పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్ సయ్యద్ మహమ్మదుఖాను

239



స్వాధీనమునుండి తప్పించి యింగ్లీషువారు కలుపుకొనుట పితూరీకి ముఖ్యకారణమని హిందూదేశములో గొప్పవా రభిప్రాయపడినను ఖానుగా రదియొక కారణముగ దలంపరైరి. ఈవిధముగ సిపాయి పితూరీలో దొరలకుఁ జేసిన సాయమునుబట్టి యతఁడు మహాప్రఖ్యాతుఁడైనను కేవల మదియే యతని ప్రఖ్యాతిఁ గారణమని దలంపఁగూడదు. బాల్యమునుండియు నతనికి విద్యావ్యాసంగము మీఁదగల యభిరుచి చేతను తనతోడి తురకల యవస్థను విద్యాభ్యాసాదుల యందు వృద్ధిచేయుటకుఁ బడిన పాటు చేతను వానికి మహాప్రసిద్ధి గలిగెను. పురాతన శిలాతామ్రశాసనములను వెదకి పూర్వచరిత్రముల నరయుటలో నతనికి బాల్యమునుండియు నభిరుచి గలదు. ఆ విషయమున జాల ప్రయత్నముచేసి యతఁడు 1847 సంవత్సరమున ఢిల్లీ ప్రాచీన చరిత్రమును వ్రాసి ప్రకటించెను. ఈ గ్రంథమును ఫ్రెంచివాఁ డొకఁడు తన భాషలోనికి మార్చుకొనెను. అందువలన నతనికి యూరపుఖండమునందు సయితము మేలు కలుగ లండను పట్టణములోని రాయలేషియాటిక్కు సంఘమువారు వానిని దమ సభలోఁ జేర్చికొనిరి. అహమదుఖాను స్వమతాభిమాని, అందుచేత స్వదేశాభిమాని యని గూడ చెప్పవచ్చును. అట్టి యభిమానముండుటచేతనే 1860 సంవత్సరమం దతఁడు హిందూదేశపు మహమ్మదీయుల రాజభక్తి యను బేరుపెట్టి యొక చిన్న పుస్తకమును వ్రాసెను. మహమ్మదీయులు చాల విశ్వాసముగలవారనియు వారిలో గొందఱు సిపాయిపితూరీలో దొరతనమువారికి జాల సాయము జేసిరనియుఁ దెలుపుటయే యీ గ్రంథరచనలో వాని ముఖ్యోద్దేశము తనతోడి తురకలు మిక్కిలి దీనదశలో నుండుటకుఁ గారణము నతఁడు చిరకాలము విచారించి విద్యావిహీనతయే వారి భ్రంశమునకు హేతువనిసిద్ధాంతీకరించెను. చదువేతురకలగుసర్వార్ధ సాధకమని