పుట:AndhraRachaitaluVol1.djvu/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

' పంచాయితీబోర్డు ' నకు యాజమాన్యము. తణుకు జాతీయ పాఠశాల కార్యవర్గమునకు అధ్యక్షత. ఇవన్నియు మనము యోచించుకొన్నచో నారాయణశాస్త్రిగారు లౌకిక ప్రజ్ఞావంతులని విశదమగును. పండితుడై యుండి పాఠములు చెప్పుకొనుచు గాలక్షేపము చేయకుండ, రాజకీయముగా గలుగజేసికొనుట వీరి చరిత్రములో గమనింప దగిన సంగతి.

ఆంధ్రవైయాకరణులలో నారాయణశాస్త్రిగారికి గౌరవప్రదమైన తావు ఏర్పడియున్నది. దానికి గారణము వారు శ్రమించి కూర్చిన నారాయణీయాంధ్ర వ్యాకరణము. నన్నయా ధర్వణు లిరువురు సంస్కృతములో సంతరించిన "ఆంధ్రశబ్ద చింతామణి, వికృతివివేకము" అను వ్యాకరణముల కిది తెలుగుగ్రంథము. విశేషము, వీరిది పద్యరూపముగా సంధానించిరి. వారి కుమారులు గణపతిశాస్త్రిగారు దానికి వివరణము వ్రాసిరి. తండ్రి కొడుకుల చేతులమీద నడచిన యీకృషి చూచుటకు ముచ్చటగా నున్నది. నారాయణశాస్త్రిగారి కవితారీతి యీ లక్షణగ్రంథములో నిటులు నడచుచున్నది. మనపూర్వులందరు వ్యాకరణము, ఛందస్సు, తదితర సమస్తశాస్త్రములు పద్యములలోనే నిబంధించి యున్నారు. లక్షణగ్రంథములు పద్యబంధములై యుండుట కవితాధారవాహితకకు మిక్కిలి యడ్డు. కాని, మనవారు శ్రమించి దానికి గొరంత రాకుండ జూచుకొని కొంతవరకు సఫలులైనారు.

క. సకలశ్రేయ స్సాధన
ము కావ్య; మయ్యది యదోషము గుణాలంకా
రకలితము నైన వాగ
ర్థకాయమున నొప్పు; వాక్కురసజీవ సుమీ !

క. రసముచెడకుండ నాయా
రసముల కనుగుణము లయిన రసవత్తర వా
గ్వినరంబు తోడ గావ్యము
రసికులు తమకొలది నుడువరాదొకొ దానన్.