొక్కపగ్గములు నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్నదేవరయెడంగల విశ్వాసముచేత పూజారులు మఱుచటిసంవత్సర మాత్రాళ్ళపని మఱలవచ్చువఱకును ఆగుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈ ప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయు దేవతాసందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులుమాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ దఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగంటలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెదట నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహతంత్రమునంతయు మహావైభవముతో నడిపింతురు.

ప్రతి మాసమును, రెండు పక్షములయందును ముఖమంటపము మీద ఏకాదశి నాడు రాత్రి హరిభజనము జరుగుచుండును. హరిభక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వపుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని కరతాళములును మృదంగములును మ్రోగుచుండగా దంబురలు మీటులు, బిగ్గఱగా దమ యావచ్ఛక్తిని "నవనీతచోరా", "గోపికాజారా", "రాధికాలోలా", "గోపాలబాలా" మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగుపోయినప్పుడు మిరియములను బెల్లపుముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు జూపి చేతికొలదిని వాయించుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలిపోవుటయు సంభవించుచుండును. దేవతావేశము చేత తఱచుగా భక్తులలో నొకరిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషముల వఱకు వెనుకకు స్తంభము మీది కొఱగుచుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చిచేష్టల వలె గనపడును గాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలతురు.

కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండ మీదికెక్కి నలుగడల జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల పిల్లలు చెంగుచెంగున దమ ముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్లు మీదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలును, పూర్వదక్షిణముల గుప్ప వోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తుగానొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపై నుండి పొలముకాపులు కోయని కూతలిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదరింప జేరువ తోపులలో నుండి వెలువడి మధురరుతములు చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలువిధములయిన పక్షులు చెట్ల కొమ్మల మీద బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల పచ్చని పయిరులును, ఆ పయిని వృక్షముల మీదను గూర్చుండి కర్ణరసాయనముగా బిల్లనగ్రోవిని మోవిని బూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి మేపులు చాలించి క్రేపులతోడ గూడి జెవులు నిక్కించి యర్రులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ల యందు నిలుచున్న పశుగణములును, పడమటను నీలము వలెనున్న తేటనీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపుతళుకులను బుట్టింప బలుతెరంగుల జలవిహంగంబులు పుట్టచెండ్ల వలె మీల బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచు బ్రవాహంబుతోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సాహము చేయుచుండును.
ఆ పర్వత పాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్లరాతి బండ మీద జక్కగా మలచిన రామపాదములు వెలసియున్నవి. శ్రీరాముల వారు పూర్వకాలమున సీతాలక్ష్మణులతోడగూడ బర్నశాలకు బోవుచు త్రోవలో ఈ పర్వతసమీపమున నడచిననాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్ముదురు. కాబట్టి యా రామపాదములను సందర్శింపవలె ననునభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీదికెక్కి శ్రీ జనార్ధన స్వామి వారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుట చేత జాతిమతభేదము లేక యెల్లవారును పులిమాగిరము, దధ్యోదనము మొదలుగా గల స్వామిప్రసాదమును స్వీకరించి కన్నులకద్దుకొని ముచ్చటనారగించి చేతులనంటుకొన్నదానిని కడుగుకొన్న నపచారమగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును, గోడలకును వర్ణము వేయుటయే గాక తచ్ఛేషముతో దమ మీజేతులకును బట్టలకును మెఱుగు బెట్టుకొనుచుందురు.

ఈ కొండకు దక్షిణమునను తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించియున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుం గూడ గలిగియుండెను. కాని యిప్పుడిప్పుడు గ్రామమును ధవళేశ్వరమని వ్యవహరించుచున్నారు. కొండ మీది నుండి సోపానములు దిగివచ్చిన తోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయమొక్కటి లోచనగోచరంబగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణచి దక్షిణాభిముఖుడయి చనుచు అగస్త్యు డాస్వామిని అచట ప్రతిష్ట చేసెనని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాలమయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్లతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీపమున వీధికి దూర్పు ప్రక్కను "ధర్మచావిడి" అని యొకటి యుండెను. అది పరదేశ బ్రాహ్మణులును, మార్గస్థులును రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమందది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్దమనుష్యులు ప్రతిదినమును ఉదయాస్తమయము లందు ప్రోగై యిష్టకథాగోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగపడుచుండెను.

ఒకానొకదినమున సూర్యుడుదయించి ప్రాచీముఖంబున గుంకుమబొట్టు నందంబు వహించి వృక్షాగ్రములను బంగారునీరు పూసినట్టు ప్రకాశింప జేయుచుండెను; చెట్ల మీది గూళ్ల నుండి కలకల ధ్వనులతో వెలువడి పక్షులు నానాముఖముల ఎర కయి వెడలుచుండెను; పసులకాపరిబాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక "వెల్లావు కడి నాది" "దోర గేదె కడి నాది" యని గంపలు చేతబట్టుకొని, పడుచు లొండొరుల మీరి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలలు బుజముల మీద బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలములకుం బోవుచుండిరి; అప్పుడు కాయశరీరము గల యొక పెద్దమనుష్యుడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో గాళ్లును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొని వచ్చి, ధర్మశాల మీద వొడ్డున గూర్చుండి, వచ్చునప్పుడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మపుడకతో దంతధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరములుండును; మొగము మీద స్ఫోటకపు మచ్చలే లేకపోయెనేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱయుండదు; అట్టని, యా ముఖమాయనకు నిత్య మును దర్శింపవచ్చు. ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్ఱనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టిగాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుడని నోపజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరుకావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడియున్నది; చెవులనున్న రవలయంటు జోడును, కర్మిష్టుడనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక నందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్జనియందలి వెండి బటువులు రెండును తప్ప శరీరమున నాభరణములేవియు లేవు; ఆయన పేరు రాజశేఖరుడు; ఆయన ముఖప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి, ఆయన వారివారి తారతమ్యముల కర్హముగా దగిన మర్యాదలు చేసి కూర్చుండుడని చేయి చూప, 'చిత్తము' 'చిత్తము' 'మీరు దయ చేయండి' అనుచు జావడి నిండ గిటగిటలాడుచు గూరుచుండిరి.

అప్పుడు రాజశేఖరుడు గారు "సిద్ధాంతి గారూ! మీరు నాలుగు దినముల నుండి బొత్తిగా దర్శనమిచ్చుట మానివేసినారు! మీ యింట బిన్నపెద్ద లందఱును మరేమియు లేకుండా సుఖముగా నున్నారు గదా?"

సిద్ధాంతి - "చిత్తము, చిత్తము. తమ అనుగ్రహము వల్ల మేమందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్నవస్త్రాదులిచ్చి కాపాడగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండగా మావంటి వారికేమి కొదువ? మా గ్రామము చేసికొన్న భాగ్యము చేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమ వంటి దాన కర్ణులు మాగ్రామమునకు విజయం చేసినారుగాని మరియొకటి కాదు." అని రామశాస్త్రి గారి వంక దిరిగి, "మనము వారి ముఖము ముందఱ స్తుతి చేయవలసినది కాదు గాని రాజశేఖరుడు గారు కేవలము నీశ్వరాంశ సంభూతులు సుండీ.".

ఆ మాటల కాదరము సూచించెడి మందహాసము చేసి రామశాస్త్రి "అందుకు సందేహమేమి? ఈ సంగతి మీరు నాతో జెప్పవలెనా? వారీ గ్రామమున నుండబట్టి మనమందఱము వారి యండను నిలువగలిగినాము గాని, లేని యెడల నిండ్లును వాకిళ్లును విడిచిపెట్టి మనమీపాటికి దేశముల పాలయి లేచిపోవలసినవారము కామా? వారి తండ్రిగారిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగా గనబడుచున్నది గాని యింతకు బూర్వము దీనికి నామరూపములున్నవా?"

అని, మంచి సమయము తటస్థించినప్పుడు తన పాండిత్యమును దాచిపెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్తోత్రపాఠములకు సాయముగా దనవి కూడా నాలుగు కలిపెను.

అప్పుడు రాజశేఖరుడు గారు మనసులో మిక్కిలి సంతోషించినను పయికా సంతోషము కానరాకుండా నడచికొని "సిద్ధాంతి గారూ! మొన్న మీ రెండవ చిన్నదానికేమో గ్రహబాధ కనబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగానున్నదా?"

యని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గానిపింప గొంచెమాలోచించి తలయూచి "జోశ్యుల కామావధానులగారి చేత విభూతి పెట్టించుచున్నాను. కానీ దాని వల్ల నిప్పటికేమియు గుణమే కనబడదు. జాతకరీతిచే దానికిప్పుడు శని చాలదు. ఎందుకైనను మంచిదని నా తమ్ముని చేత నవగ్రహ జపము చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులు గారినే "పంచముఖి వీరహనుమంతము" పునశ్చరణ చేయవలసినదనియు, జవశాంతి కేమయిన గావలసియున్న ఏ రాజశేఖరుడు గారినైన కాళ్లో కడుపో పట్టుకొని తెచ్చి నాలుగు రూపాయల సొమ్మిచ్చుకొనైన నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టమనియు ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందుచేతనే యీ నాలుగు దినముల నుండి దర్శనము చేయలేదు గాని లేకపోయిన నేది యెట్లయినను నేను తమ దర్శనము మానుదునా?"

రాజశేఖరుడు "శాస్త్రి గారూ! మీరు రూపాయల నిమిత్తము సంశయపడనక్కరలేదు. కావలసియున్న ఆ నాలుగు రూపాయలను నేనిచ్చెదను. మరి నాలుగు రూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములో కామావధానులు గారి కన్న ..." అని మిన్ను వరకు జూచి యేమో యాలోచించుచుండెను. సిద్ధాంతిగారు చేసిన స్తుతి యమోఘముగా బట్టుకొని కొంచెముగానో గొప్పగానో ధనరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీ వఱకెన్నడును రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు.

ధవళేశ్వరమునందును చుట్టుపట్టుల గ్రామములందును వేఱు సిద్ధాంతి లేడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్జ్యమెప్పుడని గాని, ప్రయాణమునకు ముహూర్తము పెట్టుమని గాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుటకే దినము మంచిదని గాని, ఇల్లు కట్టుకొన నారంభించుటకే మాసమనుకూలమైనదని గాని, క్షౌరము చేయించుకొనుటకే వారము మంచిదని గాని, వివాహమునకు లగ్నము పెట్టుమని కానీ, రజస్వల యయినప్పుడు నక్షత్రము చెప్పుమని గాని, సదా యెవ్వరో యొకరాయన నడిగి పోవుచునే యుందురు. దూరబంధువులు పోయి నప్పుడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలెనన్నను, జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొందినప్పుడు ఇల్లు వదలి యెంతకాలము లేచిపోవలెనో కనుగొనవలెనన్నను, రోహిణ్యాది నక్షత్రములయందు బిడ్డను గన్నప్పుడేమి శాంతి తగులునో యెఱుగవలెనన్నను, సిద్ధాంతి యొద్దకు రాక సరిపడదు. ఏ కాపువాని పశువు తప్పిపోయినను, ఎవనింట నేవస్తువు పోయినను వచ్చి సిద్ధాంతిగారి నడుగకపోరు. ఇటువంటి సమయములందెల్లను, అతడు వీధినడవలో నేల మీద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములును అంకెలును వ్రాసి మీది వంక చూచి యాలోచించి వచ్చిన కార్యమిదియనియు కార్యమీ ప్రకారముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతడు బల్లిపాటు మొదలైనవాని ఫలములును, శకునములు చూచి సంతానము కలుగు కాలమును కూడా చెప్పుచుండును. వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యా చేరువ గ్రామములో ఏ శుభకార్యము కానీ, యశుభకార్యము కానీ జరుగదు. ఆతడు చెప్పెడి జ్యౌతిషము తఱుచుగా అబద్ధమే యగుచు వచ్చినను, అప్పుడప్పుడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజమగుటయు గలదు గనుక జనులాతని మాట యమోఘమని నమ్ముచునే యుండిరి.

అప్పుడా చావడిలో నున్నవారిలో నెవరో "బైరాగులు భూతవైద్యమునకు గట్టివా"రని మెల్లగాననిరి. అంతలో రాజశేఖరుడు గారు సిద్ధాంతిగారి వంక జూపు త్రిప్పి "ఔను. బైరాగులన్న తోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున కెవ్వడో యొక బైరాగి వచ్చినాడట! అతనికి జూపింపరాదా? గోసాయీలకు బరమహంస క్రియలును వనమూలికలును విశేషముగా దెలసియుండును. వాండ్రెట్టి యసాధ్యమైన పీడలనైనను జిటికెలో బోగొట్టుదురు" అనిన తోడనే చావడి యంతయు 'చిత్తము' 'వాస్తవము' 'ఆలాగున నవశ్యము చేయవలసినదే' యను ధ్వనులతో నిండిపోయెను. మాటలాడువారు ధనవంతులైనచో, వ్యర్థవచనము సహితము స్తుతియోగ్యము కాకపోదు సుండీ. ఆ మాటల వలన నుత్సాహము కలిగి, రాజశేఖరుడుగారా బైరాగిని తాము జూడకపోయినను బ్రహ్మవర్చస్సు కలవాడని శ్లాఘించిరి.

అంత సిద్ధాంతి యుల్లములో లేని సంతోషమును మోమున దెచ్చిపెట్టుకొని యొక్క చిఱునవ్వు నవ్వి, వినయము తోడ చేతులు జోడించి రాజశేఖరుడుగారి ముఖమున దృష్టి నిలిపి, "తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినది. దాని యదృష్టము బాగుండబట్టియే దేవరివారి ముఖము నుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్లెదను." అని మనవి చేసి, ప్రయాణోన్ముఖుడయి లేచి నిలువబడెను. రాజశేఖరుడు గారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే బైరాగి మహానుభావుడనువారును మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము చేయుననువారును, మండువేసవిని పంచాగ్నిమధ్యమున దపస్సు చేయుననువారును అయి సభ యంతయు అతని విషయమైన స్తుతిపాఠములలో మునిగిపోయెను. ఒక్క గొప్పవాడొకనిని మంచివాడన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతివాక్యముల కొరకు తడవుకొనును?

అప్పుడు రాజశేఖరుడు గారు వీధి వంక జూచి: "ఎవ్వరో స్త్రీలు నీళ్లకు వచ్చి మనలజూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచుండి యొండొరుల మొగముల వంక జూచుకొనుచున్నారు. మనమందఱమును లేచి బైరాగిని జూచి వత్తము రండి." అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణోన్ముఖులయి నిలుచుండిరి. వెంటనే యందఱును గలిసి యుత్తరముఖముగా రామపాదముల వైపునకు నడవనారంభించిరి.