పుట:2015.329863.Vallabaipatel.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

వల్లభాయిపటేల్

మా సభలోనే చర్చించఁబడినది. ఆ సభలో నాయన పలికిన యీ పలుకు లీ నాటికిని నా చెవిలోఁ బ్రతిధ్వనించుచున్నవి.

"యుద్ధారంభకాలమునుండి కలసి ముందడుగు వేయుటకే మనము ప్రయత్నించితిమి. కాని యీసారి యది సాధ్యపడకపోవచ్చును. గాంధీజీ యొక నిర్దిష్టవైఖరి నవలంబించినాఁడు. నేను గాంధీజీ వశంవదుఁడను. అనేక విషమస్థితులలో నాయన మనకిచ్చిన నాయకత్వము సమంజసమని ఋజువైనది. నేఁడుకూడ నాయన వైఖరి యత్యంతము సమంజసమైనదనియే యభిప్రాయము. ప్రభుత్వముతో రాయబారములకై పెక్కు పర్యాయములు ప్రయత్నించి నిందాపరంపరనే పొందితిమి. ఇక నీ రాయబారపువ్యవహారము కట్టిపెట్టవలయును. ముసాయిదా తీర్మానముతో నేను బూర్తిగా నంగీకరించుచున్నాను."

గాంధీజీ తీర్మానము గుఱించి బ్రిటిషువారు, అమెరికనులు, నేవిధముగా నభిప్రాయపడుదు రని సర్దా రొక్కక్షణమైనఁ దటపటాయించలేదు. గాంధీజీ తీర్మానము ఫలితముగాఁ బ్రపంచములో బ్రిటిషుప్రభుత్వప్రతిపత్తి దెబ్బతినఁగలదని యాయనకుఁ దెలియకపోలేదు గాని, యాయన చలించలేదు. హిమాద్రివలెఁ పట్టుఁబట్టినాఁడు. జాల్పైగురీ, త్రిపురీసభలలోఁ బ్రారంభమైన కార్యక్రమమును బొంబాయిలో నంతిమ స్వరూపమునకుఁ దెచ్చెను. తరువాత జరిగినది భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో సమరఘట్టము. చూచీ చూడనట్టుగాఁగాని యేదో జరుగునని కార్యశూన్యత్వముతోఁగాని యుండుట గత 25 సంవత్సరములలో సర్దార్‌తత్త్వము కానేకాదు. భారతజాతీయ స్వాతంత్ర్యోద్యమమునకుఁ దత్క్షణస్వార్థలాభమునకు మధ్యఁ