ఆ భా 1 1 001 to 1 1 030

వికీసోర్స్ నుండి

శ్రీమదాంధ్రమహాభారతము

ఆదిపర్వము


నన్నయ కవి ప్రణీతము

పరిష్కర్త - కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

ప్రచురణ - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ


1_1_1 శార్దూలవిక్రీడితము (మంగళశ్లోకము)

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే

లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై

ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే.


-:అవతారిక:-


1_1_2 వచనము

అని సకలభువనరక్షణ ప్రభువులై యాద్యులైన హరిహరహిరణ్యగర్భ పద్మోమావాణీపతుల స్తుతియించి తత్ప్రసాదసమాసాదిత నిత్యప్రవర్ధ మాన మహామహీరాజ్యవిభవుండును నిజభుజవిక్రమవిజితారాతిరాజ నివహుండును నిఖిలజగజ్జేగీయమాననానాగుణరత్నరత్నాకరుండును నై పరగుచున్న రాజరాజనరేంద్రుండు.

(అని త్రిమూర్తులను పొగడి గొప్పరాజైన రాజరాజనరేంద్రుడు)


1_1_3 ఉత్పలమాల


రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజతే

జోజయశాలిశౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రికా

రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్.

(గొప్పరాజైన రాజరాజనరేంద్రుడు ఔన్నత్యంతో)(మీది పద్యంతో అన్వయం)


1_1_4 కందము

విమలాదిత్యతనూజుఁడు

విమలవిచారుఁడు గుమారవిద్యాధరుఁ డు

త్తమచాళుక్యుఁడు వివిధా

గమవిజితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.

(విమలాదిత్యుని పుత్రుడు, శ్రేష్ఠుడైన చాళుక్యవంశపు రాజు, గొప్పవాడు అయిన రాజరాజనరేంద్రుడు)


1_1_5 చంపకమాల

ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిం

దన యుదయప్రభావమున దవ్వుగఁ జోపి జగజ్జనానురం

జన మగు రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం

దనరుఁ జళుక్యమన్మథుఁడు ధర్మనిబద్ధదయార్ద్రబుద్ధి యై.

(చాళుక్యరాజనే మన్మథుడు ధర్మనిబద్ధమైనదీ, దయార్ద్రమైనదీ అయిన బుద్ధిగలవాడై ప్రకాశిస్తున్నాడు.)


1_1_6 ఉత్పలమాల

ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ మనీషివి

ద్యాశ్రమత త్త్వవిత్త్వమున దానగుణాభిరతిన్ సమ స్తవ

ర్ణాశ్రమధర్మరక్షణమహామహిమన్ మహి నొప్పు సర్వలో

కాశ్రయుఁ డాదిరాజనిభుఁ డత్యకలంకచరిత్రసంపదన్.

(సర్వలోకాశ్రయుడు (చాళుక్యరాజులకు బిరుదు), గొప్పగుణాల్లో పూర్వపురాజులకు సమానుడు అయి ప్రకాశిస్తున్నాడు.)


1_1_7 సీసము

నిజమహీమండలప్రజఁ బ్రీతిఁ బెంచుచుఁ

బరమండలంబుల ధరణిపతుల

నదిమి కప్పంబుల ముదముతోఁ గొనుచును

బలిమి నీయని భూమివలయపతుల

నుక్కడఁగించుచు దిక్కులఁ దనయాజ్ఞ

వెలుఁగించుచును విప్రకులము నెల్లఁ

బ్రోచుచు శర ణన్నఁ గాచుచు భీతుల

నగ్రజన్ములకు ననుగ్రహమునఁ


ఆటవెలది:

జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు

దేవభోగముల మహావిభూతిఁ

దనరఁ జేయు చిట్లు మనుమార్గుఁ డగు

విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు.

(గొప్పరాజైన విష్ణువర్ధనుడు(రాజరాజనరేంద్రుడు))(మీది వచనంతో అన్వయం)


1_1_8 వచనము

అఖిలజలధివేలావలయితవసుమతీవనితావిభూషణంబైన వేంగీదేశంబునకు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్రమహిమ తోఁ బరమానందంబున ననవరతమహామహీరాజ్యసుఖంబు లనుభవించుచు సకలభువనలక్ష్మీవిలాసనివాసంబయిన రమ్యహర్మ్యతలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీ పరివృతుఁడయి యపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును భారత రామాయణానేకపురాణప్రవీణులైన పౌరాణికులును మృదుమధురరసభావ భాసురనవార్థవచనరచనావిశారదులయిన మహాకవులును వివిధతర్కవిగా హితసమస్తశాస్త్రసాగరగరీయ:ప్రతిభులైన తార్కికులును నాదిగాఁ గలుగు విద్వజ్జనంబులు పరివేష్ఠించి కొలుచుచుండ విద్యావిలాసగోష్ఠీసుఖోపవిష్టుం డయి యిష్టకథావినోదంబుల నుండి యొక్కనాఁడు.

(భూమి అనే స్త్రీకి అలంకారమైన వేంగీదేశానికి నాయకరత్నం వంటి రాజమహేంద్రపురంలో రాజ్యసుఖాలనుభవిస్తూ లక్ష్మీనివాసమైన రమ్యహర్మ్యతలంలో రాజోద్యోగులు, కవులు, పండితులు చుట్టూ ఉండగా విద్యాగోష్ఠులతో సుఖంగా కూర్చుండి, ఇష్టకథలతో ఉండి ఒకరోజున.)


1_1_9 సీసము

తన కులబ్రాహ్మణు ననురక్తు నవిరత

జపహోమతత్పరు విపులశబ్ద

శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది

నానాపురాణవిజ్ఞాననిరతుఁ

బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర

జాతు సద్వినుతావదాతచరితు

లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభి

శోభితు సత్ప్రతిభాభియోగ్యు


ఆటవెలది:

నిత్యసత్యవచను మత్యమరాధిపా

చార్యు సుజను నన్నపార్యుఁ జూచి

పరమధర్మవిదుఁడు వరచళుక్యాన్వయా

భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.

(గొప్ప పండితుడైన నన్నయతో రాజరాజనరేంద్రుడు ఇలా పలికాడు)


1_1_10 చంపకమాల

విమలమతిం బురాణములు వింటి ననేకము లర్థధర్మశా

స్త్రములతెఱం గెఱింగితి నుదాత్తరసాన్వితకావ్యనాటక

క్రమములు పెక్కు సూచితి జగత్పరిపూజ్యమునైన యీశ్వరా

గమములయందు నిల్పితిఁ బ్రకాశముగా హృదయంబు భక్తితోన్.

(అనేకపురాణాలు విన్నాను, ధర్మార్థశాస్త్రాలు తెలుసుకున్నాను, చాలా కావ్యనాటకాలు తిలకించాను, శైవాగమాల్లో హృదయాన్ని భక్తితో ఉంచాను.)


1_1_11 వచనము

అయినను నాకు ననవరతంబును శ్రీమహాభారతంబునందుల యభిప్రాయంబు పెద్దయై యుండు.

(అయినా నాకు శ్రీమహాభారతంలోని తాత్పర్యం గొప్పదిగా అనిపిస్తుంది.)


1_1_12 మత్తేభము

ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లై యుండుఁ బా

యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత

శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో

త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్.

(ఈ అయిదు విషయాలూ(పద్యంలో ఉన్నవి) నా హృదయంలో మిక్కిలిప్రీతికరాలై ఉంటాయి. తొలగవు.)


1_1_13 వచనము

మఱి యదియునుంగాక.

(అదీగాక)


1_1_14 చంపకమాల

హిమకరుఁ దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్

క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పిన యస్మదీయవం

శమునఁ బ్రసిద్ధులై విమలస ద్గుణశోభితులైన పాండవో

త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్.

(చంద్రుడు మొదలుగా పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజులు వరుసగా వంశకర్తలవగా భూమిమీద ప్రకాశించిన మా వంశంలో ప్రసిద్ధులైన పాండవుల చరిత్ర వినటం నాకెప్పుడూ ఇష్టమే.)


1_1_15 చంపకమాల

అమలసువర్ణశృంగఖురమై కపిలంబగు గోశతంబు ను

త్తమబహువేదవిప్రులకు దానము సేసిన తత్ఫలంబు త

ధ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి

త్తము ననిశంబు భారతకథాశ్రవణప్రవణంబ కావునన్.

(ఎంతో పుణ్యం చేసిన ఫలితం భారతకథను వినే ఆసక్తిచేత కలుగుతుంది. నా హృదయం కూడా ఈ కథను వినాలని కుతూహలపడుతూ ఉంటుంది. కాబట్టి)


1_1_16 కందము

జననుతకృష్ణద్వైపా

యన మునివృషభాభిహిత మహాభారతబ

ద్ధనిరూపితార్థ మేర్పడఁ

దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్.

(వ్యాసమునివృషభుని మహాభారతంలో ఉన్న అర్థం స్పష్టమయ్యేటట్లు తెలుగులో రచింపుము.)


1_1_17 కందము

బహుభాషల బహువిధముల

బహుజనములవలన వినుచు భారతబద్ధ

స్పృహులగు వారికి నెప్పుడు

బహుయాగంబులఫలంబు పరమార్థ మిలన్

(అనేక విధాలుగా భారతకథని వింటూ అందులో ఆసక్తి పెంచుకున్నవారికి అనేక యాగాలు చేసిన ఫలం కలుగుతుంది.)


1_1_18 వచనము

అని యానతిచ్చిన విని యక్కవివరుం డిట్లనియె.

(అని ఆజ్ఞాపించగా నన్నయ ఇలా పలికాడు.)


1_1_19 చంపకమాల

అమలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా

స్త్రముల యశేషపారము ముదంబునఁ బొందను బుద్ధిబాహువి

క్రమమున దుర్గమార్థ జలగౌరవభారతభారతీసము

ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృనకైనను నేరఁ బోలునే.

(ఆకాశంలోని నక్షత్రాలసమూహాలను లెక్కించటానికీ, సర్వవేదసారాన్ని తెలుసుకోవటానికీ, బుద్ధి అనే భుజాల బలంతో దుర్గమమైన అర్థం అనే నీటితో కూడిన భారతవాఙ్మయమనే సముద్రాన్ని ఈదటానికీ బ్రహ్మకైనా సాధ్యమౌతుందా?)


1_1_20 వచనము

అయినను దేవా నీయనుమతంబున విద్వజ్జనంబుల యనుగ్రహంబునం నానేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెద నని.

(అయినా ప్రభూ, నీ సమ్మతితో, పండితుల దయతో, నాకు తెలిసినవిధంగా ఈ కావ్యాన్ని రచిస్తాను.)


1_1_21 తరలము

హరిహరాజగజాననార్కషడాస్యమాతృసరస్వతీ

గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి సేసి దు

ర్భరతపోవిభవాధికున్ గురుఁ బద్యవిద్యకునాద్యు నం

బురుహగర్భనిభుం బ్రచేతసుపుత్త్రు భక్తిఁ దలంచుచున్.

(దేవతలకు నమస్కరించి, గొప్ప ఆచార్యుడు, ఆదికవి, ప్రచేతసుని పుత్రుడు అయిన వాల్మీకిని భక్తితో స్మరిస్తూ.)


1_1_22 ఉత్పలమాల

భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి ఘోరసం

సారవికారసంతమసజాలవిజృంభము వాపి సూరిచే

తోరుచిరాబ్జబోధనరతుండగు దివ్యుఁ బరాశరాత్మజాం

భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్.

(భారతవాక్కులనే కిరణాలతో సంసారంలోని దుర్గుణాలనే చీకట్లను పోగొట్టి పండితహృదయాలనే పద్మాలను వికసింపజేయటంలో ఆసక్తికలవాడున్నూ, గొప్పవాడున్నూ అయిన వ్యాసుడనే సూర్యుని కొలిచి.)


1_1_23 వచనము

మఱియును

(అంతేకాక.)


1_1_24 చంపకమాల

పరమవివేకసౌరభవిభాసితసద్గుణపుంజవారిజో

త్కరరుచిరంబులై సకలగమ్యసుతీర్థములై మహామనో

హరసుచరిత్రపావనపయఃపరిపూర్ణములైన సత్సాభాం

తరసరసీవనంబుల ముదం బొనరం గొనియాడి వేడుకన్.

(గొప్పజ్ఞానమనే సౌరభంతో ప్రకాశించే సద్గుణసమూహమనే పద్మాలచేత అందమైనవై, అందరూ చేరదగ్గ తీర్థాలై (సత్పురుషులు కలవై), మంచి ప్రవర్తనలనే పవిత్రజలాలతో నిండిన పండితసభలనే సరస్సులను సంతోషం కలిగేలా కొనియాడి.)

1_1_25 ఉత్పలమాల

పాయక పాకశాసనికి భారత ఘోరరణంబునందు నా

రాయణునట్లు తానును ధరామరవంశవిభూషణుండు నా

రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడుం దనకిష్టుఁడున్ సహా

ధ్యాయుఁడు నైనవాఁ డభిమతంబుగఁ దోడయి నిర్వహింపఁగన్.

(భారతరణంలో అర్జునునికి కృష్ణునివలె, వానసవంశానికి అలంకారమైనవాడు, వాఙ్మయధురంధరుడు, మిత్రుడు, సహాధ్యాయుడు అయిన నారాయణభట్టు తోడుగా నిర్వహింపగా.)


1_1_26 ఉత్పలమాల

సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో

నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా

నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా

భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.

(కవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తిని ప్రశంసించగా, ఇతరులు అక్షరరమ్యతను ఆదరింపగా, ఎన్నో మంచి అర్థాలతో కూడిన సూక్తులకు నిధి అయిన నన్నయ తెలుగులో మహాభారతరచనాబంధురుడైనాడు.)


-:భారతకథాప్రస్తావన:-

1_1_27 వచనము

తత్కథాప్రారంభం బెట్టి దనిన.

(ఆ కథాప్రారంభం ఎటువంటిదనగా.)


1_1_28 సీసము

నైమిశారణ్యపుణ్యక్షేత్రమునఁ గుల

పతి శౌనకుండను పరమమౌని

బ్రహ్మర్షి గణసముపాసితుండై సర్వ

లోకహితార్థంబు లోకసుతుఁడు

ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు

మొగిఁ జేయుచున్న నమ్మునులకడకు

వచ్చి తా నుగ్రశ్రవసుఁడను సూతుఁడు

రౌమహర్షణి సుపౌరాణికుండు


ఆటవెలది

పరమభక్తితోడఁ బ్రణమిల్లి యున్న

నక్కథకువలన మునినికాయ మెల్ల

వివిధపుణ్యకథలు వినువేడ్క నతనిఁ

బూజించి రపరిమితవిశేషవిధుల.

(నైమిశారణ్యంలో కులపతి అయిన శౌనకుడనే గొప్పముని పన్నెండు సంవత్సరాలు జరిగే సత్రయాగం చేస్తుండగా, రోమహర్షణుని కుమారుడు, పౌరాణికుడు అయిన ఉగ్రశ్రవసుడనే సూతుడు ఆ శౌనకాదిమునుల వద్దకు వచ్చి నమస్కరించగా, ఆ కథకుని ద్వారా వివిధపుణ్యకథలు వినాలనే ఆసక్తితో ఆ మునులంతా అతన్ని అనేకవిధానాలలో పూజించారు.)


1_1_29 వచనము

అక్కథకుండు వెండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి యే ననేక పురాణపుణ్యకథాకథనదక్షుండ వ్యాసశిష్యుండైన రోమహర్షణునకుఁ బుత్త్రుండ నావలన నెక్కథ విన వలతు రనిన నమ్మును లతని కిట్లనిరి

(ఆ కథకుడు మళ్లీ ఆ మునులకు నమస్కారం చేసి, "నేను అనేకపురాణాలలోని పుణ్యకథలను చెప్పటంలో సమర్థుడిని, వ్యాసశిష్యుడైన రోమహర్షణుని కుమారుడిని, నానుండి మీరు ఏ కథ వినాలని కోరుతున్నారు?", అనగా ఆ మునులు ఇలా అన్నారు.)


1_1_30 కందము

కందము

ఏయది హృద్య మపూర్వం

బేయది యెద్దాని వినిన నెఱుక సమగ్రం

బై యుండు నఘనిబర్హ ణ

మేయది యక్కథయ వినఁగ నిష్టము మాకున్.

(ఏ కథ మనోహరమో, ఏది అపూర్వమో, దేన్ని వింటే సమగ్రమైన జ్ఞానం లభిస్తుందో, ఏది పాపాలని తొలగించేదో ఆ కథ వినటం మాకు ఇష్టం.)