బాంధవియగు నచ్చమాంబగారు ఆ పిల్లవాని తెల్విచూచి వానిని బిచ్చ మెత్తు కొనవలదని చెప్పి, యింటనుంచుకొని యన్ని వ్యయప్రయాసములకోర్చి విద్య నేర్పెను. వాని తల్లి కొక యావును గొనియిచ్చి దీని పాలమ్ముకొని జీవనము చేయుమని త్రోవచూపెను. ఆహా! ఏమి యీ దీనదయాళుత్వము! దీన జనులకును, అనాధులకును దల్లి పోయినదే! 1904 డిశంబరు నెలలో బొంబాయికివెళ్ళి యచ్చటి ఎగ్జిబిషన్, మహిళాపరిషదము, మున్నగు వన్నియు వీక్షించి, 1 వ జనవరి నటనుండి బయలుదేరి బిలాస్పురము వచ్చి యా నెల 8 వ తేదీ మొదలు 18 వ తేదీ వరకు నఖండమైన జ్వరముచే బీడింపబడి, యీ యద్వితీయ సాధ్వీమణి 18 తేదీ పగలు 11 గంటలకు బుద్బుదస్రాయమైన ప్రకృతి దేహమును జాలించి, శాశ్వత కీర్తికాయమును బొందినది. ఈ సతి యీ లోకమును విడచునప్పుడు, నీవు చదివిన వేదాంతము నుపయోగపరచుకొని దు:ఖము వడచి వేయుము అని తల్లిగారికిని, దగురీతి నితరులకు బోధించి, తన ప్రాణ సమానుడగు సోదరుని బిలిచి తానుబెంచుచున్న పసివాడగు దీనబాలునికి విద్యాబుద్ధులు చెప్పించుటకు శ్రద్ధవహింపుమని చెప్పెను. ఈమె వియోగ దు:ఖమగ్నులగు నీమె భర్త, తల్లి, సోదరుడు మున్నగువారి కందరకు నీమె మృతజీవయను విషయ మనుక్షణము జ్ఞప్తికి దెచ్చుచు దు:ఖోపశమనము మనశ్శాంతియు భగవంతుడు కటాక్షించు గాక!
ఉ. హా! వరవర్ణినీప్రముఖ! హా విదుషీ మణి!!హా!సపూజ్య!!హా!
పావనీ!!!జీవయాత్రగడుపంగల పద్ధతి నీ స్వజాతికిన్
గైవశమాదరించుపనికై ధరియించినయట్టి కాయమున్
బోవిడి కీర్తికాయమును బొందితె! నీ పనిదీరెనేకటా!!!
తే. సాధ్వి! యార్యోక్తులను శిరసావహించు
నీగుణాతిశయత "సుకృతీగతాయు"
వనెడు నార్యోక్తిసార్థకంబును నొనర్చి
ధరబ్రదర్శింప నిట్టుల దలచితమ్మ!