శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదితొమ్మిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదితొమ్మిదవ అధ్యాయము)


శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదితొమ్మిదవ అధ్యాయము 1. మద్రాసు భజనసమాజము 2. తేండూల్‌కర్ (తండ్రి-కొడుకులు) 3. డాక్టర్ కాప్టెన్ హాట్ 4. వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు


ఈ యధ్యాయములో రుచికరములు అశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి.

1. మద్రాసు భజనసమాజము

1916 సంవత్సరములో రామదాసి పంథాకు చెందిన మదరాసు భజన సమాజ మొకటి కాశీయాత్రకు బయలదేరెను. అందులో నొక పురుషుడు అతని భార్య, అతని కూమార్తె. అతని వదినెయు నుండిరి. వారు పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహమదనగరు జిల్లా, కోపర్‌గాం తాలుకాలో శిరిడీ యను గ్రామమున సాయియనునొక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మస్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదారస్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు విద్యావంతుల కుళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణరూపముగా చాలా డబ్బు వసూలు చేసి, దానిని భక్తుకొండాజీ కూతురు 3 ఏండ్ల అమనికి ఒక రూపాయ, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమనితల్లికి 10 రూపాయలు మొదలకొని 20 రూపాయలు వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయి విని సమాజము శిరిడీకి వచ్చి యచట అగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో ముగ్గురు పేరాస గలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు. అమెబాబా యందు ప్రేమగౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నహరతి జరుగుచుండగా బాబా యామె భక్తి విశ్వాసములకు ప్రీతి జెంది యామె యిష్టదైవముయొక్క దృశ్యము ప్రసాదించెను. అమెకు బాబా శ్రీరామునివలె గాన్పించెను. కాని ఇతరులకు మామూలు సాయినాథునివలె గాన్పించెను. తన యిష్టదైవమును జూచి యామె మనస్సు కరిగెను. కండ్లనుండి యానందభాష్పములు కారుచుండగా అమె అనందముతో చేతులు తట్టెను. అమె యానందవైఖరికి తక్కినవారాశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి. జరిగిన దంతయి అమె సాయింకాలము తన భర్తతో చెప్పెను. అమె సాయిబాబాలో శ్రీరాముని జూచితిననెను. అమె అమాయక భక్తురాలగుటచే, శ్రీరాముని జూచుట అమె పడిన భ్రమ యని భర్త యనుకొనెను. అది యంతయి వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరు సాయిబాబాను జూడగా అమె శ్రీరాముని జూచుట యసంభవమనెను. అమె యా యాక్షేపణకు కోపగించలేదు. అమెకు శ్రీరామదర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు దురాశలు లేనప్పుడు, లభించుచునే యుండెను.

అశ్చర్యకరమైన దర్శనము

ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక యధ్బుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడీ పోలిసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి, యొక పంజరమున బంధించిరి. పోలిసువారు తాడుముడు మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి విచారముగా నతడిట్లనెను, "నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని, నీవు స్వయముగా నిచట నిలచి యుండగా ఈ యాపద నాపయి బడనేల?" బాబా యిట్లనెను: "నీవు చేసిన కర్మఫలితమును నీవే యనుభవింపవలెను!" అతడిట్లనెను, "ఈ జన్మ నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు." బాబా యిటులనెను: "ఈ జన్మములో కాకున్న గతజన్మలో నేమయిన పాపము చేసియుండవచ్చును." అతడిట్లనెను, "గత జన్మ నేమయిన పాపము చేసి యున్నచో, నీ సముఖమున దాని నేల నిప్పుముందర యెండ గడ్డివలె దహనము చేయరాదు?" బాబా "నీ కట్టి విశ్వాసము గలదా?" యని యడుగ అతడు ’కలదు’ అనెను. బాబా యప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో క్రింద బడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసువారు రక్తము కారుచు పడిపోయి యుండిరి. తాను బంధవిముక్తుడై యుండెను. అతడు మిక్కిలి భయపడి బాబావైపు జూచెను. బాబా యిట్లనెను, " ఇప్పుడు నీవు బాగుగ పట్టుబడితివి. అఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు." అప్పుడతడు ఇటుల విన్నవించెను. " నీవు తప్ప రక్షించు వారెవరును లేరు. నన్ను ఏటులయిన కాపాడుము." అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరచునంతలో, వాడు పంజరమునుండి విడుదలయినట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై బడెను.

బాబా యిట్లనెను. "ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకేమైన భేదము కలదా? బాగా యాలోచించి చెప్పుము!" అతడు ఇట్లునెను: "కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీవద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపములో నీవు మహమ్మదీయుడవై యుండి హిందువులను పాడు చేయుచుంటివని యనుకొనెడివాడను. " బాబా "నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా?" యని ప్రశ్నింప అతడు నమ్మనెను. అప్పుడు బాబా "నీ యింటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియి మీ యింటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పు డామెను మీరు శాంతింప జేయుట లేదా?" యనెను. అతడు దీనికంతటికి యొప్పుకొనెను. అప్పుడు బాబా ’నీ కింక ఏమి కావలె" నని యడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా యనెను. వెనుకకు తిరుగగనే యతనికి అశ్చర్యము కలుగునట్లు రామదాసస్వామి తన ముందర నుండెను. వారి పాదములపై బడగనే. రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాసగలవాడై యతడు బాబాతో యిటులనెను: "మీరు వృద్దులుగాగనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియునా?" బాబా, "నేను ముసలివాడ ననుచున్నావా? నాతో పరుగెత్తి చూడు" మనుచు పరుగిడ మొదలిడెను. అతడు కూడ వెంబడించెను. అధూళీలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్రనుండి మేల్కొనెను.

మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలిడెను. వాఅని మనోవైకరి పూర్తిగా మారి, బాబా గొప్పదనమును గ్రహించెను. ఆటుపిమ్మట వాని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలిగెను. బాబా పాదములపై అసలయిన భక్తి మనమున నుద్బవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని, యందుగల ప్రశ్నొత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి, ఆ మరుసటి యుదయ మందరు మసీదులో హారతికొరకు గుమిగూడియుండగా అతనికి బాబా రెండురూపాయల విలువగల మిఠాయిని, రెండురూపాయల నగదు నిచ్చి అశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులుండుమనెను. అతనిని బాబా అశీర్వదించి యిట్లనియె. "అల్లా నీకు కావలసినంత డబ్బు నిచ్చును. నీకు మేలు చేయును." అతని కచ్చట యెక్కువ ధనము దొరకలేదు. కాని అన్నిటికంటె మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా అశీర్వాదము. తరువాత ఆ భజనసమాజమునకెంతో ధనము లభించెను. వారు యాత్రకూడ జయప్రదముగా సాగెను. వారి కెట్టి కష్టములు ప్రయాణమధ్యమున కలుగలేదు. అందరు క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, అశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన అనందము గూర్చి మనమున చింతించుచుండిరి.

తన భక్తులను వృద్ధిచేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా యవలంబించిన మార్గములలో నొకటి చూపుట కీ లీల యొక యుదాహరణము. ఇప్పుటికి నిట్టి మార్గములను బాబా అవలంభించుచున్నారు.

2. తేండూల్కర్ కుటుంబము

బాంద్రాలో తేండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరు బాబా యందు భక్తి కలిగియుండిరి. సావిత్రీబాయి తేండూల్కర్ ’శ్రీ సాయినాథ భజనమాల’ యను మరాటీ గ్రంథమును 800 అభంగములు, పదములతో ప్రచరించెను. దానిలో సాయిలీల లన్నియు వర్ణింపబడెను. బాబా యందు శ్రద్దాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబు తేండూల్కర్ వైద్యపరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేసెను. వారు అతని జాతకము జూచి ఈ సంవత్సరము గ్రహము అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యామరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు ఆట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి శిరిడీకి పోయి బాబాను దర్శించెను. అమె బాబాకు అనేకవిషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడ చెప్పెను. ఇది విని బాబా యామెతో ఇట్లనియెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లొక్క ప్రక్కన ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణడగును. నాయందె నమ్మక ముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము." తల్లి యింటికి వెచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్దగా చదివెను పరీక్షకు కూర్చొనెను. వ్రాతపరీక్షలో బాగుగ వ్రాసెను గాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటిపరీక్షకు కూర్చొన నిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాతపరీక్షలో ఉత్తీర్ణుడాయెననియు నోటిపరీక్షకు రావలెననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని యాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహముల వ్యతిరేకముగా నున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును; మనల పరీక్షీంచును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదుకు విజయవంతమగును.

ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో నొక విదేశి కంపెనీలో కొలువుండెను. వృద్దులగుటచే సరిగా పనిచేయులేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలె ననుకొనెను, లేదా ఉద్యొగమునుండి విరమించుకొనుట నిశ్చయిమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యొగ విరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలాకాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత ఫించను ఇవ్వవలెననునది యాలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయిలు. పింఛను అందులో సగము 75 రూపాయలు, కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి యీవిషయమై వారందరు అతురతతో నుండిరి. తుడి నిర్ణయమునకు 15 రోజులు ముందు తేండుల్కర్ భార్యకు బాబా స్వప్నములో గనిపించి "100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండు ననుకొందును. అది నీకు సంతృప్తికరమా"? యనెను. అమె యిట్లు జవాబిచ్చెను. "బాబా నన్నేల యడిగెదవు" మేము నిన్నే విశ్వసించి యున్నాము." బాబా 100 రూపాయల అనినను, అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు.

3. కాప్టెన్ హాటే

కాప్టెన్ హాటె బికానేరులో నుండెడివాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా యతని స్వప్నములో గనిపించి, "నన్ను మరచితివా?" యనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని "బిడ్డ తల్లి మరచినచో అదెట్లు బ్రతుకును?" అనుచు తోటలోనికి బోయి తాజా చిక్కుడ కాయలు తెచ్చి స్వయంపాకము, దక్షిణను బాబా కర్పింపనుండగా, నతడు మేల్కొనెను. ఇది యంతయు స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నిటిని శిరిడీ సాయిబాబా వద్దకుపంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడనుండి 12 రూపాయలు మనియార్డురు ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు బంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని, 10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు శిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి యొక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడకాయలు కొని స్వయంపాకము సిద్దము చేసి కాప్టెన్ హాటె పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోనకర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబా కర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడ కాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితునికి ద్వార తెలిసికొన్న హాటే సంతోషమున కంతు లేకుండెను.

పవిత్రము చేసిన రూపాయి

ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్ర మొనర్చిన రూపాయి నుంచవలెనని కోరిక గలిగెను. శిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వానిద్వార హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు శిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా దానిని జేబులో వేసికొనెను. తరువాత హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి, తన కుడిచేతి బొటన వ్రేలుతో పై కెగురవేసి యాడి, ఆ స్నేహితునితో నిట్లనెను: "దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడ ఇచ్చి వేయుము. నాకేమి యక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండుమనుము." ఆ స్నేహితుడు గ్వాలీయర్ తిరిగి వచ్చెను. హాటెకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈ సారి హాటే మిక్కిలి సంతుష్టిజెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కొరిక యథప్రకారము నెరవేర్చెనని సంతసించెను.

4. తేండూల్కర్ కుటుంబము

చదువరు లింకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికి నొక ప్రక్క సీతారామలక్ష్మణులును, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబా కిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమొనర్చి ఊదీ ప్రసాదములతో తన కివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసికొనెను. శ్యామా, నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా యిట్లునెను, "దీని నేల అతనికివ్వవలెను? దీనిని మనమే యుంచుకొందము. అతడు 25 రూపాయ లిచ్చినచో తిరిగి వానిది వాని కిచ్చెదము." ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా యిట్లనెను. "ఆ నాణెము విలువ 25 రూపాయలు కంటే యెంతో ఎక్కువ. శ్యామా! యీ రూపాయిని దీసికొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ పూజామందిరములో బెట్టి పూచించుకొనుము." బాబా యొందులకీ మార్గము నవలంభించిరో యడుగుట కెవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియును.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు