పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజా సర్ దినకరరావు

197

చూచి విడుచుట మంచిదని యాలోచింపఁ దొడఁగెను. అట్టిసమయమున దినకరరావుయొక్క బుద్ధినిపుణతచేత సింథ్యామహారాజు తన ప్రయత్నము మానుకొనియెను. సైనికు లింగ్లీషువారిమీఁదికిఁ దమ్ము పంపుమని పలుమారు వేఁడుటచే దినకరరావు మేరమీరినవారి యుత్సాహమును మాన్పలేకపోయినను వారు పితూరి దారులతోఁ గలసి దొరతనమువారిమీఁద బడకుండ నెప్పటికప్పు డేవో వంకలు చెప్పి యాపజాలెను. అధికమయిన బుద్ధినిపుణత యుండుట చేతనే పితూరిదారులు గ్వాలియరు సంస్థానమున ప్రవేశించినపుడయిన తమ సైనికులు వారితోఁ జేరకుండ నాప గలిగెను. అప్పటి రెసిడెంటుగారు దినకరరావువలననే సింథ్యామహారాజు రక్షింపఁబడెనని స్పష్టముగాఁ బలికెను. ఆయన చేసిన పనినిగూర్చి యొక దొరగా రీక్రింది విధముగ వ్రాసిరి. "ఆకళవళములో దినకరరావు తనయజమానికి జేసిన యుపకారమిట్టిదియని చెప్పనలవికాదు. అతఁడు తన స్వామియెడల మూర్తీభవించిన రాజభక్తియయి యడ్డమువచ్చినదాని నెల్ల దుడిచిపెట్టుచు మహావేగముతో వచ్చిన యా సంక్షోభమునకు మూర్తీభవించిన ధైర్యమయి మెలఁగెను. అత్తరి నాంగ్లేయ ప్రభుత్వమునం దాఁతడు చూపిన యాదరము నాంగ్లేయుల కతఁడు చేసినసహాయము నప్పుడది చూచినవారు స్వయముగ ననుభవించినవారు జన్మమధ్యమున మరచి పోఁదగినది కాదు." 1859 వ సంవత్సరమున గవర్నరుజనరలుగారకు కానింగుప్రభువుగారు ఢిల్లీలో నొక దర్బారు చేసి యచ్చటికి దినకరరావును రావించి యతఁడు చేసిన యుపకారమునకుఁ గృతజ్ఞుఁడయి వందనములు సేయుటయేగాక కాశీజిల్లాలో నొక జాగీరును బహుమాన మిచ్చెను.

1859 వ సంవత్సరమున దినకరరావు గ్వాలియరులో మంత్రి యుద్యోగమును మానుకొనెను. అనంతరము కొంత కాలమునకు