హీనత్వమే యేర్పడినా పదభ్రష్టతయే కలిగినా కేవల మానవదృష్టితోకాక ఆర్షవిజ్ఞానం దృష్ట్యా దైవీయదృక్పథంతో చూచినప్పుడు దేవత్వానికి, వేదత్వానికి భిన్నత్వం గోచరంకాదు. ఆర్షభాషావాఙ్మయవిజ్ఞానాలను దృష్టిలో పెట్టుకొని మనం పరిశీలించినప్పుడు స్వరపదాదుల అనులోమ, విలోమత్వాలతో అసలైన ఘనస్వరూపం నిరూపితమౌతుంది. ఒకానొకసందర్భంలో "ఘనము ఘనమని ఘనాఘనమని ఘనఘనమ్ముగ నెరుగు ఘనుడే జటావల్లభుడవు నతండే విటలాక్షుండగు నతండే" అని నేను వ్రాసిన చరణం నిజమైన దేవవేదఘనాపాఠిత్వానికి నిర్వచనం. అసలు ఘనాపాఠిలోని ఘనాశబ్దార్థమే తెలియని వేదపండితనామకులు దేవవేదస్వరూపాన్ని కాని, వేదదేవస్వరూపాన్ని కాని గుర్తించగలననుకొనడం హాస్యాస్పదం కాగలదు. "దేవ" శబ్దాన్ని స్వరాలతో పాటు అక్షరాలను సైతం వ్యత్యస్తం చేస్తే "వేద" శబ్దం రూపొందుతుంది. ఇదేవిధంగా "వేద" శబ్దాన్ని స్వరాలతో పాటు అక్షరాలను వ్యత్యస్తం చేస్తే "దేవ" శబ్దం రూపొందుతుంది. వేదఅనుష్ఠానపద్ధతి గాని, ఆర్షవిజ్ఞానరహస్యం గాని యీ వ్యత్యస్తపద్ధతిలోనే పరిగర్భితమై వున్నది. ఈ రహస్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వేదాలు దైవీయాలుగా పేర్కొనడం జరిగింది. మానవాళి అజ్ఞానంవల్ల పొరపాట్లు దొర్లవచ్చును గాని, భ్రమప్రమాదాలకు లోను కావచ్చునుగాని, యేమైనా దేవవేదాలు దేవవేదాలేగదా! ఈవిషయాన్ని నరసింహకవి "విష్ణుమహిమ - ఉభయపదప్రాప్తి" అన్న విషయాలను వివరిస్తూ "మహౌదార్య, సుశీలత్వ, వాత్సల్యాది నిజసద్గుణంబులతోఁ గూడినవాడై సర్వదేవవేదహృదయాహ్లాదముచే సిద్ధచతుర్దశమహాలోకంబులందు శ్రీ వైకుంఠశ్వేతద్వీపక్షీరాబ్దులయందును" (నార. 365-పుట, 193-వ) అని వేదదేవత్వాన్ని విస్పష్టంగా వక్కాణించాడు.
నరసింహకవి విభిన్నాలైన వేదవిషయాలను వివిధసందర్భాలలో నారదీయపురాణంలో వివరించాడు. కాలచక్రం గురించి వర్ణిస్తూ అది అధోముఖమై పరిభ్రమిస్తూ ఉంటుందని, త్రిగుణాత్మకమైన మధ్యభాగనాభిమిళితమై ఉంటుందని యీక్రింది పద్యంలో స్పష్టంగా పేర్కొన్నాడు:
| "ఘనతరమయి యసంఖ్యమయి బ్రహ్మలోక | |