శివపురాణము/యుద్ధ ఖండము/అంధకాసుర వథ

వికీసోర్స్ నుండి
(అంధకాసుర వథ నుండి మళ్ళించబడింది)

మరొక ఘట్టంతో ఈనాటి పురాణ శ్రవణానికి శ్రీకారం చుడతాను అని ఋషివర్యులందరినీ సాలోచనగా చూశాడు రోమహర్షణుడు.

అందరూ ఆనందంతో - ఆశక్తితో తలలు ఊపారు.

మందరగిరిపై విహారం చేసి, చాలా రోజులైనదని పార్వతి అనగా, పార్వతిని వెంట నిడుకొని శివుడు మందరగిరిని చేరుకున్నాడు.

అక్కడ విహరిస్తూండగా, శివుడు మహానందపరవశుడై తూర్పు దిక్కు చూస్తూ నిలబడివున్నాడు.

ఓ క్షణంపాటు మోహపరవశ అయిన పార్వతి వెనుక నుండి వెళ్లి చిలిపిగా, ఆయన కళ్లు మూసింది. దాంతో సమస్త లోకాలకూ చీకటి కమ్మినట్లయింది.

అంతలోనే కమ్మిన ఆ హఠాత్ - అంధకారానికి పార్వతి కూడా నివ్వెరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళనల వల్ల, అరచేతుల్లో స్వేదం కమ్మింది.

ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడిన అంధకారం సంఘటితమైనందున 'అంధకుడు' అనే ఓ గ్రుడ్డి బాలకుడు ఉద్భవించాడు.

హిరణ్యాక్ష - హిరణ్య కశిపులనే ఇద్దరు సోదరులలోను, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే మహాహరి భక్తుడైన కొడుకు ఉండగా, హిరణ్యాక్షుడికే ఎంతకాలానికీ సంతానం లేకపోవడంతో - అతడు శివునికై తపమాచరించుచున్న తరుణంలోనే ఈ బాలకుడు జన్మించడం జరిగింది. చీకటి వల్ల అతడు గ్రుడ్డిగా పుట్టాడు.

"తక్షణం తనకో పుత్రుడిని ప్రసాదించవలసింది"గా కోరిన ఆ అసురుని కోరిక తీర్చదలచి అంధకుడిని దత్తత తీసుకోమని వరంగా ఇచ్చేశాడు శివుడు. గ్రుడ్డి బాలుడని చింతపడ నక్కర్లేదనీ - అసమాన శౌర్య పరాక్రమంతో విలసిల్లగలడనీ అనుగ్రహించాడు. ఆ విధంగా హిరణ్యాక్షుడికి దత్తుడిగా వెళ్లడం అంధకుడు, అసురుడిగా చెలామణీ అయ్యాడు.

హిరణ్యాక్షుడు భూలోకాది సమస్తలోకాలనూ వశపరుచుకుని దేవతలకు పీడగా పరిణమించాడు. భూమినంతటినీ చాపలాగ చుట్టి సముద్రంలో పారేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ రాక్షస కృత్యానికి బాగా నలిగిపోయిన భూదేవి, శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా ఆయన వరాహావతారం ఎత్తి, భూదేవిని తన కోరలపైన నిలిపి, హిరణ్యాక్షుడిని నిర్జించాడు.

అంధకాసురుడు రాజయ్యాడు. సాధుస్వభావి అయిన అంధకుని, జ్ఞాతులంతా దాడిలో వశపర్చుకొని అతని రాజ్యం ఆక్రమించుకున్నారు. పుట్టిగ్రుడ్డివాడైన అంధకుడు అడవులపాలై బ్రహ్మను గురించి ఘోర తపమాచరించాడు. బ్రహ్మదత్త వరప్రభావం వల్ల తిరిగి తన రాజ్యాన్ని గెల్చుకొని ఇచ్చా భోగ సుఖా లనుభవిస్తూ,' కోరరాని కోరిక కోరేవరకు తనకు చావు ఉండదన్న' వర గర్వం చేత సంచరిస్తున్నాడు.

ఒకసారి అంధకుడు మందరపర్వతం పై విలాసినులతో విహరిస్తుండగా, అతిలోక సౌందర్యవతి అయిన ఓ స్త్రీని చూసినట్లు - ఆమె ఓ జడదారికి భార్యగా ఉన్నట్లు - చూడగా అతడామెను ఎక్కడినుంచో అపహరించి తెచ్చినట్లు కొందరు గూఢచారులు వార్త తెచ్చారు.

అందులో కొందరు ఆప్తులు మరింత ముందడుగు వేసి, "అసురేంద్రా! ఆ అతిలోక సౌందర్యరాశి ముందీ విలాసినుల వందమంది కూడా సాటిరారు" అని అతిశయోక్తి లేకుండానే చెప్పారు.

ఆ మాటలకు ఆ సుందరీమణులు అలిగి అక్కడినుండి తొలగిపోయారు. ఎలాగైనా అంతగొప్ప సుందరిని కూడి తీరాలన్న పట్టుదల అంధకుడికి తీవ్రమైంది.

ఆమె ఓ జడధారి ఆధీనంలోగదా ఉన్నది. ముక్కుమూసుకొని తపమాచరించు ముని మ్రుచ్చులకేల ముగ్ధ సౌందర్యం. అతడిని నయాన - భయాన బెదిరించి ఆ మానిని లొంగదీసుకోవడానికి అంతగా ఆలోచనలేల?...అనుకున్నవాడై,తాను ప్రభువు గనుక - స్వయంగా వెళ్లడం హీనకార్యం గనుక ముందుగా రాయబారం పంపాడు.

నిజానికి - తాను ఆ రుద్రాంశ సంభూతుడనీ, పార్వతీదేవి తనకు మాతృసమాన అనీ గ్రహించలేనంత మదించి ఉన్నాడు అంధకాసురుడు.

'పరాక్రమించడం వీర పురుష లక్షణం ' అని తిరుగు రాయబారం పంపాడు శివుడు.

"ఔరా! ఓ జడతాలుపు కింతధిక్కారమా?" అని యుద్ధ సన్నద్ధుడయ్యాడు అంధకుడు.

శివుడు తన త్రిశూలంతో అంధకుణ్ణి పైకెత్తి పట్టుకున్నాడు. అది అతని శరీరంలో మూడుచోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగాడు. అలా కొంతసేపు గడిచేసరికి అంధకుడిలోని కామ, క్రోధ, మాత్సర్యాలు మూడూ అణగిపోయాయి. ఒక్క లోభం మాత్రం వరప్రభావం చేత మిగిలిపోయింది. మదం - మోహం - కామం ప్రతిరూపాలే గనుక అవీ అణగిపోయాయి. అసురగుణాలన్నీ అణగి పోయినందున, ఈ పంచప్రాణాలూ ఎగిరి పోయినందున - అంధకాసుర వధ జరిగినట్లే భావించి దేవతలంతా సంతసించారు.

అలా త్రిశూలానికి వ్రేళ్లాడుతూ, అంధకుడు తానెవరో, ఎటువంటి కోరరాని కోరిక కోరాడో, తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని - సామగానంతో సాంబశివుడ్ని సంస్తుతించాడు. హర్షామోదాలతో సాంబమూర్తి అంధకుడ్ని కరుణతో చూసి గణాధిపతులలో ఒకడిగా మన్నించాడు".