ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/రామరాజ భూషణుడు

వికీసోర్స్ నుండి

22. రామరాజ భూషణుడు

రామరాజభూషణుడు వసుచరిత్రమను శృంగార ప్రబంధమును రచియించిన మహాకవి. రామరాజభూషణుడను నది రామరాజుయొక్క యాస్థానమందుండుటచేత వచ్చిన బిరుదునామమనియు నిజమయిన పేరు బట్టుమూర్తి యనియు చెప్పుదురు. ఇతని జన్మభూమి బట్టుపల్లెయను గ్రామము. ఈ గ్రామమును కృష్ణదేవరాయలు కవిత్వమునందు బ్రవీణులై ప్రబంధాంకమువారని బిరుదుపొందిన యీతని పూర్వులగు బట్టురాజుల కిచ్చెను. ఈబట్టుపల్లె బళ్ళారిమండలములోని పాలమండలమునకు సమీపమున నున్నదని యొకరును, కడపమండలములోని పులివెందల తాలూకాలో నున్నదని యొకరును వ్రాసియున్నారు. ఈ కవి కృష్ణదేవరాయల కాలములో బుట్టి యుండవచ్చును గాని యాతని యాస్థానమునందలి యష్టదిగ్గజము లనబడు కవులలో నొకడుమాత్రము కాడు. ఇతడు మొట్టమొదట 1542 వ సంవత్సరము మొదలుకొని 1565 వ సంవత్సరమువఱకును సదాశివరాయల పేర విజయనగరములో రాజ్యముచేసిన కృష్ణదేవరాయల యల్లుడయిన రామరాజు యొక్క యంతిమదశలో నతని యాస్థానమునందు బ్రవేశించి యాతని మీద గొన్ని చాటు ప్రబంధములను చేసి రామరాజభూషణుడని బిరుదు పేరొందెను. కాబట్టి యీతని కవిత్వము 1560 వ సంవత్సర ప్రాంతములయం దారంభ మయినదని చెప్పవచ్చును. ఈతడు రామరాజుయొక్క జీవితకాలములోనే యాతనిమీద కృతులు చెప్పినట్టు వసుచరిత్ర కృతినాయకుడయిన తిరుమలదేవరాయలు కవినిగూర్చి పలికిన యీ క్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.


శా. శ్రీరామక్షితిపుస్మదగ్రజు జయశ్రీలోలు నానాకళా

పారీణున్ బహుసంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించి త త్కారుణ్యంబున రత్నహారహయవేదాండాగ్రహారాది స

త్కారం బందితి రామభూషణకవీ ధన్యుండ వీనన్నిటన్- [ఆ.1]


ఈ పద్యమునందు జెప్పబడినతడు కృష్ణదేవరాయని యల్లుడయిన యార్వీటి రామరాజు. కృష్ణదేవరాయని యల్లుడయినందున నీతనికి నళియరామరాజని సాధారణముగా వాడుకకలదు. ఈతడు కృష్ణదేవరాయని యల్లుడయి సదాశివరాయని రాజ్యబారమును వహించిన సంగతి రామాభ్యుదయములోని యవతారికయందీక్రింది పద్యమున జెప్పబడినది.


ఉ. ఆపటుకీర్తి రామవసుధాధిపచంద్రుడు కృష్ణరాయధా

త్రీపతిసార్వభౌమదుహితృప్రియుడై వితతప్రతాపసం

తాపితశత్రుడై యలసదాశివరాయనిరంతరాయవి

ద్యాపురరాజ్యలక్ష్మికీ విధానము దా నయి మించె నెంతయున్.


ఈ రామరాజు వివాహము చేసికొన్న కృష్ణదేవరాయని కూతురి పేరు తిరుమలాంబ. ఆమెవలన నీతనికి కృష్ణరాజు,పెదతిమ్మరాజు అని యిద్దఱుపుత్రులు కలిగిరి. ఈ సంగతి నరపతి విజయమునందీ క్రింది పద్యములలో జెప్పబడినది.


గీ. అనఘుడౌ నైరసేని భీమాధిపేంద్రు

పట్టి దమయంతి జేపట్టినట్టిరీతి

రామభూపాలకుడు కృష్ణరాయతనయ

యగుతిరుమలాంబ నుద్వాహనయ్యె వేడ్క.


చ. శతమఖునిం బులోమజను శంకరుని న్గిరిపుత్రి శంబరా

హితు రతిదేవి బోలుచు నహీనసుఖానువాప్తి రామభూ

పతియును దిర్మలాంబయును భానుసమానుని గృష్ణపాడ్యు నం

చితగుణు బెద్దతిమ్మనృపశేఖరు గాంచిరి హర్ష మొప్పగన్. రామరాజుయొక్క యనంతరమున మాతామహార్జితమయిన విద్యానగరరాజ్యమునకు రావలసిన వాడు కృష్ణరాయని దౌహిత్రుడయిన కృష్ణరాజే యయినను, రామరాజు తమ్ములయిన తిరుమలదేవరాయలును వేంకటపతిరాయలును బలవంతు లయి యాతనకి దక్కనియ్యక యారాజ్యమును తామే యాక్రమించుకొని యేలసాగిరి.

మూర్తి యనియు రామరాజభూషణు డనియు నిద్దఱు వేఱువేఱుకవు లనియు నందు మూర్తికవి సరసభూపాలీయమును, రామరాజభూషణకవి వసుచరిత్ర, హరిశ్చంద్ర నలో పాఖ్యానములను రచియించిరనియు కొందఱును, ఇద్దఱు నొక్కరే యనియు మూర్తి యనునది నిజమనిపేరనియు రామరాజభూషణు డన్నది రామరాజుయొక్క సభ కలంకారముగా నుండుటచేత వచ్చిన బిరుదుపే రనియు నతడు సూరపరాజున కౌరసపుత్రు డయి తదగ్రజు డయిన వేంకటరాయభూషణునకు స్వీకృతపుత్రు డనియు మఱి కొందఱును జెప్పుచున్నారు. "శ్రీరామచంద్రచరణారవిందవందన పవననందనప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధకవితా నిర్వాహకసాహిత్యరసపోషణ రామరాజభూషణప్రణీతం" బని వసుచరిత్రములోని గద్యమొక విధముగాను "శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసార సారస్వతాలంకార నిరంకుశప్రతిభాబంధుర ప్రబంధపఠన రచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణపుత్ర తిమ్మరాజపౌత్ర సకలభాషావిశేష నిరుపమావధాన శారదామూర్తి మూర్తిప్రణీతం" బని సరసభూపాలీయములోని గద్య మింకొకవిధముగాను నుండుటను బట్టియు, హరిశ్చంద్ర నలో పాఖ్యానములో "ప్రబంధాంక సింగరాజ తిమ్మరాజ ప్రియతనూజ ధీర సూరపాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి" ననియు సరస భూపాలీయములో "ప్రబంధాంక సింగరాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ సరస వేంకటరాయభూషణసుపుత్రు నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు" ననియు తండ్రులను వేఱువేఱుగా జెప్పుటనుబట్టియు, వేఱువేఱు కవులయినట్టు పయికి గానవచ్చుచున్నను గొన్నిహేతువులను బట్టి రెండవపక్షమువారు చెప్పెడి యంశములుకూడ సావధానముగా విచారింపవలసినవిగా నున్నవి. ఉభయపక్షములవారును జెప్పెడుయుక్తులను జక్కగా గ్రహింపగలుగుట కయి వంశక్రమమును దెల్పెడు పూర్వోక్తము లయిన రెండు పద్యములను పూర్ణముగా నిందుదాహరించుట యావశ్యకమని తోచి యట్లు చేయుచున్నాను, మొట్టమొదట బుస్తకములను జదివినప్పు డిరువురుకవులును వేఱువేఱనియే నేనును నభిప్రాయపడినను రెండవవారి యుక్తులను విన్నపిమ్మట నా మనస్సునకు గొంత సందేహము కలిగినందున, ఏతన్నిర్ణయమును దీనిని జదువువారికి విడిచిపెట్టు గ్రంథసౌలభ్యము నిమిత్త మిందుభయుల నొక్కరినిగానే భావించి వ్రాసెదను. ఇరువురును భిన్ను లయినను కాకపోయినను చరిత్రభాగమునందు వేఱువేఱుగా వ్రాయవలసిన యంశము లేవియు గానబడవు.


1. సీ. శతలేఖినీపద్యసంధానధౌరేయు ఘటికాశతగ్రంథకరణధుర్యు

నాశుప్రబంధబంధాభిజ్ఞ నోష్ఠ్యనిరోష్ఠ్యజ్ఞ నచలజిహ్వోక్తినిపుణు

దత్సమభాషావితానజ్ఞ బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణు

నేకసంధోచితశ్లోకభాషాకృత్యచతురు నోష్ట్యనిరోష్ట్యసంకరజ్ఞ

నమితయమకాశుధీప్రబంధాంకసింగ

రాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ

సరస వేంకటరాయభూషణసుపుత్రు

నను బుధవిధేయు శుభమూర్తినామధేయు, సరసభూపాలీయము.


2. సీ. వనధిలంఘనకృపావర్ధితోభయకవితాకళారత్నరత్నాకరుండ

సకలకర్ణాటరక్షాధురంధరరామవిభుదత్తశుభ చిహ్నవిభవయుతుడ వసుచరిత్రాదికావ్యప్రీతబహునృపప్రాపితానేకరత్నప్లవుండ

శాశ్వతశ్రీవేంకటేశ్వరానుగ్రహనిరుపాధికైశ్వర్యనిత్యయశుడ


శ్రీకరమహాప్రబంధాంక సింగరాజ

తిమ్మరాజ ప్రియతనూజ ధీరసూర

పాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి

నంకిత మొనర్తు నీకావ్య మనఘభక్తి- [హరిశ్చంద్రనలో పాఖ్యానము]


మ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం

దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారసుధారాశి సం

జనితై కై కదినప్రబంధఘటికాసద్యశ్శత గ్రంథక

ల్పను సంగీతకళారహస్యనిధి బిల్వంబంచి పల్కెం గృపన్- [వసుచరిత్ర]


పయిపద్యములలో నుపయోగింపబడిన విశేషణములు కొన్ని భిన్నములుగా నున్నను పరస్పర విరుద్ధము లయిన వేవియు లేనందున వానినిబట్టి గ్రంథకర్తలు భిన్నులని సాధించుట కాధార మేదియు లేదు. రెండు గ్రంథములను జేసినవారాంజనేయ ప్రపాదలబ్ధ కవిత్వ వైభవులమని వ్రాసికొనుట చేతను, రెండు కవిత్వములు నేకరీతినే యుండుట చేతను, ఆదినుండియు నిప్పటివఱకును బట్టుమూర్తియే వసుచరిత్రము రచియించెనని జనశ్రుతి వచ్చుచుండుట చేతను, కవికి దరువాత నల్పకాలములోనే వసుచరిత్రమునకు వ్యాఖ్యానము చేసినవారు కొందఱు బట్టుమూర్తి తాను రచించిన నానారసభాసురమగు ప్రబంధమునందలి వివిధాలంకారములకు లక్షణగ్రంథముగ నుండునట్లు నరసభూపాలీయమను నలంకార గ్రంథమును రచియించెనని వ్రాసియుండుటచేత, తద్గ్రంథత్రయకర్త యొక్కడేయైయుండునేమో యని యెట్టివారికిని సందేహము కలుగక మానదు. ఇక పైపద్యములోని యంశములనుబట్టి విచారింపవలెను. నరసభూపాలీయ కృతికర్త పేరందలి గద్యమునుబట్టి మూర్తియనుట స్పష్టము. దానికి బట్టు మొదలయిన పదములను వేనిని జేర్చినను, అవి కులనామములో బిరుదనామములో యయి యుండును. కావ్యాలంకారసంగ్రహ మనబడెడు నరసభూపాలీయము లోని పూర్వోదాహృతమయిన పద్యములో "శుభమూర్తినామధేయు" నని "శుభ" విశేషణమొకటి గానబడుచున్నది. ఈ శుభవిశేషణ మెట్లు వచ్చినది, ఎవ్వరికి జెందినది, అన్న విషయము నాలోచింపవలయును. పూర్వోదాహృత మయిన హరిశ్చంద్రనలోపాఖ్యానములోని పద్యములో రామభూషణకవి "రామవిభుదత్త 'శుభ' చిహ్న విభవయుతుడ" నని వ్రాసికొని యున్నాడు. కాబట్టి దీనినిబట్టి చూడగా శుభబిరుదమును రామరాజిచ్చెననియు, రామరాజభూషణ నామము గలవానికిది చెందుననియు, విస్పష్టమగుచున్నది. నరసభూపాలీయ కృతికర్త తనకు శుభవిషేషణమును వేసికొనుటయు, హరిశ్చంద్ర నలోపాఖ్యాన కృతికర్త తనకు రామరాజు శుభచిహ్న మిచ్చెనని చెప్పుకొనుటయు, ఈ రెంటిని గూర్చి చిరకాలము నుండి పరంపరగా వచ్చుచున్న జనప్రతీతితో జేర్చి విచారించినపక్షమున నారెండు గ్రంథములను రచించినవా రొక్కరేయని చూపుట కది యొక ప్రబలసాక్ష్యముగా గనబడుచున్నది. రామరాజభూషణపదము బిరుదనామమే యైనపక్షమున, పైపుస్తకములయందలి నామవ్యత్యాసములనుబట్టి కవులు వేఱనిచెప్పుట కవకాశ ముండదు.రామరాజభూషణపదము బిరుదుపేరుగాక పేరేయై యుండినయెడల నదియంతట నేకరూపముగా నుండునేకాని పై పద్య గద్యములయం దున్నట్లొకచోట "రామరాజభూషణ" యనియు, ఇంకొకచోట "రామభూషణ" యనియు, వేఱొకచోట "రామనృపభూషణ" యనియు నుండదని యొకయుక్తి చెప్పుదురుగాని యదియంత ప్రబల యుక్తికాదు. కట్టకడపట జేసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానములో "వసుచరిత్రాదికావ్య" "బహునృపప్రాపితానేకరత్న" పదములను బ్రయోగించుటచే నాదిపద ప్రయో గముచేత రెంటికినడుమ నతడు చేసినకావ్య మింకొకటి యుండవలసి నందున నదియే నరసభూపాలీయమనియు, బహుపద ప్రయోగముచేత నిద్దఱికంటె నెక్కువరాజు లుండవలసి నందున వారే రామరాజు తిరుమలరాజు నరసరాజు ననియు, మూడుగ్రంథములను రచించినవా డొక్కడేయనుట కింకొకయుక్తిని జెప్పుచున్నారు. ఈ యుక్తి యెంత యాదరణీయమో బుద్ధిమంతులు తమలో దాము నిర్ణయించుకో వలెను. ఈకవి తన జనకపితను పాలకపితనుగూడ సంతోషపెట్టుటకయి యొక పుస్తకమునందు కన్నతండ్రిపేరు వేసెననియు, ఒకపుస్తక మునందు పెంచుకొన్న తండ్రిపేరు వేసెననియు, ఒకపుస్తకమునం దెవ్వరిపేరును వేయక విడిచెననియు జెప్పుచు, ఆయా పుస్తకములయం దుపయోగింపబడిన పదములే యొకడు జనకపితయనియు నొకడు పాలకపితయనియు సూచించుచున్నవని చెప్పుచున్నారు. హరిశ్చంద్ర నలోపాఖ్యానములోని "సూరపాత్మజుడ" నను వాక్యమువలన సూరపరాజున కౌరసుడని యాత్మజ శబ్దము దృడపఱుచు చున్నదనియు, నరసభూపాలీయము లోని "వేంకటరాయభూషణ సుపుత్రు" నను వచనమువలన వేంకటరాయ భూషణునకు దత్తుడని సుపుత్రశబ్దము దృడపఱచుచున్నదనియు వాదించుచున్నారు. ఈ యర్థములయం దాత్మజశబ్దమునకు దనవలన బుట్టినవాడుకాని దత్తుడు కాడనియు, సుపుత్రశబ్దమునకు పున్నామనరకము నుండి రక్షించు దత్తుడుకాని కన్నవాడు కాడనియు గ్రహింపవలెను. ఈ యంశముల కనుకూలముగానుండు కథలు కొన్నికలవుగాని గ్రంథ విస్తారభితిచే వానిని విడుచుచున్నాను.

వసుచరిత్ర కర్తయు నరసభూపాలీయకృతికర్తయు నొక్కడేమోయని నాకు సందేహము కలిగించుటకు గారణములయిన యంశములను మఱికొన్నిటిగూడ నిప్పు డిందు జేర్చుచున్నాను. వీనిని పయినిజెప్పిన వానితో జేర్చి చదివి బుద్ధిమంతులు తమ యిచ్చవచ్చిన సిద్ధాంతము చేసి కొనవచ్చును. 1. గీ. తా రచించిన వసుచరిత్రమున గన్న

తండ్రి సూరన వెలయించి తలప డయ్యె

నన్ను మన శారదామూర్తి నాఫలంబె

దత్తు డగువాని జేపట్టదరమె నాకు.


అను చాటుధారాపద మొకటి రామరాజభూషణుడు తన వసుచరిత్రములో జనకపితయైన సూరపురాజు పేరుదాహరించి తన్ను బేర్కొనకపోవుటచేత పాలకపితయైన వేంకటరాయభూషణునిచే జెప్ప బడినదని వాడుకలోనున్నది.

2. చతుర్భుజాభిషేకము, యావనచరిత్రము, గంగాగౌరీసంవాదము అను ప్రబంధములను రచించి ప్రసిద్ధుడయి వసుచరిత్రమునకు వ్యాఖ్యానముచేసిన సోమనాథకవి గ్రంధాదిపీఠికలో నిట్లు వ్రాసి యున్నాడు-

శా. ఈరీతిం గవితావితానవృతగౌరీశానమౌళిస్థలో

దారోద్దేశుడ నైననాకు వెస విద్యావంతు లెల్లన్మనో

హారప్రక్రియ మూర్తిచేత రచితంబై విశ్రుతంబౌ వసు

క్ష్మారాట్చిత్రచరిత్రటీక కయి యుత్సాహంబు పుట్టించినన్.


ఉ. కారణజన్ముడై కవినికాయము మెచ్చగ గావ్యకర్తయై

భూరికళాకలాపు డయి పొల్పువహించెడు బట్టుమూర్తిచే

నీరితమై సుఖారపదహీనపదాస్పద మైన యావసు

క్ష్మారమణప్రవృత్తము సుసాథ్యముకాదు తలంచిచూడగన్.


అని యిందలి మొదటిపద్యములో వసుచరిత్రము "మూర్తి" చేత రచిత మనియు, రెండవ పద్యములో "బట్టుమూర్తిచే నీరిత" మైనదనియు, వ్యాఖ్యాత చెప్పియున్నాడు. ఈ వ్యాఖ్యాత యేకాలమునందుండిన వాడో సరిగా తెలియదుగాని, అప్పటి కవికిని నహోబలపతికిని దరువాత నత్యల్పకాలములోనె పదునేడవ శతాబ్దాంతమున నున్నట్లు తెలియ వచ్చుచున్నది. పూర్వకాలమునందే యితడిట్లు వ్రాయుటనుగూర్చి మేమిచెప్పెదరు ? ఇతడు సావధానముగా గ్రంథమును బరిశీలించి ప్రతివాదులు తమ వాదమున కనుకూలములుగా నుదాహరించెడు గద్య పద్యముల కన్నిటికిని బ్రతిపదార్థమును వ్రాసి విమర్శించినవాడేకదా ?

3. అనేక గ్రంథములను జేసిన గొప్పకవులు సమానవర్ణనలు వచ్చెడుపట్టున తాము మొదట రచియించినగ్రంథములలో నుండి పద్యములను జేకొని యా వశ్యకములైన మార్పులను జేసి తరువాత రచియించెడుగ్రంథములలో జేర్చుకొనెడి యాచారముగలదు. తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణములో మూడవయాశ్వాసమున,


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబున గేల దార భీ

షణముగ నుప్పతిల్లి రభసంబున రేగినమాడ్కి దీన్రమా

ర్గణనికరంబులొక్కట నరాతిబలంబుల గప్ప శార్‌జ్గని

క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.


అని రచియించినపద్యమునే విరాటపర్వములో నయిదవయాశ్వాసమున గొంచెము మార్పుచేసి యీక్రిందిరీతిగా బ్రయోగించు చున్నాడు-


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబున గేల జాల భీ

షణముగ నుప్పతిల్లి రభసంబున రేగినమాడ్కి దీప్రమా

ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబుల గప్ప గాండివ

క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.

ఇందు "తార" యనునది "చాల" గను "శారజ్గనిక్వణ" మనునది "గాండివ క్వణనము" గాను, మార్పబడినవి. మఱియు సోమయాజులు,


మ. కలగెం దోయధిసప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడె సం

చలతంబొందె వసుంధరావలయ మాశాచక్ర మల్లాడె గొం ముప్రత్యయాభావమున పెద్దనార్య శిష్యు డైన బట్టుమూర్తి మహాకవి చేత రచితమైన వసు చరిత్రము నందని వ్రాసి,


"సీ. రాజహంసలుగాని రాజహంసలుగారు

సరసకళాసారసారరుచుల"


అను వసుచరిత్రములోని యీసీసపద్యమును లక్ష్యముగా, జూసి యున్నాడు. బట్టుమూర్తికి నూఱుసంవత్సరములలోపలనే యిట్లు గ్రంథస్థము చేసినవ్రాతను నిరాకరించుటకు ప్రబలప్రమాణము కావలసి యుండునుగదా ?


5. అప్పకవీయములో నుదాహరింపబడి యించుమించు రామరాజభూషణునికాలములోనే రచియింపబడిన లక్షణదీపికలో 416 వ పద్యము తరువాత,

"మంజీర శబ్దమునకు బట్టుమూర్తి వసుచరిత్ర మొదటిపద్యము ప్రథమచరణమున హల్లునకు బ్రయోగము".

అనివ్రాయబడి,

"శా. శ్రీభూపుత్రవివాహవేళ నిజమంజీరాగ్రరత్న స్వలీ,


ఇత్యాది వసుచరిత్రపద్య ముదాహరింప బడియున్నది. సరికాలమువారుకూడా సుప్రసిద్ధుడైన రామరాజభూషణుని బట్టుమూర్తియని భ్రమించుట పొసగ నేరదు గాన నిరువురు నొక్కరేయనుట యధిక విశ్వసనీయము.

ఈరామభూషణకవి మొట్టమొదట రచియించిన కావ్యము వసుచరిత్రము. ఈప్రబంధముతో సరిరాదగిన శ్లేషకావ్యము తెనుగున మఱియొకటిలేదు. ఇందలి వర్ణనలు మిక్కిలి మనోహరము లయి యున్నవి; పదములకూర్పు మిక్కిలి సుందరముగా నున్నది. శబ్దార్థాలంకారము లాహ్లాదకరముగానున్నవి; రసభావాదులు యథాయోగ్యములుగా నున్నవి. ఈగ్రంథము రచియింప బడినతరువాత నేటివఱ కును ప్రబంధములను జేయబూనిన కవు లెల్లరు వసుచరిత్రమును ప్రతి రూపముగా జేకొని దాని ననుసరించి తమగ్రంథములను రచియించు చున్నారు. ఈ వసుచరిత్రము హూణశకము 1570 వ సంవత్సరమునకు దరువాతనే రచియింపబడినది. వసుచరిత్ర కృతిపతియైన తిరుమల దేవరాయడు 1567 వ సంవత్సరమునందు తనరాజధానిని పెనుగొండకు మార్చెను. ఈతడు పెనుగొండను రాజధానిగా జేసికొన్నతరువాత మహమ్మదీయులతో జరిగిన యుద్ధవార్త వసుచరిత్రలోని యీ పద్యమునందు జెప్పబడియున్నది-


చ. తిరుమలరాయ శేఖరునిధీరచమూభటరాజి యాజి భీ

కరయవనేశ్వరప్రహితఖానబలంబుల జక్కుసేయ ని

ద్ధర బెనుగొండకొండలు మదద్విపచర్మకపాలమాలికా

పరికరభూషితంబు లయి బల్విడి గాంచె గిరీశభావమున్.


తిరుమలదేవరాయలు తనజ్యేష్ఠపుత్రు డయిన రఘునాథరాజు మృతుడయినతరువాత ద్వితీయపుత్రు డయిన శ్రీరంగరాజును యువరాజునుజేసి రాజ్యభారము నాతనిమీదమోపిన కథగూడ సూచనగా నీపుస్తకమునందు జెప్పబడియున్నది-


చ. హరిపదభక్తిశీలుడగు నారఘునాథనృపాలుకూర్మిసో

దరుడు సింగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ

త్తిరుమలరాయ శేఖరవితీర్ణ మహాయువరాజపట్టబం

ధురడయి సర్వభూభువనధూర్వవాశ క్తివహించు నెంతయున్.


తిరుమలదేవరాయ డవసానదశలో తనరాజ్యభారము నంతను కొడుకులమీద వదలివేసిన తరువాత మూడవకొడు కయిన వేంకటపతిరాజు ఆలీ ఆడిల్ షాతో యుద్ధము చేసి పరాజితుడయి 1777 వ సంవత్సరమునందు రాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మరల మార్చెను. వేంకటపతిరా జోడిపోయినసంగతిని జెప్పకపోయినను కవి వసుచరిత్రములోని యీ క్రిందిపద్యములో వేంకటపతి రాజధానిని చంద్రగిరికి మార్చినసంగతి సూచించియున్నాడు-

మ. హరు డాతారకశైలదుర్గమున నధ్యాసీనుడై రాజశే

ఖరవిఖ్యాతి వహించు జందగిరిదుర్గంబందు శ్రీవేంకటే

శ్వరు డొప్పెన్, బహురాజశేఖరసదాసంసేవ్యుడై యౌర యి

ద్ధర బంటేలికవాసి తద్గిరులకున్ దద్వల్లభశ్రీలకున్


ఈపద్యముల నన్నిటిని బట్టి చూడగా వసుచరిత్రము 1577 వ సంవత్సరము తరువాతనే ముగింపబడినట్టు స్పష్ట మగుచున్నది. తిరుమలరాయ డేసంవత్సరమునందు మృతినొందెనో స్పష్టముగా దెలియదుగాని 1574 వ సంవత్సరమువఱకును నాత డిచ్చిన దానశాసనములు కనబడుచున్నవి; 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరమువఱకును అతని రెండవకొడు కయిన శ్రీరంగరాజు దానశాసనములును, 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును మూడవకొడు కయిన వేంకటపతియొక్క దానశాసనములును కానవచ్చుచున్నవి. తిరుమలదేవరాయడు 1574 వ సంవత్సరమునకు దరువాత రాజ్యభారమునంతను పూర్ణముగా కొడుకుల కప్పగించి తాను విద్వద్గోష్ఠితో ప్రొద్దుపుచ్చుచుండి యుండవచ్చును. 1577 వ సంవత్సరమునందు ఆలీఅడిల్‌షా తిరుమలదేవరాయని పెనుగొండనుండి చంద్రగిరికి పాఱదోలినట్టు మహమ్మదీయులు వ్రాసినచరిత్రమునందున్నది. దీనినిబట్టిచూడగా తిరుమలదేవరాయడు 1577 వ సంవత్సరమునకు దరువాతకూడ గొంతకాలము జీవించియున్నట్టు తోచుచున్నది. రామరాజభూషణుడు తిరుమలరాయనికి వసుచరిత్రము నంకితము చేయునపుడు తెనాలిరామకృష్ణు డక్కడకు వచ్చి "శ్రీభూపుత్రి" యని మొదటిపద్యమును జదువ నారంభింపగానే పకపకనవ్వి యీకృతి చదువుటతోనే శ్రీపోయెనని గేలిచేసె ననియు, అదియెట్లని సభవా రడు గగా నతడు చేతిలో బూడిద వేసికొని యందు శ్రీ యనునక్షరమును వ్రాసి చేయి నోటిదగ్గఱగా బెట్టుకొని బిగ్గరగా శ్రీభూపుత్రి యని (భూ) ద్వితీయాక్షర మొత్తి చదువగానే యాగాలిచేత చేతిలో వ్రాసిన శ్రీ యెగిరిపోవుట చూపె ననియు, అందుమీద రాజు కృతినందక నిరాకరించెననియు పనికిమాలిన కథయొకటి చెప్పుదురు. ఈ ప్రకారముగానే రామరాజభూషణుడు "నానాసూనవితానవాసస"లన్న పద్యమును నందితిమ్మన్నయొద్దను "మోహాపదేశ తమోముద్రితములైన" యను పద్యము నయ్యలరాజు రామభద్రుని యొద్దను కొని తన వసుచరిత్రము నందు వేసికొనెనని కొందఱు కొన్నికథలు కల్పించి యున్నారుగాని యవి యన్నియి నవిశ్వసనీయములే. అటువంటి యుద్గ్రంధమును జేయ గలిగిన మహాకవి రెండు సామాన్యపదములను జేయలేక యితరులవలన దొంగలించి తనవిగా దన గ్రంథమునందు వేసికొనెనని చెప్పుటకంటె బరిహాసాస్పద మయిన మాట మఱియొకటి యుండదు.

రామరాజభూషణు డొకనాడు సభలో రాజాజ్ఞమీద కవీశ్వరులకు "కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్" అని సమస్య యియ్యగా తెనాలిరామకృష్ణుడు


 క. గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజెలకొడుకా ! యొక్కడ
గుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్?

అని పూరించె ననియు, అదియే రాజు తానిచ్చినట్లు భావించి పూరింపుమని యడుగగా

 <poem> క. రంజన చెడి పాండవు లరి 

భుంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా! సంజయ! విధి నేమందును ?

గుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్.

అని పూరించెననియు, రాజాతని సమయోచితబుద్ధికి సంతోషించి బహుమాన మిచ్చెననియు చెప్పుదురు. తెనాలిరామకృష్ణుడు రామరాజభూషణుని యొక్క కడపటి దినములలో నున్నవాడగుటచేత నిది సత్య మయినను కావచ్చును.

నరసభూపాలీయము రచియించిన కవి యెవ్వరయినను కృతిపతి రామరాజ తిరుమలదేవరాయలకు మేనల్లు డయిన నరసరాజు, ఈనరసరాజుయొక్క మాతామహుడయిన శ్రీరంగరాజునకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటపతి, అని యయిదుగురు కొడుకులును, లక్కమాంబ, ఓబమాంబ, కోనమాంబ అని ముగ్గురు కూతులును ఉండిరి. ఆ కొమార్తెలలో లక్కమాంబ కుమారుడయిన నరసరాజు కావ్యాలంకార సంగ్రహమను నరసభూపాలీయమును కృతి నొందెను; ఓబమాంబ కుమారుడయిన గొబ్బూరి నరసరాజు రామాభ్యుదయమును కృతినందెను; కోనమాంబ కుమారుడయిన తిమ్మరాజు పరమయోగివిలాసమును రచియించెను. వీనిలో నరసభూపాలీయము ప్రతాపరుద్రీయమునకు తెలుగు, నాటక ప్రకరణమును మాత్రము విడిచి ప్రతాపరుద్రీయము లోని లక్షణభాగమునంతను కవి తెనిగించినను లక్ష్యములను నరసభూపాలునిపేర గ్రొత్తగా రచించెను.

రామరాజభూషణుడు సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును మిగుల ప్రావీణ్యము గలవాడు. ఈతడు రచియించిన కృతులు కొన్ని యక్కడక్కడ నేటివఱకును పాడ బడుచున్నవి. ఒకవేళ వసుచరిత్రములో తిరుమలదేవరాయడు కవిగూర్చి "బహు సంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించితి" వన్న కృతులివియే యయి యుండునేమో! కవులిప్పటివలెనే పూర్వకాలమునందును విద్యామత్సరము కలవారయి యొండొరులతో వివాదములు పెట్టుకొనుచుండినట్లు కనబడు చున్నది. ఇట్టి యసూయపరత్వము రామరాజభూషణునివద్ద సహితము బొత్తిగా లేకపోలేదు. ఇతడొకసారి యయ్యలరాజు రామభద్రకవి కవిత్వమునందు తప్పుపట్టబోయి యవమానము నొందెనట. రామభద్రకవి విరచితమైన రామాభ్యుదయమునందు తప్పుచూపెదనని పంతము పట్టి, తప్పు చూపలేకపోయినయెడల తలమీద తా నాతనితన్ను తినెదనని రాజసభలో రామరాజభూషణు డొప్పుకొనెనట. అంతట మధ్యవర్తుల సమక్షమునందు గ్రంథపఠన మారంభించి చదువుచుండగా ద్వితీయాశ్వాసారంభములోని


సీ.సింహనఖాంకురచ్ఛిన్నవారణకుంభజనితముక్తాఫలశర్కరిలము

సమదసూకరపరస్పరభీకరాఘాతశిధిలదంష్ట్రాచూర్ణసికతిలంబు

గంధసింధురఘటాకటకటాహప్రవద్బంధురదా నాంబుపంకిలంబు

దవగంధవహబంధుదహ్యమానానేకకౌశికాగురుధూపగంధిలంబు


పృథులషడ్జస్వరోద్గితభిల్లపల్ల

వాధరాగీతికాకర్ణ నాతిభీతి

పరవశాత్మపటీరకోటరకుటీర

లీనఫణియగు నక్కాన కాన నయ్యె.


అను పద్యముకడకు వచ్చునప్పటికి రామరాజభూషణుడు రామభద్రకవిని వారించి "శిశుర్వేతి పశుర్వేతి వేత్తి గానరసం ఫణి" యనున్యాయముచేత సంగీతమునకు సర్సము లానందింపవలసియుండగా భయపడి పటీరతతు కోటరములలో దాగినట్లు చెప్పితివిగాన నిది దోషమని యాక్షేపించెనట. దానికి రామభద్రకవి తాను కేవల సంగీతమునకు భీతిల్లినట్లు చెప్పక షడ్జస్వరముతో పాడబడిన గీతికకు పాములు భయపడినట్లు చెప్పితిననియు "షడ్జం మయూరో వదతి" యని యుండుటచేత షడ్జస్వరోద్గీతమైన గీతమును విని నెమలికూతయని పాములు భయపడి పాఱి తొఱ్ఱలుదూఱుట స్వభావమేయనియు, సమాధానమును చెప్పెనట. సభవారాయాక్షేపణ సమాధానములు విని రామరాజభూషణుడే యోడెనని నిర్ధారణము చేసిరట ! అంతట పట్టిన ప్రతిజ్ఞ ననుసరించి రామభద్రకవి రామరాజభూషణుని శిరోవేష్టనము తీయించి క్రింద బెట్టించి సభలో నాతనితల దన్నెనట! కొందఱాతని తలకు మాఱుగా శిరోవేష్టమునే తన్నెనని చెప్పుదురు. ఈ కథ యిప్పుడు క్రొత్తగా వచ్చినదిగాక యప్పకవికాలమునాటికే యున్నందున దీనియందు గొంత సత్యమున్నదని యూహింప వలసియున్నది. అప్పకవి పూర్వకవి వర్ణనము చేయుచు తన గ్రంథములో


"రామరాజవిభూషణరత్నఖచిత

చారుమస్తకలాపాపహారి వాక్య

గౌరవము పెక్కుభంగుల గణనచేసి"


అని రామరాజభూషణునియొక్క కిరీటమును దీయించినవాడని రామభద్రకవికి విశేషణముగా జెప్పినాడు.

హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచించునప్పటికి రామరాజుభూషణుడు వృద్ధుడయినాడు. అప్పటికే విద్యానగరసంస్థాన మంతయు పూర్ణముగా నిశించిపోయినది. పింగళి సూరనార్యుడు రాఘవపాండవీయమును జేసినతరువాత రామరాజభూషణుడు హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచియించెను. ఈ రెండుగ్రంథములలోని గుణదోషము లెట్టివైనను రాఘవపాండవీయమునకు వచ్చిన ప్రసిద్ధి యీ గ్రంథమునకు రాలేదు. రామరాజభూషణు డీ ద్వ్యర్థికావ్యమును శ్రీరామాంకితము చేసెను. ఈ కృతి పదునాఱవ శతాబ్దాంతమునందు రచియింపబడినట్టు కనబడుచున్నది. కాబట్టి రామరాజభూషణుడు 1550 వ సంవత్సరము మొదలుకొని 1590 వ సంవత్సరమువఱకును గ్రంథరచన చేయుచున్నట్లు చెప్పవచ్చును. పూర్వోక్తములయిన మూడు గ్రంథముల నుండియు గొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను.

వసుచరిత్రము

మ. సతియూరుద్యుతి జెందబూని నిజదుశ్చర్మాపనోదక్రియా

రతి బాథోలవపూరితోదరములై రంభేభహస్తంబు లు

న్నతఱిన్ వీడె మరుద్విభూతి గదళిం ద్వగ్దోష సూచంచలో

ద్ధతశుండాతతి బాయ దయ్యె నడె పో తద్వైరమూలం బిలన్.


[ఆ.1]శా. రాజీవాక్షుల నేచుపాతకివి చంద్రా! రాజవా నీవు? నీ

రాజత్వంబున జక్రముల్ మనియెనో? రంజిల్లి సత్సంతతుల్

తేజం బందెనొ? డిందెనో యహిభయోద్రేకంబు? తా జెల్లరే!

రాజై పుట్టుట రశ్మిమాత్రఫలమే? రా జౌట దోషార్థమే? [ఆ.4]

హరిశ్చంద్ర నలోపాఖ్యానము

ఉ. కమ్మనిపువ్వుదేనియల గాక లడంచు బ్రవాళతాళనృం

తమ్ముల సేదదేర్చు విరతావులచల్వులు గ్రమ్ముమంచిపూ

దుమ్ముల బూజసల్పు బ్రతతు ల్వరమంజులతాధిరాజ్యయో

గమ్మున బొల్చు నాసుగుణకల్పవల్లి వనిం జరింపగన్. [ఆ.3]


చ.కుదురుమెఱంగునిబ్బరగుబ్బలపై నయనాంబుపూరముల్

చెదరగ నేల యేడ్చెదవు చెల్వ దురంతవిషాదవేదనా

విదళితమానసాబ్జవయి వే తగు వాయువు శాశ్వతంబె సం

పదలు స్థిరంబులే విధివిపాకము దాట దరంబె యేరికిన్. [ఆ.5]

నరస భూపాలీయము

మ. బలితంబై నమనోజబాణహతిచే, బల్మాఱు నిల్పోపలే

కలినీలాలకప్రాణము ల్వెడలి నేత్రాంభోజమార్గంబునన్ గలయంబ్రాకుచువచ్చి యన్నెలవునన్ గన్నీటియే ఱడ్డమై నిలుప న్నిల్చె నృసింహభూరమణ మన్నింపంగ బాడింతటన్. [ఆ.2]

ఉ. చందనశైలసానువుల జాల జెలంగుభుజంగబాలికా బృందము శ్రీనృసింహవిభు బేర్కొనిపాడ దదీయగానని ష్యందము లానువేడ్క బెరయంగ గురంగతురంగ మేగిమిన్ మందగతిప్రసంగములు మానవు దక్షిణగంధవాహముల్. [ఆ.5]

                           __________

23. మల్లారెడ్డి

ఇతడు రచియించిన షట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథ మొకటి నాయొద్దనున్నది. దీనిని తాలపత్రముల మీద వ్రాసినవా రేహేతువుచేతనో కృత్యాదిపద్యములను వదలివేసి షష్ఠ్యంతములు మొదలుకొని వ్రాసియున్నారు. ఈపుస్తకమునందలి యాశ్వాసాంతగద్య మిట్లున్నది.

"ఇది శ్రీమద్బిక్కనవోలిపట్టణ ప్రసిద్ధ సర స్తటావలంబ సిద్ధరా మేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృ తాంధ్రభాషాకవి రతాసపోషణ విశేషతా చమత్కార గురుభక్తివిహార రాచుళ్ల గోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధవిధేయ మల్లారెడ్డి నామ

ధేయ ప్రణీతంబైన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు నందు___ఆశ్వాసము."

ఈమల్లారెడ్డి యిభరా మని మనపుస్తకములలో జెప్పబడిన యిబ్రహీము గోలకొండ నవాబుగా నున్నకాలములో నుండి యొకసారి యాతని యాస్థానమునకు దనయాస్థానకవీశ్వరుని తోడగూడ బోయినప్పుడు,