206 సాహిత్య మీమాంస
అహింసాప్రశస్తి ఆర్యసాహిత్యమున నన్నికడల నావరించియున్నది. శ్రీకృష్ణుని చరితమున నీధర్మ ముజ్వలరూపమున గాంచనగును. భీష్మవిదురాదులు హింసాహీనులు, శ్రీశుకుడు నారదుడు మొదలగు ఋషులచరితములం దహింస ప్రత్యక్షరూపమున పరిఢవిల్లుచున్నది. ఇదే హిందువులకు ప్రధానధర్మము, దానిచేతనే వారి ప్రకృతి కోమలతరము నమ్రతరము నగుచున్నది. అది వారిని క్షమాశీలురను కావించి వారిగృహములను శాంతినికేతనముల నొనర్చుచున్నది. శాంతిమయమైన అహింసావతారమే బుద్ధదేవుడు, అతని కహింస నేర్పినది, హిందూమతము; అహింసామహాధర్మము నుపదేశించుటవల్లనే బుద్ధుడు జినుడును శాంతిస్థాపనాసమర్థులైరి. క్రైస్తవులం దీధర్మమునకు తగినంత ఆధారము దక్కలేదు, అందుకే ఐరోపీయసాహిత్యమున నది అరుదుగా దోచును. ఆమతమున న్యాయపరతకు లభించిన ప్రాచుర్యము ప్రాముఖ్యతా క్షమాగుణమునకు చిక్కలేదు. కఠినశిక్షా విధాన మార్యసాహిత్యమందూ కద్దు. ధర్మక్రోధ మెచ్చునపుడు పాపమునకు కఠినశిక్ష ప్రాప్తించకపోదు. కాని దీనికి తోడుగా క్షమయూ పుణ్యజ్యోతిన్నీ ఆయాచోట్ల స్ఫురణ వహించి యుండును.
స్వర్గము
శ్రద్ధ, భక్తి, ప్రేమ, క్షమ, అక్రోధము, అహింస మొదలగు గుణములచే పూరితములైన దేవతాదర్శములు