పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసింహకవి తాతయైన మంత్రి ఉదారశీలుడుగాను, దయామయుడుగాను, అతనిభార్యయైన నాంచారు గొప్పవ్రతశీలిగాను వర్ణించబడింది. నరసింహకవి తండ్రి యైన చెన్నప్ప మహాపండితుడై శ్రీకృష్ణభక్తుడై ఉభయవేదాంత మహాసారలక్షణలక్షితుడై రామానుజాచార్య రత్నమయ చతుస్సింహాసనా ప్రవృద్దకారకుడై ప్రాక్తన దివ్యప్రబంధానుసంధాన నిరంతర మహిమకలవాడై వైష్ణవులలో అగ్రగామిగా మహాకీర్తి వహించాడట. చెన్నప్ప సతీమణి కృష్ణాంబ మహాసౌందర్యవతియై సద్గుణశోభితగా విద్వాంసురాలుగా అనేక ప్రశంస లందుకున్నదట.

లక్ష్మీనరసింహకవి దంపతులకు సింగన్న, అనంతుడు మొదలైన పుత్రులు కలిగారట. వీరి కెందరు పుత్రులు గలిగారో వారందరినీ పేర్కొనలేదు. సింగన్న, అనంతులు నామాలు రెండు మాత్రమే పేర్కొన్నాడు. తన పుత్రులు సైతం కవితావైభవులుగా చాటుకున్నాడు. శ్రీకృష్ణభక్తుడు. అనుపమమైన భక్తితో సమస్తవైష్ణవరహస్యార్థాల నన్నింటినీ గురువులద్వారా ఉపదేశం పొందిన పండితుడు. ఈ నరసింహకవి తనది ఆపస్తంభసూత్రంగా పేర్కొన్నాడు. నరసింహకవి యింటిపేరు "అల్లాడు" వారుగా కొన్నిచోట్ల "అల్లాడ" వారుగా మరికొన్నిచోట్ల కనిపిస్తున్నది. నరసింహకవి తన కవితాపాండితీబహుముఖప్రతిభలకు మూలకారకులైన తన గురువు కొండమాచార్యులగురించి వారి వంశంగురించి ఈ క్రింది పద్యాలు విరచించాడు.

ఏదేశికాధీశుఁ డిద్ధ బుద్ధి స్ఫూర్తి
        బ్రహ్మరాక్షసుల శాపం బణంచె
నేదేశికోత్తముఁ డెదిరించి నిలిచిన
        భక్తికిఁ జక్రాంకశక్తి యొసఁగె
నేదేశికాధ్యక్షుఁ డేకశిలాపురి
       నిజమతంబంతయు నిర్వహించె
నేదేశికాశ్రేష్ఠుఁ డాదియై రామాను
       జాచార్య విజయధ్వజాంకమయ్యె
నతఁడు వైష్ణవవీరసింహాసనస్థుఁ
డుభయవేదాంతవిద్యామహోన్నతుండు
శుద్ధసాత్వికధర్మప్రసిద్ధకీర్తి
శాలి కంచర్ల కేశవార్యమౌళి.