పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

మహాపురుషుల జీవితములు



బట్టుకొని ప్రాణములువిడిచిన హిందువుఁడితడొక్కఁడేయని చెప్పవచ్చును. అతఁ డేదిచేసినను సగముసగము చేయక సంపూర్ణముగఁ జేయును. అతడు మనోవాక్కాయ కర్మములందు సత్యమే యాచరించుచు వచ్చినందున యబద్ధమును బరమశత్రువునట్లు ద్వేషించును. 1853 వ సంవత్సరమున నార్టను దొరగారింగ్లాండులో పార్లమెంటు సభవారివద్ద హిందూ దేశస్థితిగతులఁగూర్చి సాక్ష్యమిచ్చు సందర్భవశమున రంగనాథశాస్త్రి ప్రశంసరాఁగా "నతడు బుద్ధికుశలతయందు దెల్లవారితో సమానుఁడనియు నింగ్లాండు సర్వకళాశాలలో జదివిన పక్షమున నతఁడు మిక్కిలి గొప్పవాఁడై యుండు" ననియుఁ జెప్పెను.

ఇంగ్లీషులో నతఁడు సులభశైలిని మనోహరముగ వ్రాయఁగలఁడు. ఏభాష నతఁడు చదివినను మంచికవుల గ్రంథముల నుండి యెన్నో పద్యములు కంఠ పాఠముగ వల్లించును. అతని గ్రంథ భాండారములో మూడువేల పుస్తక సంపుటములుండెను. ప్రతిపుస్తకమందు జదివినట్లానవాలుగా చేతిమరకలుఁ గూడనుండును. అతఁడేదైన నొకసారి చదివిన నర్థమగును. రెండవసారి చదివెనా కంఠపాఠముగ వచ్చును. మూడవసారి చూచెనా మనసులో నొకమూల స్థిరమై యుండిపోవును. అతఁ డరబ్బీ పారసీభాషలను మహమ్మదీయ పండితుఁ డట్లవలీలగ మాటలాడగలఁడు. ఇంగ్లీషులో మంచికవులు లేరనియుఁ గవులను బిరుదునకుఁ దగినవారు మన యాసియాఖండములోనేగాని యూరపులో లేరని వాని యభిప్రాయము. విద్యను ధనముకొఱకుగాక కేవలము జ్ఞానముకొఱకే యతఁడు నేర్చికొనెను. అందుచేతనే యతఁడు చనిపోవు నప్పటికి పదునాలుగు భాషలలోఁ బండితుఁడై పదునేనవభాషయగు హీబ్రూ నేర్చికొనుచుండెను. సంస్కృత మతనికిఁ బ్రాణపదమైనభాష ఆభాషలోనతఁడు చదువని పుస్తకము లేదు. ఒక్కొక్కదాని కెంతో సొమ్మిచ్చి యతఁడు