ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మూఁడవ ప్రకరణము
మగధరాజ్యము నాక్రమించుట
మహాపద్మ నందుని వార్ధకము నందు రాచకార్యము లన్నియు నతని ఎనమండుగురు కుమారులే చూచుచుండిరి. వారు గర్వాంధులు. మంత్రి శ్రేష్ఠుండును అనన్యసామాన్యస్వామి భక్తి భూషితుండును అగు నమాత్య రాక్షసుని బోధలు వినక వారు చాణక్యుఁడను బ్రాహ్మణుని అగౌరవించుటయు నతఁడు నందుల నందఱను సంహరించెద ననియు చంద్రగుప్తునకు రాజ్యము గట్టెదననియు నీ రెండు కార్యము లయినంగాని జుట్టు ముడివేయననియుఁ బ్రతిజ్ఞ చేయుటయు నిదివఱకే వర్ణింపఁబడి యున్నది.
అట్లు రెండుపంతములఁ బట్టిన యాబాపడు మౌర్యుని వెంటఁబెట్టుకొని పోయెను. త్రోవలో చాణక్యునకు అత్యంత స్నేహితుఁ డొకడు నివసించుచుండెను. ఇతనిపే రిందుశర్మ. ఈతఁడును చాణక్యుఁడును ఒక్క గురువునికడ విద్యనేర్చినవారు. ఇందుశర్మ శుక్రనీతి యందును జ్యోతిశ్శాస్త్రమందును అఖండమైన నేర్పుగలవాఁడు. చాణక్యుఁ డతని యాశ్రమమున