ద్రావిడవేదానికి మూలకర్తయైన పరాంకుశ మహాయోగిని - భాష్యకారాది ఆచార్యవర్యులను ఒక సీసపద్యంలో నుతించాడు. అనంతరం రామాయణ భారతకర్తలైన వాల్మీకి వ్యాసులను ఒక పద్యంలో నుతించి, కాళిదాసు - భవభూతి - మురారి - మయూర - బాణ - శంకర - జయదేవ - మాఘ ప్రభృతులైన సంస్కృతకవివర్యులను వేరొకపద్యంలో ప్రస్తుతించాడు. తరువాతి పద్యంలో తెలుగులో కవిత్రయంగా ప్రసిద్ధివహించిన నన్నయ - తిక్కన - ఎఱ్ఱనలను నుతించి వేరొకపద్యంలో కుకవులను ఘోరఘూకోత్కరాలుగా తిరస్కరించాడు. నరసింహకవి నారదీయపురాణాన్ని ఎనిమిదాశ్వాసాల గ్రంథంగా విరచించాడు. ప్రథమాది అష్టమాశ్వాసాంత్యపర్యంతం ఆయా ఆశ్వాసాలపరంగా ఈ క్రింది విధంగా వచనాలు పద్యాలు వున్నాయి.
ప్రథమాశ్వాసం - 516
ద్వితీయాశ్వాసం - 252
తృతీయాశ్వాసం - 189
చతుర్థాశ్వాసం - 354
పంచమాశ్వాసం - 235
షష్ఠాశ్వాసం - 264
సప్తమాశ్వాసం - 230
అష్టమాశ్వాసం - 277
మొత్తం నారదీయ పురాణంలో అవతారికా పద్యాలతో సహాకలిపి మొత్తం 2317 పద్యాలు వచనాలు వున్నాయి.
నారదీయపురాణం అష్టాశ్వాససంభరితమేకానీ వాస్తవానికి కేవల నారదీయపురాణానికి సంబంధించిన గ్రంథం ఏడాశ్వాసాలు పైగా మాత్రమే వున్నది. ప్రథమాశ్వాసంలో వున్న మొత్తం 516 పద్య గద్యాలలోను ఇష్టదేవతాస్తుత్యాదికాలుగా 24 పద్య గద్యాలను, నారదీయపురాణ కథాప్రారంభాదిగా వున్న మొత్తం 36 పద్య గద్యాలను తొలగిస్తే మిగిలిన 456 పద్యగద్యాలలో నారదీయపురాణ కృతిపతియైన శ్రీకృష్ణచరిత్రను అతిలోకకవితావైభవంతో వర్ణించడం జరిగింది.
"ఆ మహాగురు శిఖామణియొక్కనాఁడు స్వప్నంబున నన్నుఁగరుణించి నారదీయ సాత్విక పురాణంబు లోకోపకారార్థంబుగా నాంధ్రభాష రచియించి