పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారదీయపురాణ కృతికర్త వంశాదికం - కాలం

అసాధారణమైన ఒకానొకవిశిష్టతగల తెలుగుకృతిగా నారదీయపురాణాన్ని విరచించిన అల్లాడు నరసింహకవి ఈక్రిందిపద్యాలలో తనవంశాదివిశేషాలను వర్ణించాడు.

శ్రీమద్వేద మయాంగు శోభనకళా శృంగార లీలా మహో
ద్దామున్ శ్రీరమణీ మనోహర హయోత్తంసంబు, సమ్యక్పురా
ణామోఘార్ధ శుభాంజనంబుఁ బతగాధ్య క్షోత్తముంగన్న యా
ధీమద్గ్రామణి కశ్యపాహ్వయుఁడు కీర్తిన్‌ మించె లోకంబులన్.


తద్వంశంబున

కరుణాకర మంత్రీంద్రుఁడు
కరుణా వరుణాలయుండు గంభీరుండా
తరుణార్క దివ్యతేజుం
డరుణానుజ రాజరాజితాత్మఁడు గలిగెన్.

ఆ మహామహుభార్య విఖ్యాతచర్య
సారగుణధుర్యయైన నాంచారు చారు
భాగ్య సౌభాగ్యకీర్తి యాపద్మపద్మ
సద్మముననుండి కావించె సద్వ్రతముల.

రామానుజాచార్య రత్నకల్పిత చతు
        స్సింహాసనస్థసుశ్రీ భజించి
యుభయ వేదాంత మహోన్నత సాత్వికా
        చారలక్షణ సత్ప్రశస్తిగాంచి
శ్రీకృష్ణపూజా విశేషలబ్ధ సమస్త
        సౌశీల్యగరిమచేఁ జాలమించి
ప్రాక్తన దివ్య ప్రబంధాను సంధాన
        సంతత మహిమఁదేజము వహించి
వెలసె వైష్ణవమాత్రుఁడె విబుధకోటి
యాశ్రయింపంగ సద్భక్తి నాదరించె
సిరుల నల్లాడు చెన్నప్ప శ్రీకరంపు
భావభావుక కీర్తి ప్రసన్నమూర్తి.

మా జనకుఁడు చెన్నప్ప ర
మాజనక గభీరతా సమగ్రత మించెన్
రాజోత్తములున్ వైష్ణవ
రాజోత్తములున్ నుతింప బ్రజ్ఞాశక్తిన్.