పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“భర్తృదారికా! నేను తారానికను తమ అంగరక్షకురాలిని!”

“అవును నిన్ను ఎరుగుదును, నువ్వు బ్రహ్మదత్తప్రభువు అంగరక్షకులలో ఒకరైన నాగదత్తుడు అనే యువకుణ్ణి ప్రేమిస్తున్నావని, మీ వివాహం వైశాఖమాసంలో కావచ్చునని విన్నాము, నిజమేనా?” అని శాంతవదనంతో ఏ భావాలు వ్యక్తంగాని చూపులతో రాజకుమారి శాంతిశ్రీ ప్రశ్నించింది.

“చిత్తం !”

“సరే నీవు రావచ్చును.... వెళ్ళు - పాలకురాలికి ఆజ్ఞ ఇత్తును.”

తారానికి సంతోషంతో వంగి రాజకుమారి పాదాలంటి వెడలిపోయింది. ఆమె ఉప్పొంగిపోయింది. ఎంతవిచిత్రము.... పురుషుని పేరయినా తలవని ఈ బాలిక, నిర్వికారవర్తనఅయిని ఈ దేవి తనకు అనుమతి ఏలా ఇచ్చినది? నిరుడు వసంతోత్సవాలలో బ్రహ్మదత్తప్రభువు ఈ బాలికను రతీదేవిగా ఎన్నుకుంటే విచారంతో కుంగిపోయింది. అదివరకు విచారమూ ఎరుగదు, కోపమూ ఎరుగదు, దయా ఎరుగదు. అంతఃకరణ ప్రపత్తులే లేవన్నారు. అలాంటిది ఈ ఏడు వసంతకాలంలో ఈ రాజకుమారి కలకలలాడుతూ దివ్యపథాలనుండి దిగివచ్చిన త్రిజగన్మోహినిలా వసంతోత్సవంలో విలసిల్లిపోయినదట. ఓహో! ఏమీ రాకుమారి సౌందర్యం!తామెవ్వరూ ఆ బాలికను తేరిపార చూడలేరు. ఆమెకు తన వసంతోత్సవం కళ్ళకుకట్టినది. తన ప్రియుడు నాగదత్తుడు వసంతదేవుడైనాడు. ఆ మనోహరుని విశాలఫాలం, గరుడనాసిక, కండలుకట్టిన విశాలవక్షము, ఆ గోమూర్ధకటి, ఉన్నతమూర్తి, తుమ్మెదరెక్కల మీసాలతో పుష్పాలంకృతుడై వెలిగి పోయినాడు.

6

సాలగ్రామ వసంతోత్సవం అతివిచిత్రంగా ఏర్పాటు చేశాడు నాగదత్తుడు. రాత్రులు కాగడాల వెలుతురున చంద్రోత్సవం జరిగింది. మధు మాసదేవుని అలంకార విధానం మార్చినాడు. వనదేవిగా తారానికను ఎన్నుకొనడమే ఒక అద్భుతకల్పన. ఒక మోడుచెట్టును ఉత్సవంచేసే స్థలంమధ్య పాతినారు. అక్కడక్కడ వట్టిగంపలు నిలువెత్తున మ్రోడుగా ఉన్నవి. మధ్యను ఒకధాన్యపు పురి ఏమీ అలంకరణ లేకుండా ఉంది. ప్రజలందరూ ఈ ఉత్సవం చూడడానికి వీలుగా ఎత్తయిన మంచెలు చూట్టూ కట్టించినాడు. శుభముహూర్తం రాగానే మూడేళ్ళనుండి అయిదేళ్ళవరకూ ఈడుగల ఇరు వదిమంది బాలికలు ఆకులతో, లతలతో అలంకృతులైనవారు పాడుకుంటూ వచ్చారు.

“చలిచేత వణికామె
    మలిసంజ పోయినదె
            తొలిప్రొద్దు ఉదయింప
                   తూరుపున ఎరుపెక్కె
                          ఏడె మా మధురాజు
                                  ఏడమ్మ తెలుపరే!"

అడివి బాపిరాజు రచనలు - 6

146

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)