నారదీయపురాణం - ఉపనిషత్తులు
శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలన్న వాక్యం ప్రకారం గతంలో ఉటంకించిన భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు సైతం వాస్తవానికి పురాణాలకంటే ఆధునికాలుగానే పరిగణించవలసి వున్నది. కాని ఉపపురాణ, పురాణాలలోసైతం అనేకసందర్భాలలో ఉపనిషద్విషయాలను పేర్కొనడం తద్గతవాక్యాలను ఉదాహరించడం కూడా జరిగింది. అయితే యివి ప్రక్షిప్తాలుగా అనంతరకాలంలో చేర్చబడ్డాయేమోనని అనిపిస్తుంది. కొన్నిసందర్భాలలో సంస్కృతమూలపురాణోపపురాణాలలో లేనిచోట్లకూడా అనువాదకర్తలు తమ ప్రతిభాపాండిత్యాలను ప్రదర్శించడంకోసం తా మధ్యయనం చేసిన బహుళగ్రంథాలవిషయం యితరులకు తెలపడంకోసం పూర్వాపరకాలవ్యత్యాసనిర్ణయాల ఊహ లేకుండా చారిత్రకదృష్టికి భిన్నంగా పెక్కువిషయాలు ఉటంకించారు. ఇదేపద్ధతిలో నరసింహకవి సైతం వివిధసందర్భాలలో ఉపనిషద్విషయాలను పేర్కొన్నాడు. కొన్నిసందర్బాలలో ఉపనిషద్విషయం అని పేర్కొంటూ మరికొన్నిసందర్బాలలో అసలు ఉపనిషద్వాక్యాలను సైతం ఉదాహరించాడు. ఉపనిషత్తులలో వేదమంత్రాలు పేర్కొనబడి వ్యాఖ్యాతాలౌతాయి. కాబట్టి ఉపనిషత్తులలో పేర్కొనబడిన వేదమంత్రభాగాలను సైతం ఉపనిషద్వాక్యాలుగానే పేర్కొనడం జరిగింది. పరబ్రహ్మతత్త్వం గురించి వివరించే సందర్భంలో సూర్యునివల్ల ఆరోగ్యం, నలునివల్ల సంపద, శంకరునివల్ల బోధ, విష్ణువువల్ల ముక్తి పొందాలని ఉపనిషత్ప్రోక్తమైనట్లు నరసింహకవి యీ క్రింది పద్యంలో పేర్కొన్నాడు.
| "అర్కుని వలన నారోగ్య మాయె నలుని | |
(నారా. 327 పు. 37 ప.)
పరబ్రహ్మరహస్యార్థవిశేషాలను వర్ణిస్తూ, అనేక ఉపనిషద్విషయాలను ప్రత్యేకవిశిష్టతతో వివరించాడు. త్రిపాద్విభూత్యుపనిషత్తు వొకటి వున్నట్లు విజ్ఞులందరికీ తెలిసిన విషయమే. అయితే పరబ్రహ్మరహస్యార్థవిద్యాసాధనలో పురుషుడు అధిగమించవలసిన అత్యున్నతమైన లౌకికశక్తులలో త్రిపాద్విభూతిశక్తి వొకటి త్రిపాద్విభూత్యుపనిషద్విషయాలను జీర్ణించుకొని సిద్ధిపొందిన వ్యక్తి తద్విషయాలను అతిక్రమించగలడు. ఈ విషయాన్ని వేదప్రామాణ్యంగా వక్కాణిస్తూ నరసింహకవి యీ క్రింది పద్యం రచించాడు.