పుట:మత్స్యపురాణము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

5


లగు సుమనోరసంబులపరిమళంబులకు నిలయంబు లై శీతలపానీయపూరి
తంబు లైన సరోవరంబులచేత నలంకృతంబును మునికుమారులకు సహశ్రోత
లనం బరఁగు శుకశారికలచేతఁ బఠితంబు లైన వేదాంతవాక్యంబుల రచ
నావిశేషంబుల శ్రవణమనోహరంబును నిర్వైరంబునఁ బర్ణశాలాంగణంబున
సంచరించు మృగస్తోమంబులచేత దర్శనీయంబును బాలతరుమూలకల్పి
తంబు లగు నాలవాలంబులసేచనంబునకు నై జలపూరితంబు లగు కల
శంబులు కరంబులం గీలించి వనమధ్యంబునఁ దద్వనదేవతలో యనఁ బరి
భ్రమించుచు నిండుజవ్వనంబున విఱ్ఱవీఁగు మునికన్యకలచేత నభినుతంబును
వివిధయోగిజనసమాజసంకులంబును హరిభక్తసమేతంబును సకలమంగళా
శ్రయంబును సర్వపుణ్యనిలయంబు నగు నారాయణాశ్రమంబు చేరంజని.

20


సీ.

వ్యాఖ్యానముఖరవేదాంతవాక్యంబుల
        శ్రవణయుగ్మమున కుత్సాహ మొదవ
ఫలితపుష్పితనూత్నపాదపప్రకరంబు
        లెడపక కన్నుల కింపుఁ జూపఁ
దుదిముట్టఁ జనుహోమధూమగంధంబులఁ
        దనువునకును శుచిత్వంబు నిగుడఁ
దత్పుష్పపరిమళోద్యతమారుతంబున
        మార్గసంజాతశ్రమంబుఁ దొలఁగ
శౌనకుం డంత సంతోషసహితుఁ డగుచు
నట్టి సన్నుతనారాయణాశ్రమప్ర
వేశ మొనరించి యందు సంవిష్టుఁ డైన
మునివరేణ్యుని దర్శించి ముదితుఁ డగుచు.

21


గీ.

అంతఁ దత్కృతంబులకు నాతిథేయంబు
లంది యంచితాసనాంతరమున
నతిముదంబుతోడ నాసీనుఁ డై యుండి
పలికె శానకుండు భక్తి మెఱసి.

22